PDPL: మంథని మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందిస్తామని, పట్టణ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.
SRCL: ఇల్లంతకుంట మండలం అనంతారంలో ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తప్పనిసరి అన్నారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదాలకు కారణమన్నారు.
NRPT: మంత్రి డా.వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కన్మనూర్ గ్రామంలో పలువురి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇల్లు లేని వారికి కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉన్నారని నాయకులు తెలిపారు. అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా మంజూరు చేస్తామని తెలిపారు.
HYD: జీహెచ్ఎంసీ పరిధి మూడు భాగాలుగా విభజించబడిన తర్వాత పరిపాలన వేగం పెరిగింది. మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుస పర్యటనలు చేపడుతున్నారు. నగరంలోని సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 3, 12 వార్డులలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఇల్లు లేని నిరుపేదలకు మంజూరు చేయిస్తామని తెలిపారు.
WGL: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు. 15, 16, 17వ డివిజన్లకు చెందిన 50 మంది మైనార్టీ మహిళలకు ఎమ్మెల్యే కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. కుట్టు మిషన్లు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని ఎమ్మెల్యే అన్నారు.
KMR: బిచ్కుంద మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోనె పీరయ్య (41) అప్పుల భారాన్ని తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. మద్నూర్ మండలం పెద్ద శేక్కర్గలోని తల్లిగారి ఇంట్లో ఉంటున్న ఆయన, సంగారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరి తిరిగి రాలేదు. పెద్ద శేక్కర్గ గ్రామ చెరువులో మృతదేహం లభ్యమవ్వగా.. పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా పలువురు IAS అధికారులు గురువారం బదిలీ అయిన విషయం తెలిసిందే. WGL జిల్లా కలెక్టర్ సత్య శారద మాత్రం బదిలీ కాలేదు. జిల్లాలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కలెక్టర్ సమర్థవంతంగా విధులు నిర్వహించడమే దీనికి ప్రధాన కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీని పై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 7 హోటల్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 50-60 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతుడు నలుపు రంగు స్వెటర్, బ్రౌన్ ప్యాంటు ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమన్నారు.
NRML: రానున్న గోదావరి పుష్కరాలు నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనం, గోదావరి నదిలో పుణ్యస్నానాల కోసం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
MNCL: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పోలీస్, రవాణా, రహదారుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లపై చెత్త కుప్పలు లేకుండా చూడాలని, అనుమతి లేకుండా వాహనాల నిలుపుదలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
ASF: కాగజ్ నగర్ పట్టణం సర్ సిల్క్ కాలనీలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడిన దొంగలను గురువారం అరెస్ట్ చేసినట్లు SP నితిక పంత్ తెలిపారు. గత నెల 3న దండే మంగా ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి 72 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.2,75,000 అపహరించినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.
GDWL: గద్వాలలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీలో (రేపు) 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మీనాక్షి సీపీడీసీ సాయి శ్యామ్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు డిగ్రీ పూర్తి చేసిన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులే అన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
JGL: పెగడపల్లి మండలానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.51.52 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనట్లు మండల పంచాయతీ అధికారి శశి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన రూ. 50 వేల నుండి రూ. ఆరు లక్షల వరకు మంజూరయ్యా యని, ఈ నిధులను ఆయా జీపీల్లో జమవుతాయన్నారు.
ADB: మార్చి 10న ఆదిలాబాద్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఆవిష్కరించారు. జాబ్ మేళాలో 50కి పైగా పాల్గొననున్న కంపెనీలలో 2000 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యువతీ, యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.