MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ కు చెందిన గడ్డి వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియామకమయ్యారు. జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీచేశారు. జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు మైనంపల్లి హనుమంతరావుకు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ELR: ద్వారకతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, పత్సమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళి రామకృష్ణ, గన్ని వీరాంజనేయులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
సత్యసాయి: సోమందేపల్లి మేజర్ పంచాయతీలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం వైభవంగా జరిగింది. మాజీ మంత్రి, జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో వేడుకలో పాలుపంచుకున్నారు.
NRPT: తెలంగాణ బడ్జెట్ సమావేశంలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేనేత రంగానికి పెద్ద పీట వేస్తారని ప్రకటించడంతో నారాయణపేటలో చేనేత రంగానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇక్కడి కాటన్, పట్టు చీరలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతాయని ఉపముఖ్యమంత్రి ప్రకటనపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
VKB: తాండూరులోని శాంతినగర్ కాలనీలో పాత మీసేవ ప్రభుత్వ భవనంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు ఒకే గదిలో కొనసాగుతున్నాయి. సమస్యల పరిష్కారానికై వచ్చే ప్రజలు ఒకే ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వచ్చినప్పుడు తికమక పడుతున్నారు. ముందుగా అద్దె భవనంలో కొనసాగిన ఎక్సైజ్ కార్యాలయాన్ని ఇటీవల ట్రాఫిక్ PSలోకి మార్చారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
W.G: ఇరగవరం(మం) రేలంగిలో శుక్రవారం ఆటోలో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని అటుగా వెళ్తున్న తణుకు ఎమ్యెల్యే రాధాకృష్ణ గమనించారు. వెంటనే స్పందించి గాయపడిన కుటుంబానికి సహాయం చేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అలాగే, వైద్యులకు ఫోన్ చేసి తక్షణ చికిత్స అందించాలని సూచించారు.
HYD: లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బీ.ఆర్. అంబేడ్కర్ నాలెడ్జ్ టవర్ను నిర్మిస్తున్నామని అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడారు. అలాగే నింబోలి అడ్డాలో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామని చెప్పారు. దీనికి తగినన్ని నిధులు కేటాయించామన్నారు.
VZM: ఈ నెల 24న ఉదయం 8 గంటలకు విజ్జి స్టేడియంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. 35 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గలవారు SAAP వెబ్సైట్లో ఆధార్తో రిజిస్టర్ కావాలన్నారు.
NLG: నల్గొండ గడియారం సెంటర్ వద్ద గల మంత్రి క్యాంపు కార్యాలయానికి శుక్రవారం ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని ధర్నాకు దిగారు. ఆర్డీవో అశోక్ రెడ్డి అక్కడికి చేరుకుని వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
NZB: మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను ఇవాళ కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు.
వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా సాయిచరణ్ రెడ్డి నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక సేవలు అందిస్తున్న సాయి చరణ్ రెడ్డికి ఈ పదవి ఇవ్వడం అభినందనీయం అని జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
PPM: జియ్యమ్మవలస మండలం చిన్నమేరంగికి చెందిన మీసాల పావని అనే యువతి సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతోంది. ఆమె పరిస్థితిని గమనించిన ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2,90,785ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మంజూరు చేసింది. ఈ చెక్కును ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శుక్రవారం పావనికి అందజేశారు.
KMM: జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి శుక్రవారం అసెంబ్లీలో రూ.3,24,234 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో భాగంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు.
AKP: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా అచ్చుతాపురంలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఎం మండల కన్వీనర్ ఆర్ రాము మాట్లాడుతూ.. యుద్ధ ప్రభావంతో మనదేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. యుద్ధాన్ని వెంటనే విరమించాలని డిమాండ్ చేశారు.
నటి నిమిషా నాయర్కు ముంబైలో నడిరోడ్డుపై చేదు అనుభవం ఎదురైంది. తెల్లవారుజామున క్యాబ్లో వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు బైక్తో కారును అడ్డుకున్నారు. ఆమెను, డ్రైవర్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధించారు. ఈ భయానక దృశ్యాలను నిమిషా వీడియో తీసి SM వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.