MBNR: జిల్లా కేంద్రంలోని రామయ్య భౌలీ కాలనీలో గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మథిన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విందులో పాల్గొని ముస్లింల చేత ఉపవాసాన్ని విరవింపజేశారు. రంజాన్ మాసం పవిత్ర మాసంగా పేరుగాంచిందని, ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఆ అల్లా వారిపై కృప ఉండాలని కోరారు.
NZB: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నిజామాబాద్ చేరుకుంటారు. కలెక్టరేట్ గ్రౌండ్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
KKD: వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 28 మంది మృతి చెందారని ఎస్పీ బిందుమాధవ్ ధ్రువీకరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరారీలో ఉన్న కేంద్రం నిర్వాహకులు అడబాల నాని, అర్జున్లను రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. లైసెన్సులతో పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నామని, వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ గురువారం అమరావతిలో CM చంద్రబాబును కలిశారు. జిల్లాలోని గ్రంథాలయాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రితో చర్చించారు. మండల కేంద్రాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, పోటీ పరీక్షల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, నూతన భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విన్నవించారు.
WGL: నగరంలోని లేబర్ కాలనీకి చెందిన కల్పవల్లి ఫైనాన్స్ యజమాని వెంకటేశ్వర్లు చీటీలు నిర్వహిస్తూ వందలాది మందినుంచి డబ్బులు వసూలు చేసి చెల్లించకుండా పరారైయ్యాడు. దీంతో బాధితుడు పోరండ్ల సునీల్ ఫిర్యాదు మేరకు 2022 మే 2న పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం కేసు విచారణకు రాగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీ. బీ నిర్మలా గీతాంబ ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.17వేల జరిమానా విధించారు.
సత్యసాయి: కదిరిలో వెలసిన ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు గురువారం సాయంత్రం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు శాస్త్రోక్తంగా వాహన సేవను నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు 15 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
T20 WC-2026లో భాగంగా టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీ ఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్పై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. కాగా, 2021 టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. అందులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ప్రస్తుతం T20 ఫైనల్లోనూ న్యూజిలాండ్, భారత్ తలపడనున్నాయి.
GNTR: నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డిస్ప్లే ఫీజులు చెల్లించని బోర్డులను తొలగించాలని కమిషనర్ మయూర్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో రూ. 7 కోట్లకు పైగా బకాయిలు ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిదారుల వివరాలను సేకరించి, బోర్డులను తొలగించేందుకు తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
NLG: 15వ ఆర్థిక సంఘం ద్వారా చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు రూ. 1,03,75,769 అన్టైడ్ నిధులు రెండు విడతలుగా విడుదలయ్యాయి. గ్రామ జనాభా ప్రాతిపదికన ఈ నిధుల కేటాయింపు జరిగింది. అత్యధికంగా వెలిమినేడు జీపీకి రూ. 13,97,267, గుండ్రాంపల్లికి రూ. 9,09,050 జమ కాగా.. అతి తక్కువగా బొంగోని చెరువుకు రూ. 1,44,664, వెంబావికి రూ. 2,44,777 నిధులు వచ్చాయి.
WNP: మదనాపురం మండలం ఆత్మకూర్- మదనాపూర్ గ్రామాల మధ్య ఉన్న 90 ఏ నంబర్ రైల్వే గేటును ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇవాళ్టి నుంచి ఈనెల 8 వరకు మూడు రోజులు మూసివేయనున్నట్లు రైల్వే అధికారి ప్రవీణ్, వనపర్తి రోడ్డు స్టేషన్ మాస్టర్ రామకృష్ణ తెలిపారు. ఈ కారణంగా సమీప గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
NLR: ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు.
MBNR: పురపాలక కమిషనర్ రామానుజులు రెడ్డిని మహబూబ్నగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రవీణ్, రమేష్, కమిటీ కార్యవర్గ సభ్యులు అంజయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 17వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. దీంతో 17న వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
BPT: జిల్లాలో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని గురువారం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 3 వేల మందితో, ప్రతి నియోజకవర్గంలో 500 మందితో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వేడుకల్లో భాగంగా వివిధ శాఖల స్టాల్స్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
AP: రాష్ట్రంలోని ఆశావర్కర్లకు కొత్త ఫోన్లు, రెండు కొత్త చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. NHM ప్రకారం ఇతర ఉద్యోగుల మాదిరి లాగానే ఇకపై సెలవులు ఇస్తామని ప్రకటించారు. దహన సంస్కారాలకు రూ.15 వేలు, బీమా సౌకర్యం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 1363 ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.