JGL: ధర్మపురి పట్టణంలోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆశా కార్యకర్తలు ముట్టడించారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు గేట్లు తీసుకుని లోపలికి వెళ్లి క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సంఘం నాయ కులు మాట్లాడుతూ పెండింగ్లోని కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
HYD: బాలాపూర్లోని 31 ఎకరాల భూదాన భూములను ఇళ్లు లేని పేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ, తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాయి.
ADB: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించిందని PRTU TS జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్ శనివారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెండింగ్ బిల్లులు, డీఏ విషయంలో వాటిని ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. ఉచిత పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యత విద్యారంగానికి ఇవ్వలేదని కృష్ణ కుమార్ పేర్కొన్నారు.
కోనసీమ: యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అముడా చైర్మన్ స్వామి నాయుడు పాల్గొన్నారు.
TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ డ్రైవర్ శరత్ ద్వారా అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. అభిషేక్ ఇప్పటివరకు ఏకంగా 24 సార్లు రోహిత్కు మత్తు పదార్థాలు అందించినట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్ నెట్వర్క్తో సంబంధమున్న ప్రముఖుల కోసం సిట్ ఆరా తీస్తోంది.
W.G: భీమవరం కలెక్టరేట్లో గృహ గణనపై శుక్రవారం తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో DRO శివన్నారాయణ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ.. గృహ గణన కార్యక్రమం విజయవంతంగా అమలు కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచి పటిష్టమైన ఏర్పాట్లు అవసరమని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా, నిష్పాక్షికంగా సమాచార సేకరణ జరిగేలా చూడాలని సూచించారు.
తిరుమలలో వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబోరేటరీ సిద్ధమైంది. రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ల్యాబ్ను కాసేపట్లో CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రసాదాల్లో వినియోగించే ముడిసరకును తనిఖీ చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. సూక్ష్మస్థాయిలో కల్తీ జరిగినా గుర్తించేలా పరీక్షలు చేయనున్నారు. ఈ తరహా ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.
BDK: భద్రాచలం సమీపంలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా తాజాగా శనివారం మరో ఇద్దరు సతీష్, తేజ మృతదేహాలు లభ్య మవడంతో గాలింపు చర్యలు పూర్తయ్యాయి. నిన్నటి గాలింపులో ముగ్గురి మృతదేహాలు దొరకగా, మిగిలిన ఇద్దరి కోసం నేడు గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహాలు బయటపడ్డాయి.
BDK: రైతులు క్రిమిసంహారకాల రసాయనాలను తగ్గించి ఆర్గానిక్ పద్ధతులను అవలంభించాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు యారం లక్ష్మిరెడ్డి మిర్చి పంటను ఐటీడీఏ పీవో రాహుల్ శుక్రవారం పరిశీలించారు. ఆర్గానిక్ పంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధరలు వస్తాయని గుర్తు చేశారు.
కృష్ణా: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేవని జేసీ నవీన్ అన్నారు. వినియోగదారులకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత, మరో సిలిండర్ బుక్ చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు 45 రోజులు, పట్టణ ప్రాంతాలలో 25 రోజులుకు బుక్ చేసుకోవాలన్నారు.
WGL: నర్సంపేట డివిజన్కు చెందిన ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మిక శాంతిని, సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. రంజాన్ పండుగ సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరారు.
‘ధురంధర్ 2’ మూవీ విడుదలైన 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.331 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు Sacnilk తెలిపింది. భారత్లో రూ.267 కోట్లు, ఓవర్సీస్లో రూ.64 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ప్రివ్యూస్తో రూ.51కోట్లు, తొలిరోజు రూ.121 కోట్లు, రెండోరోజు రూ.96 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పింది. మరో 2 రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది.
NGKL: నాగర్కర్నూల్ డిపో నుంచి ఈ నెల 27న ప్రత్యేక గోవా టూర్ ప్రారంభం కానుంది. సూపర్ లగ్జరీ బస్సులో మూడు రోజుల యాత్రకు ఒక్కొక్కరికి రూ.3,500 ప్యాకేజీ నిర్ణయించినట్లు డీఎం యాదయ్య తెలిపారు. ఆసక్తి గల వారు 9490411590, 9490411591 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ తక్కువ ధర ప్యాకేజీని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
HYD: నగరంలో కాలుష్యం పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం గోపనిపల్లి తండాలో ఏకంగా AQI 189గా నమోదైంది. వాహనాల పొగ, చెత్త దహనం ఎయిర్ పొల్యూషన్కు ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు. దీనికి తోడు సిటీలో కట్టెల పొయ్యిల వాడకంతో గాలి నాణ్యత మరింత క్షీణించింది. శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి స్నేహ శబరీశ్ను, TDP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ కోండపల్లి రామచందర్ రావు, మాజీ అధికార ప్రతినిధి ప్రేమ్ చంద్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.