KMR: లింగంపేట మండల విద్యాధికారిగా వంచ అంజల్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఆయన, కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పటివరకు లింగంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న గోపాల్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. మండలంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
MNCL: మందమర్రి మండలం సారంగపల్లి సమీపంలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. మలుపు వద్ద అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
MBNR: మహబూబ్ నగర్ పట్టణంలోని ఐటీఐ/ఏటీసీ(బాలుర)లో స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శాంతయ్య తెలిపారు. 1.CNC ఆపరేటర్, 2. Electrical Vehicle Service Technician, 3. 3D Printing ఆపరేటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. 18 ఏళ్లు నిండిన వారు అర్హులని, ఉమ్మడి జిల్లా నుంచి అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KMM: పశువైద్య శిబిరాలను పాడిపోషకులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ సామినేని సుజాత అన్నారు. శనివారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లందులపాడులో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని మున్సిపల్ ఛైర్మన్ ప్రారంభించారు. నోరులేని జీవుల పట్ల సేవాభావం పెంపొందించుకుని పశుగణాభివృద్ధికి తోడ్పడాలని ఇదే పరమాత్ముడి సేవని మున్సిపల్ ఛైర్మన్ పేర్కొన్నారు.
MDK: రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేవాలయాలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని హరీష్ రావు విమర్శించారు. కోకాపేటలో ఉన్న విశాఖ శారదా పీఠం రాజశ్యామల అమ్మవారి ఆలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల చర్యలను ఖండించారు. నిత్యాన్నదానం, కేసీఆర్ హయాంలో నిర్మించిన దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడం తగదని హరీష్ రావు పేర్కొన్నారు.
NLG: అనారోగ్యంతో హైదరాబాద్లోని ఆరోగ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవరకొండ 2వ వార్డు కౌన్సిలర్ పొట్ట మురళిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శనివారం పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
KMR: మద్నూర్కు చెందిన తివారీ దివ్య ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన ఈ పరీక్షలో దివ్య 300 మార్కులకు గాను 150 మార్కులు సాధించి అర్హత సాధించారు. సాధారణ కుటుంబానికి చెందిన తివారీ పూజ-నందకిషోర్ దంపతుల కుమార్తె అయిన దివ్య, జాతీయ స్థాయి పరీక్షలో రాణించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
KMM: జిల్లా వెలుగుమెట్ల బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం కు ఎంపీ ఈటెల రాజేంద్ర శనివారం చేరుకున్నారు. కాగా వారిని బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వెలుగుమట్ల బాధితులను ఎంపీ ఈటెల రాజేంద్ర పరామర్శించనున్నారు. వారితోపాటు పొనిశెట్టి వెంకటేశ్వర్లు, భూక్యా సీతారాం నాయక్, విద్యాసాగర్, సొప్పరి క్రాంతి, భూక్యా రాజేష్ పాల్గొన్నారు.
SRCL: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయచ్చని, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. సిరిసిల్ల పట్టణ పోలీస్టేషన్ ఆవరణలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. డ్రైవర్లకు వైద్య పరీక్షల అనంతరం అవసరమైన మందులు, కళ్లజోళ్లను పంపిణీ చేశారు.
MBNR: హమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామ ముక్కోటి మైసమ్మ జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో జరిగే ఈ వేడుకల్లో భాగంగా నేడు సాయంత్రం ‘బండ్లోత్సవం’, రేపు ‘బోనాలు’, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గాధిర్యాల్, రుసుంపల్లి తదితర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
HYD: మార్చి 3న కేతు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఉభయ ఆలయాలు మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. 3న ఉదయం 8 గంటలకు ఆలయాల తలుపులు మూసివేసి దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి 4న ఉదయం 9 గంటలకు మహా మంగళహారతితో ఆలయాలు తిరిగి తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. భక్తులు సహకరించాలని కోరారు.
NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం పదవ తరగతి విద్యార్థులకు పది పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సదానందం మాట్లాడుతూ.. పది పరీక్షలను నిర్భయంగా వ్రాయాలని,విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.
WGL: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి MLA దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నర్సంపేటకు ప్రత్యేక కేటాయింపులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలోని పండ్ల చెట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ ప్రకటించారు. ఇందులో 62 మామిడి చెట్లతో పాటు సపోటా కొబ్బరి అల్లనేరేడు చెట్లు ఉన్నాయి. ఏడాది కాలానికి కనీస ధర రూ. 50 వేలుగా నిర్ణయించారు. ఆసక్తి గల వారు రూ. 500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
GDWL: కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నెలో ఆత్మ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం, నానో ఫెర్టిలైజర్లు, ఆయిల్ పామ్ సాగులోని మెళకువలను వివరించారు. ఆధునిక పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందాలని సూచించారు. డీపీడీ జగ్గు నాయక్, ఏవో రాజవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.