HNK: ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ… ఆరు గ్యారెంటీలను అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి ప్రజా సంక్షేమంపై శ్రద్ధ చూపించాలన్నారు.
HYD: హైదరాబాద్లో భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ఆటోలు కనిపించకుండా కొత్త బడ్జెట్లో ముఖ్య ప్రణాళికలు ప్రకటించారు. CURE (ORR) పరిధిలోని ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. AI వినియోగాన్ని పెంచడం కూడా లక్ష్యంగా పెట్టారు. HILT పాలసీ ప్రకారం పరిశ్రమలను ORR పరిధి వెలుపల తరలించాలని నిర్ణయించారు.
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
NRML: రత్నాపూర్ (కాండ్లి) జెడ్పీ సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. పాఠశాలలో పారిశుధ్యం, పచ్చదనం మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందించాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ప్రోత్సహించారు. ఈ తనిఖీల్లో డీఈవో భోజన్న, తదితరులు పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ కు చెందిన గడ్డి వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియామకమయ్యారు. జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీచేశారు. జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు మైనంపల్లి హనుమంతరావుకు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
NRPT: తెలంగాణ బడ్జెట్ సమావేశంలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేనేత రంగానికి పెద్ద పీట వేస్తారని ప్రకటించడంతో నారాయణపేటలో చేనేత రంగానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇక్కడి కాటన్, పట్టు చీరలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతాయని ఉపముఖ్యమంత్రి ప్రకటనపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
VKB: తాండూరులోని శాంతినగర్ కాలనీలో పాత మీసేవ ప్రభుత్వ భవనంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు ఒకే గదిలో కొనసాగుతున్నాయి. సమస్యల పరిష్కారానికై వచ్చే ప్రజలు ఒకే ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వచ్చినప్పుడు తికమక పడుతున్నారు. ముందుగా అద్దె భవనంలో కొనసాగిన ఎక్సైజ్ కార్యాలయాన్ని ఇటీవల ట్రాఫిక్ PSలోకి మార్చారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
HYD: లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బీ.ఆర్. అంబేడ్కర్ నాలెడ్జ్ టవర్ను నిర్మిస్తున్నామని అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడారు. అలాగే నింబోలి అడ్డాలో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామని చెప్పారు. దీనికి తగినన్ని నిధులు కేటాయించామన్నారు.
NLG: నల్గొండ గడియారం సెంటర్ వద్ద గల మంత్రి క్యాంపు కార్యాలయానికి శుక్రవారం ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని ధర్నాకు దిగారు. ఆర్డీవో అశోక్ రెడ్డి అక్కడికి చేరుకుని వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
NZB: మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను ఇవాళ కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు.
వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా సాయిచరణ్ రెడ్డి నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక సేవలు అందిస్తున్న సాయి చరణ్ రెడ్డికి ఈ పదవి ఇవ్వడం అభినందనీయం అని జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
KMM: జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి శుక్రవారం అసెంబ్లీలో రూ.3,24,234 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో భాగంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు.
KMR: జుక్కల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రవీందర్ గౌడ్, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డా. విజయ్ భాస్కర్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. జిల్లాలో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉద్యోగుల హాజరును పరిశీలిస్తూ హడలెత్తిస్తున్నారు. కార్యక్రమంలో Dy. DM&HO డా. విద్య పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)లో మొదటి దశ 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగా నేడు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఉత్పత్తి నిలిచిపోవడంతో రోజుకు సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లుతుందని అధికారులు తెలిపారు.
WGL: వాతావరణంలో సంభవించిన మార్పులకు జిల్లా రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. అనంతరం ఆమె “HIT TV” తో మాట్లాడుతూ.. రైతులు పండించిన మొక్కజొన్న, వరి ధాన్యంపై పర్దాలు కప్పి ధాన్యాన్ని వర్షానికి తడవకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకు తెలిపారు.