HYD: రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.
PDPL: పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం కొత్త గేట్ వద్ద నుంచి పాత గేట్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్టు కొమ్మలను జేసీబీ సహాయంతో తొలగించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన రహదారులు, రైల్వే గేట్లగుండా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
SRPT: శుభకార్యానికి వెళ్లివస్తూ అదుపు తప్పి కారు పల్టీ కొట్టిన ఘటన గురువారం సాయంత్రం నడిగూడెం,ఆర్సీపురం రహదారిలో చోటుచేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్సై గంధమల్ల అజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్లో గురువారం షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100, టీ-సేఫ్ యాప్లను ఎలా ఉపయోగించాలో వివరించారు. మహిళల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆత్మరక్షణలో ధైర్యంగా ఉండాలని అధికారులు సూచించారు.
NLG: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57,353 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 103 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
KNR: వచ్చే నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బందికి పరీక్షలు ముగిసే వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించి, 100% ఉత్తీర్ణత సాధించేలా చూడాలని సూచించారు.
కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ భాస్కర్ తెలిపారు. బాన్సువాడ (2) ఎల్లారెడ్డి (3) మద్నూర్ (1) పిట్లం (1) కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 26వ తేదీన తమ అసలు ధ్రువపత్రాలతో కలెక్టరేట్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.
JGL: కోరుట్ల-అయిలాపూర్ మీదుగా యూసుఫనగర్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్పై ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అయిలాపూర్లో రోడ్డుకు అడ్డంగా నిలిపిన ద్విచక్ర వాహనాన్ని తొలగించమని డ్రైవర్ చెప్పడంతో వాగ్వివాదం ఏర్పడి, యువకులు దాడికి పాల్పడ్డారని ఎస్సై చిరంజీవి తెలిపారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
JGL: పెగడపల్లి మండలంలో సాదా బైనామా భూ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ఆనంద్ కుమార్ తెలిపారు. మండలంలో మొత్తం 1840 సాదా బైనామా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఇందులో నుంచి 1791 దరఖాస్తులను పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయానికి పంపించామని, 49 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
NZB: నవీపేట్ మండలంలోని యంచ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు పోశెట్టి చేపలు పట్టుకొని తిరిగి వస్తుండగా రైలు పట్టాలను దాటే సమయంలో దేవి ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోశెట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ASF: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని కలెక్టర్ హరిత అన్నారు. కాగజ్ నగర్ మైనారిటీ సంక్షేమ పాఠశాలలో ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల నూతన సర్పంచ్లకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లదే కీలక భూమిక ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపట్టే పలు సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు.
KNR: చిగురుమామిడి గ్రామంలో వచ్చే వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడానికి గ్రామ సర్పంచ్ ఆకవరం భవాని ఆధ్వర్యంలో ఎంపీవో ఎండీ ఖాజా మొయినుద్దీన్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జ్ఞానేశ్వరిలు గ్రామంలో పర్యటించారు. నీటి ట్యాంకుల రిపేరులు, గేట్ వాల్స్ రిపేర్స్, నూతన పైపులైన్లు వేసి చేతి పంపు మెటీరియల్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు.
JGL: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 43 రోజులకు గాను 14 హుండీలను కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో శ్రీ లలితా సేవాట్రస్ట్చే గురువారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,16,04,438 నగదు, 199 విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే వచ్చిన వెండి, బంగారాన్ని ఒక బ్యాగ్లో వేసి సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరిచినట్లు వెల్లడించారు.
సిరిసిల్ల పట్టణం B.Y నగర్ లోని యశ్వసిన్ మండప్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశభక్తి, పరాక్రమం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్: గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో 6-10 తరగతుల్లో దరఖాస్తులను ఆహ్వానించారు అని ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7-10 తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని, ఈ నెల 28లో https://tgms.telangana.gov.inలో దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఉంటుందని పేర్కొన్నారు.