సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వేది పత్రాలు అందిస్తున్నామన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
SDPT: హుస్నాబాద్ జ్యోతి నగర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మండల మహేష్, తన తల్లి సారవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
SRPT: కోదాడలో కల్తీ వంటనూనె తరలిస్తున్నారన్న ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈరోజు కోదాడలో పోలీసుల సహకారంతో ట్యాంకర్, ఆటోను తనిఖీ చేసి రైస్ బ్రాన్ ఆయిల్ నమూనాలను సేకరించి హైదరాబాద్లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపారు. నివేదికలో కల్తీ అని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
AP: మాజీ డీజీపీ HJ దొర మృతిపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించిన అధికారిగా HJ దొర సేవలను జగన్ గుర్తుచేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతకు ఆయన కృషి చేశారని తెలిపారు. పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద లారీ–బైక్ ఢీకొనడంతో మెట్టుపల్లి గ్రామంకు చెందిన ఇద్దరు యువకులు గాయపడ్డారు. అంతడుపుల నరేష్ తలకు తీవ్ర గాయం కాగా, వంగల సంపత్ రెడ్డి కాలు విరిగింది. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది గాయపడిన వారిని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
JGL: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష కేంద్రాల 200 మీటర్ల పరిధిలో గుంపులు, సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని వెల్లడించారు.
TG: రాష్ట్రంలోని బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్ను ఆర్జీయూకేటీ బాసర వీసీ గోవర్దన్ విడుదల చేశారు. మార్చి 16న నోటిఫికేషన్, మార్చి 18 నుంచి మే 10వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.
SRPT: మోతే మండలం మామిళ్ళగూడెం గ్రామ శివారులోని చెరువులో ఓ వ్యక్తి ఈరోజు ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లిలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి తనిఖీ చేశారు. ‘డ్రై డే’ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి ట్యాంకుల శుభ్రతను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇందులో ఎంపీడీవో విజయ్ కుమార్, సర్పంచ్ పాల్గొన్నారు.
వికారాబాద్ పట్టణంలో నేర నియంత్రణ కోసం ఏర్పాటు చేసే సీసీ కెమెరాల కోసం 22వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీకాంత్ రెడ్డి రూ. లక్ష విరాళం అందించినట్లు పట్టణ సీఐ రఘు కుమార్ తెలిపారు. ఇలాంటివారు ముందుకు వస్తే పట్టణంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా నీడలో పట్టణాన్ని ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ADB: ఆదిలాబాద్ నుండి దహిగూడకు బస్సు సౌకర్యం కల్పించాలని వాన్వట్ సర్పంచ్ మెస్రం భుజంగరావు, పిప్పల్దరి మండల సాధన కమిటీ అధ్యక్షులు తెలంగ్ బాపురావ్ శుక్రవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం నుంచి రూరల్ మండలం పిప్పల్దరి మీదుగా దహిగూడ వరకు బస్సు సౌకర్యాలు కల్పించాలని కోరారు.
గుంటూరు SVN కాలనీ మెయిన్ రోడ్డు విస్తరణలో భాగంగా శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు SVN కాలనీ, గుజ్జనగుండ్లలోని కొంత ప్రాంతంనకు విద్యుత్త్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ టౌన్ ఏఈ పి. హుస్సేన్ ఖాన్, డీఏఈ ఎన్. గురవయ్య తెలిపారు.
MDK: తూప్రాన్లో నలు దాబాలు, హోటళ్లపై దాడులు చేసి గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సీఐ రంగ కృష్ణతో కలిసి ఈ దాడులు చేసినట్లు వివరించారు. ఈ క్రమంలో 18 గృహ అవసరాల సిలిండర్లను సీజ్ చేసినట్లు వివరించారు. వారిపై 6 ఏ కేసు నమోదు చేస్తామని తెలిపారు.
NGKL: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులకు అమ్రాబాద్ మండలం మన్ననూర్ వద్ద జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. శ్రీశైలం వెళ్తున్న క్రమంలో గెస్ట్ హౌస్ వద్ద కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.