ATP: అనంతపురం జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన పలు బీఫార్మసీ పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. తృతీయ ఏడాది మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీతో పాటు రెండో సంవత్సరం ఆర్15, ఆర్19 ఫలితాలు వెల్లడయ్యాయి. వీసీ, రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు పరీక్షల విభాగం అధికారులు నాగప్రసాదానాయుడు ఫలితాలు ప్రకటించారు.
అన్నమయ్య: పోలీస్ భవన నిర్మాణాల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్టర్ టి.కృష్ణప్ప నాయుడు రూ.10 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి చెక్కును అందజేశారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోలీస్ భవన నిర్మాణాలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సామాజిక బాధ్యతగా ఈ మొత్తం అందజేసినట్లు ఆయన తెలిపారు.
NDL: బలగం సినిమా దర్శకుడు వేణు సోమవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం కుంకుమార్చన పూజలు చేపట్టారు. ఉత్తమ అవార్డు గ్రహీత పెద్ద మురళి బుక్కాపురం గ్రామ జ్యోతి యువజన సంఘం అధ్యక్షుడు నాగ చందు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ ఆయన వెంట పాల్గొని దర్శనం చేయించారు.
సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పర్యవేక్షణలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పారదర్శకంగా ముగిసింది. ఎక్సైజ్ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో నిబంధనల ప్రకారం కేటాయింపులు చేపట్టారు. చెన్నేకొత్తపల్లి దుకాణానికి ఒకే దరఖాస్తు రావడంతో గంగాధర్ నాయుడు పేరును ఖరారు చేశారు.
KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు కాలనీలు, గ్రామాల్లో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర హెల్ప్లైన్ నంబర్లను గుర్తు చేశారు. సోషల్ మీడియా, ఆన్లైన్ మోసాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు.
అన్నమయ్య: నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే ‘ఉల్లాస్-అక్షర ఆంధ్ర కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్లో గోడ పత్రికలను విడుదల చేసిన ఆయన, 2029 నాటికి వయోజనులందరికీ అక్షరాస్యతతో పాటు డిజిటల్, ఆర్థిక నైపుణ్యాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
NDL: నందికొట్కూరు మండలం కొణిదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ నెల 28న బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.40 వేలు, వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12 వేల నగదు పురస్కారాలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఎద్దుల యజమానులు ఈ పోటీల్లో పాల్గొనాలని వారు కోరారు.
W.G: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా 19 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అలాగే, నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం జరగాలన్నారు. అధికారులు ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని సూచించారు.
SKLM: రణస్థలం మండలం కొండములగాం ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పొట్నూరు శ్రీధర్ తెలిపారు. ఆన్లైన్లో మార్చి 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని, 12న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ‘apms.apcfss.in’ వెబ్సైట్ను సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SKLM: మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అపరి ష్కృత కేసుల రాజీ పై దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా న్యాయ సేవా సదన్లో సోమవారం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్టేషన్లలో పెండింగ్ కేసులు తగ్గాలని బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని అన్నారు.
ELR: ఉభయ గోదావరి జిల్లాల్లోని 44 మెడికల్ షాపులపై సోమవారం ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన పలు దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఏలూరు రీజియన్ ఉప సంచాలకులు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా వైద్యుల ప్రిస్క్రిప్షన్తోనే మందులు కొనుగోలు చేయాలని సూచించారు.
ELR: రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా చేపట్టిన ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న ప్రీ-ఫైనల్, 29న ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో దాదాపు 97,200 మంది అభ్యాసకులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.
NLR: ఇందుకూరుపేట మండలం పరిధి మైపాడు బీచ్ సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరందుకున్నాయి. సముద్ర తీర ప్రాంతం నుంచే మట్టిని లారీలు, హిటాచీలతో లే-అవుట్లకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో సిబ్బందిని పంపించి విచారణ చేపడతామని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ మళ్లీ వాయిదా పడింది. రెండు సార్లు పోలీసులు విచారణను వాయిదా వెయ్యగా ఈసారి మాజీ మంత్రి కాకాణి వంతు వచ్చింది. వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ నెల 24న విచారణకు రాలేనంటూ ఆయన సోమవారం పోలీసులకు లేఖ రాశారు. 27వ తేదీన వస్తానని పేర్కొన్నారు. కొన్ని రోజుల కింద బాలిక మృతి ఘటనలో ఆయనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
KKD: ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామ శివార్లలో అక్రమంగా గుండాట ఆడుతున్న ఆరుగురిని సోమవారం సాయంత్రం ప్రత్తిపాడు SI లక్ష్మీ కాంతం అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 15,700 నగదు, గుండాట ఫ్లెక్సీ, రెండు లెదర్ బౌల్స్, తొమ్మిది పాశాలను స్వాధీనం చేసుకున్నారు.