SRCL: వీర్నపల్లి(M) వన్పల్లి, మద్దిమల్ల రూట్లో తిరిగే బస్సుల సమయాల్లో మార్పులు జరిగాయి. SRCL-VNPకు ఉదయం 5.40, 10.15, 11.00, 01.30, 3.15, 4.45, 8.15కు బయలు దేరుతుంది. అలాగే వన్పల్లి నుంచి 4.00, 7.00, 11.45, 1.15, 3.00, 5.00, 6.00లకు రిటర్న్ అవుతుంది. సిరిసిల్ల-మద్దిమల్లకు 6.00, 11.15లకు తిరిగి మద్దిమల్ల నుంచి 7.30 AM, 01.00PMకు బయలు దేరుతుంది.
నిజామాబాద్ పొట్టి శ్రీరాములు చౌరస్తాలో పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా పొట్టి శ్రీరాములు సేవలను స్మరించారు.
HYD: ఇవాళ రాత్రి పలు ఫ్లై ఓవర్లపై వెళ్లేందుకు అనుమతి లేదని సిటీ ట్రాఫిక్ చీఫ్ జోయల్ డేవిస్ తెలిపారు. షబ్-ఏ-ఖదర్-జగ్నేకి-రాత్ సందర్భంగా రాత్రి 10 గంటల తరువాత ఈ నిబంధనలు అమలవుతాయన్నారు. జూపార్క్-ఆరాంఘర్ ఫ్లై ఓవర్, బహదూర్పురా ఫ్లై ఓవర్, చంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్, డాక్టర్ అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్లపై టూ వీలర్లను అనుమతించబోమన్నారు. వాహదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ADB: జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన ఓరే రామ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆదివారం రాత్రి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థించారు. పరామర్శించిన వారిలో నాయకులు ముఖిద్, అర్జున్, సయ్యద్, సబీర్ తదితరులున్నారు.
MNCL: మంచిర్యాల-పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి సోమవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండగా.. తెలుపు పూల షర్ట్, బూడిద రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MBNR: గద్వాల్,నారాయణపేట చీరలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. కాంచీ, బెనారస్ చీరలతో పోల్చితే.. తక్కువ ధరలకు నారాయణపేట, గద్వాల చీరలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయన్నారు. నైపుణ్యాలను పెంచుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సరైన రీతిలో వినియోగించుకుంటే చేనేత వృత్తిదారులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
KMR: రంజాన్ మాసం విలువైన రాత్రులను నిర్లక్ష్యం చేయకుండా తహజ్జాద్, తరావీహ్ ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ఉపయోగించుకోవాలని మౌలానా ఇస్మాయిల్ నవ్సారీ అన్నారు. ఆదివారం రాత్రి బాన్సువాడలోని మదీనా మసీదులో జరిగిన షాబ్-ఏ-ఖాదర్ సమావేశంలో మాట్లాడారు. రంజాన్ అనేక రాత్రులు గడిచిపోయాయని అల్లాహ్ను సంతోష పెట్టడానికి ఎక్కువగా ప్రార్థనలు నిర్వహించి క్షమాపణ కోరాలన్నారు.
NGKL: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, వ్యాపార సముదాయాలపై తహశీల్దార్ సైదులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న 42 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా గృహ అవసరాల సిలిండర్లు వాడుతున్న యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
PDPL: గోదావరిఖనిలోని రామగుండం పాత మున్సిపల్ కార్యాలయంలో దావత్-ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రంజాన్ త్యాగానికి, కరుణకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.
KNR: ఇల్లందకుంటలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఇల్లందకుంటలో పలువురికి ఇండ్లు మంజూరు కావడంతో సర్పంచ్ దార సురేష్ హాజరై భూమిపూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోందని, పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని అద్దె భవనంలో కొనసాగుతున్న కార్మిక శాఖ కార్యాలయాన్ని స్థానిక ఆర్అండ్ బీ అతిథి గృహానికి మార్చినట్లు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజలింగు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాలయాన్ని ప్రభుత్వ భవన సముదాయంలోకి తరలించామన్నారు. ఇకపై కార్మికులు, ప్రజలు తమ సమస్యల కోసం R&B అతిథి గృహంలోని నూతన కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లిగడ్డ సమీపంలో సోమవారం ఉదయం పాల వాహనం బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట నుంచి హుజురాబాద్కు వెళ్తున్న పాల వ్యాను వెనుక టైరు ఓడిపోవడంతో వాహనం అదుపుతప్పి, రోడ్డు ప్రక్కన కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.
MDK: సదాశివపేట మండలం సిద్ధాపూర్లో సందీప్ కుమార్ (24) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇంటికి వెళ్లి కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన సందీప్,ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసినారు.
NRPT: నారాయణపేట మండలం బోయిన్పల్లి గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లను సర్పంచ్ వెంకటేశ్ ఘనంగా సన్మానించారు. గ్రామ పరిశుభ్రత, పౌర సౌకర్యాల అభివృద్ధికి వారి కృషి అత్యంత విలువైనదని, వీరే గ్రామ అభివృద్ధి వెన్నుముక అని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సూర్య, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొని వారిని అభినందించారు.
KMR: కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి, సరంపల్లి, నరసన్నపల్లి, పాతరాజంపేట చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు కాస్త ఊరట లభించినప్పటికీ మామిడికాత రాలిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.