MNCL: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బ్యాట్) ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఎన్నికల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవిలో సుధాకర్ నాలుగేళ్లు కొనసాగనున్నారు.
VZM: రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ తన ఎంపీ ల్యాండ్స్ నిధులు రూ.50 లక్షలతో గోషా ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ నూతన సదుపాయాలను ఇవాళ ఎమ్మెల్యే అదితి అధికారికంగా ప్రారంభించారు. నిధులు మంజూరు చేసిన విజయేంద్ర ప్రసాద్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు.
SKLM: నందిగాం మండలం రాంపురం ఎంపీపీ పాఠశాల వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. పాఠశాల అభివృద్ధి కోసం వారు రూ. 55 వేల విరాళం అందజేశారు. ఈ నిధులతో పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం, సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఎంఈఓలు నరసింహులు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
TG: దూర ప్రాంతాల నుంచి HYD వచ్చే ప్రయాణికులకు అనుకూలంగా మెట్రో టైమింగ్స్ మార్చాలని ప్రభుత్వాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారి విజ్ఞప్తి చేశారు. వందేభారత్, రాజధాని, TG ఎక్స్ప్రెస్వంటి రైళ్లన్నీ 4.30AM నుంచి 6.30AM మధ్య నగరానికి చేరుకుంటాయని.. మెట్రోరైళ్లు 6AM నుంచి నడుపుతుండడంతో ప్రయాణికులు ఆటోలు, క్యాబ్లు ఆశ్రయిస్తూ నష్టపోతున్నారన్నారు. అందుకే 5AM నుంచి నడపాలన్నారు.
CTR: ఎస్ఆర్ పురం మండలం, పుల్లూరు క్రాస్ రోడ్లో మహాభారత ఘట్టాల్లో ఒకటైన అర్జున తపస్సు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్థానిక భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ తపస్సు కార్యక్రమం ద్వారా అర్జునుడు చేసిన దీక్ష, భగవంతునిపై భక్తిని ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
TG: ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో RTCలో రోజువారి వేతనంతో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 10వ తరగతి పాసైన వారికి డిపో మేనేజర్లు టీమ్స్ మిషన్లపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, డ్రైవర్లకు కనీస విద్యార్హత ఉండి 18 నెలల డ్రైవింగ్పై అనుభవం ఉంటే అవకాశాలు కల్పిస్తున్నారు. రోజువారిగా కండక్టర్లకు రూ.800, డ్రైవర్లకు రూ.1,000 వేతనం ఇస్తున్నారు.
KRNL: ఆదోని ఎస్కేడీ కాలనీలో ఇంటి స్థలం హద్దుల వివాదంలో ఫాతిమా అనే మహిళపై దాడి జరిగినట్లు టూ టౌన్ ఎస్ఐ రామనాథ్ తెలిపారు. బాధితురాలు ఎమ్మెల్యేను ఆశ్రయించగా, ఆయన నిన్న ఘటనా స్థలాన్ని పరిశీలించి చర్యలకు ఆదేశించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏరకుల రంగన్న సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న ఈ స్థల వివాదంపై దర్యాప్తు చేపట్టారు.
KNR: కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులైన బధావత్ భిక్షపతి నాయక్కు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. సైదాపూర్ ఏఎంసీ ఛైర్మన్ దొంత సుధాకర్, ఇతర నాయకులు మాట్లాడుతూ.. కష్టపడే వారికి కాంగ్రెస్లో సముచిత స్థానం ఉంటుందని, భిక్షపతి నాయక్ నియామకంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.
RR: దివంగత మాజీ హోం మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా చేవెళ్ల పరిధిలోని కౌకుంట్లలోని ఆయన సమాధి వద్ద మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బలమైన ప్రజా నేతగా, నిజాయితీ గల నాయకుడిగా పేరు పొందారన్నారు. ఆయన సేవలు మరువలేమని, ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు.
BDK: సీతారామ ప్రాజెక్టు పనుల్లో జాప్యం నేపథ్యంలో బుధవారం అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ములకపల్లి మండలం యాతాలకుంట వద్ద పనులను పరిశీలించిన ఆయన. భూసేకరణ ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. 15 రోజుల్లో టన్నెల్ పనులు పూర్తి చేయాలని, పనులు వేగవంతం చేసి రైతులకు నీరందించాలని అధికారులను ఆదేశించారు.
MHBD: జిల్లావ్యాప్తంగా గత 10 భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండవేడి తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు సైతం వేడి తగలకుండా తలకు కర్చీఫ్, స్కార్ఫ్లు కట్టుకుని వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై వాహనాలు తిరగడం లేదు. ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు
ADB: బజార్హత్నూర్ మండలం పిప్రిలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేందర్ రెడ్డి తెలిపారు. గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, వసతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు.
ప్రకాశం: కొండపి సీఐ సోమశేఖర్ చీరాల వన్ టౌన్ సర్కిల్కు బదిలీ అయ్యారు. కొండపిలో సోమశేఖర్ బాధ్యతల చేపట్టాక నేరాలు కట్టడి చేయడంతోపాటు, పేకాట బెట్టింగులపై ఉక్కుపాదం మోపారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణానికి కృషి చేశారు. ఆయన సర్వీస్ కాలంలో అందరి అభిమానాలు పొందారు. సర్కిల్ పరిధిలో సమస్యలను పరిష్కరించడంలో మంచిపేరు తెచ్చుకున్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2025-26 ఫ్రీ ప్రైమరీ బడ్జెట్లో సిబ్బందిని నియమించకుండా రూ.60,000 అక్రమంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన పై DEO, MEO స్పందించి అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
RR: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా షాద్ నగర్ పట్టణంలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ.. దేశ ప్రధానిని ఉగ్రవాదులతో పోల్చడం దేశద్రోహానికి సమానమని విమర్శించారు. భవిష్యత్తులో ప్రజలు తగిన సమాధానం ఇస్తారన్నారు.