KKD: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను గురువారం జగ్గంపేట సర్కిల్ పోలీసులు మర్యాదపూర్వకంగా కలిశారు. జగ్గంపేట సీఐ తిరుపతిరావు, ఎస్సైలు రఘునాథరావు, శివ నాగబాబు, సతీష్ కుమార్ గురువారం ఎస్పీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని పార్థసారధి నగర్లోని ఎంఈవో ఆఫీస్ దగ్గర ఉన్న కాలనీలో నాలుగు రోజులుగా నీటి సరఫరా బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఉగాది పండగ రోజున కూడా నీళ్లు రాకపోవడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు.
PLD: చిలకలూరిపేట మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే పుల్లారావు సమీక్ష నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించనని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వేసవిలో తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు.
ఉగాది పండుగ వేళ నటుడు చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు మరో సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాడు. భవిష్యత్లో పేద పిల్లలకు ఉచిత విద్య అందించడమే లక్ష్యమని తెలిపాడు. పండుగని పురస్కరించుకుని పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ అంశాన్ని వెల్లడించాడు.
అన్నమయ్య: మదనపల్లిలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు, ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణం చేసిన పండితులు ఈ సంవత్సరం సుభిక్షం, సస్యశ్యామలం ఉంటుందని తెలిపారు.
SKLM: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి గురువారం విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదా శీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. చింతల వెంకట్ రెడ్డి జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు చింతల ప్రభాకర్ రెడ్డి శ్వేత సౌజన్యంతో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ నందు చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ మన్మధ కుమార్ హాజరయ్యారు.
BHPL: మహాముత్తారం మండలం ఉట్లపల్లి గ్రామంలో ఉపాధి పనుల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. బిసుల సునీత చెవికి పొరపాటున కొడవలి తగలడంతో తీవ్ర గాయమైంది. సహచర కూలీలు వెంటనే స్పందించి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఉపాధి పనుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా పాటించాలని స్థానికులు కోరుతున్నారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ముందుగా రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్తు ద్వారా విశేష అభిషేకము నిర్వహించారు. స్వామి వారికి వివిధ పూజలు నిర్వహించారు.
KNR: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జమ్మికుంట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. పట్టణ CI రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కేశవపూర్కు చెందిన కిషన్(30) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఇవాళ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్లెలి వివాహం, తండ్రి అనారోగ్య కారణాలతో ఈ అగాయిత్యం చేసుకున్నట్లు సమాచారం.
అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ దేవస్థానాలకు చెందిన వేద పండితులు అర్చకం ప్రసాద్ శర్మ, జగన్నాథమయ్య, పద్మనాభ భట్టార్, లక్ష్మణాచార్యులను కలెక్టర్ ఆనంద్ ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరికి రూ. 10,116 నగదు పురస్కారాన్ని అందజేశారు.
TG: రైతులు పంటల వైవిధ్యం గురించి మరింత ఆలోచించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డిమాండ్ బాగా ఉండి లాభాలు బాగా వచ్చే పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు. ఆయిల్ పామ్ ను మరింత ప్రోత్సహించాలని కేంద్రాన్ని కూడా అడిగానన్నారు. పామాయిల్ దిగుమతిపై పన్ను పెంచితే.. దేశంలోని రైతులకు మేలు కలుగుతుందని చెప్పానన్నారు. ఆయిల్ రిఫైనరీకి కూడా రేపు శంకుస్థాపన చేస్తామన్నారు.
NLG: చిట్యాల(మం) పెద్దకాపర్తి, గుండ్రాంపల్లిల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఇవాళ పండుగలా సాగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ వేడుకల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సమానత్వమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.