MDK: రేగోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి డా. వికాస్ తెలిపారు. గైనకాలజీ, పిల్లల, కంటి, ఆర్థోపెడిక్, డెంటల్ నిపుణులు సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులు కూడా రోగులను పరీక్షించి అవసరమైన సూచనలు ఇస్తారని చెప్పారు.
మహబూబ్ నగర్ యెనుగొండ పీఎంశ్రీ కేంద్రీయ విశ్వవిద్యాలయం టీచర్ పోస్టులకు (కాంట్రాక్ట్ ప్రతిపాదిక) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. PRTS, BALVATIKA Teacher, PGT (కంప్యూటర్ సైన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్, Vocational/ATL Instructor) ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తారని ప్రిన్సిపల్ వై.సురేందర్ తెలిపారు.
MDCL: HYD మున్సిపల్ వ్యవస్థలో అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. చేయని పనులకు కూడా బిల్లులు తయారు చేసి కమిషన్లు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కూకట్ పల్లి జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి చెరువులో గుర్రేపుడెక్క తొలగింపు పనికి సంబంధించిన రూ.1.4 కోట్ల బిల్లును క్లియర్ చేయడానికి రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విషయం తెలిసిందే.
PDPL: క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని DMHO డాక్టర్ ప్రమోద్ కుమార్ సూచించారు. మార్చి 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 7 డిసెంబర్ 2025 నుంచి 17 మార్చి 2026 వరకు జిల్లాలో 1421 క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు.
RR: బీఎన్ రెడ్డి డివిజన్ హరిహరపురం కాలనీలోని శ్రీ త్రిశక్తి దేవస్థానంలో మంగళవారం శుద్ధ షష్టి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కళ్యాణం వైభవంగా జరగనుందన్నారు. అనంతరం ప్రసాద వితరణ చేపడతారు. భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవాలయ కమిటీ కోరింది.
WGL: HYDలోని ఓ హాస్టల్ యజమాని కూతురు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన గీసుకొండకు చెందిన రంజిత్ (26)ను SRనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంజిత్ ప్రైవేటు సంస్థలో పని చేస్తూ, బాపూనగర్ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్ యజమాని కూతురు బాత్రూంలో ఉన్నప్పుడు కిటికీ ద్వారా ఫోన్లో వీడియో తీసినట్లు గుర్తించిన యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
NRPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో గ్రాడ్యుయేట్, నిరుద్యోగులకు సరైన కేటాయింపులు చేయకుండా అన్యాయం చేసిందని తెలంగాణ గ్రాడ్యుయేట్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ విమర్శించారు. సోమవారం నారాయణపేటలో విలేకరులతో మాట్లాడారు. గ్రాడ్యుయేట్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
RR: హైడ్రా కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 42 ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం పరిసరాల్లోని నేషనల్ హైవే-65లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోతుందని, ఈ సమస్యను పరిష్కరించాలని మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
SRD: సంగారెడ్డిలోని శ్రీ రామ మందిరంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికను కలెక్టర్ ప్రావీణ్యకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ వనిత, కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్, శ్రీరామ మందిరం యువసేన అధ్యక్షుడు శ్రీనివాస్ రాజ్, సభ్యులు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్-IIలో విద్యుత్ మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏడీఏ లావణ్య తెలిపారు. అంజనాద్రి టెంపుల్, దోబీ ఘాట్, గోదాంగడ్డ, బీఎస్ఎఫ్, జడ్పీ క్వార్టర్స్, మల్లమ్మ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
BDK: భద్రాచలంలో వంట గ్యాస్ కొరతతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిలిండర్లు బుక్ చేసి 20 రోజులు గడిచినా సరఫరా లేక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గృహ వినియోగదారులను పట్టించుకోకుండా హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలకు మాత్రం సరఫరా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల సమాధానాలు కూడా స్పష్టంగా లేకపోవడంతో వినియోగదారుల్లో అసహనం పెరుగుతోంది.
BHPL: మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో రేపు హుండీ కానుకల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎస్.మహేశ్ తెలిపారు. బుధవారం ఉదయం 10గంటలకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించనున్నారు. ఆసక్తి గల భక్తులు, గ్రామస్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఈలెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని ఆయన కోరారు.
HYDలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడంలో భాగంగా కనెక్టివిటీపై అధికారులు ఫోకస్ చేశారు. నగరంలో రెండు చోట్ల డబుల్ డెక్కర్ కారిడార్ల నిర్మాణం జరగనుంది. ఒకటి పారడైజ్-శామీర్పేట మార్గంలో, మరొకటి ఎల్బీనగర్-హయత్ నగర్ మార్గంలో నిర్మిస్తారు. ఒకే పిల్లర్లకు అటాచ్ చేస్తూ.. వాహనాలు వెళ్లడానికి ఒక వంతెన, మెట్రో వెళ్లడానికి మరో వంతెన నిర్మించనున్నట్లు సమాచారం.
HYDలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో మూత్రపిండాల కోసం ఎదురుచూస్తున్న వారిలో 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు మూడోవంతుకు పైగా ఉన్నట్లు ఆసుపత్రుల అధికారులు తెలిపారు. చిన్న వయస్సులోనే మూత్రపిండాల సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తూ, తగిన ఆహారం, నీరు, జీవనశైలి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
NZB: మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించిన తమకు వేతనాలు చెల్లించలేదని కార్మికులు మంగళవారం ఉదయం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నెలరోజులు పని చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. రెగ్యులర్ సిబ్బందికి పూర్తిస్థాయిలో చెల్లింపులు చేశారని వారు మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కేవలం 10 రోజుల వేతనమే ఇచ్చారని ఆరోపించారు.