కడప: నగరం 1వ డివిజన్ పాత కడప హరిజనవాడలో ప్రధాన డ్రైనేజీ కాలువను తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు.
VZM: గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) వ్యవస్థాపకులు బొబ్బిలి రామకృష్ణకు జాతీయ సేవా విజనరీ పురస్కారం వరించింది. ఈయన స్వస్థలం ఎస్ కోట. ఈ పురస్కారాన్ని రామకృష్ణకు విశాఖలో శనివారం జరిగిన ట్రావెల్ అండ్ ఫౌండేషన్ టూరిజం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రధానం చేశారు. పర్యావరణం, విద్య, ఆరోగ్యం, న్యాయ, యోగ విభాగాల్లో అందిస్తున్న సేవలకు ఈ పురస్కారం లభించింది.
కాకినాడ నడిబొడ్డున పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనందభారతి మైదానం వంటి బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోయి, వాకింగ్ ట్రాక్స్, వ్యాయామ పరికరాలు నిరుపయోగంగా మారాయి. మైదానాలను కేవలం ప్రదర్శనలు, సమావేశాల అద్దెకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, కనీస నిర్వహణను విస్మరిస్తున్నారని నగరవాసులు వాపోతున్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం పరిధిలో ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగింది. నాయకులతో కలిసి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. నేడు నగదు అందని వారికి సోమవారం అందించనున్నారు. పట్టణ వ్యాప్తంగా నేడు 87 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
విశాఖ జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆటోనగర్, మధురవాడ ఐటీ పార్కులకు కార్మికుల రాకపోకల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని సూచించారు.
SKLM: విద్యార్థుల్లో పరిశోధనా జిజ్ఞాసను పెంపొందించేలా పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 500 మంది విద్యార్థులు రూపొందించిన 175 వినూత్న ప్రాజెక్టులను ఆయన పరిశీలించి, విద్యార్థుల మేధోసంపత్తిని అభినందించారు.
ప్రకాశం: బేస్తవారిపేటలో శనివారం కుందూరు నాగార్జున రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసినట్లు మాజీ సీఎం జగన్ ఎప్పుడు చెప్పలేదని రెండు టన్నెల్స్ పూర్తయితే వాటిని జాతికి అంకితం చేశామన్నారు. అలానే మార్కాపురం జిల్లాని ప్రకటించినప్పుడు దర్శి నియోజకవర్గాన్ని జిల్లాలో కలుపుకోకపోవడంపై ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశ్నించలేదని కేపీ విమర్శించారు.
ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నివాసంలో మార్చి 3న హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో పట్టణ ప్రజలు, యువతి, యువకులు పాల్గొనవచ్చు. రంగులు తెచ్చుకునే వారు ఎటువంటి రసాయనాలు లేని ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని సూచించారు. హానికరమైన గంధం, శుద్ధ పొడి వాడొద్దని ఆయన కోరినట్లు సమాచారం.
సత్యసాయి: కొత్తచెరువు మండలంలో హంద్రీనీవా కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన ఒక గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యమైంది. కాలువలో మృతదేహం తేలుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సదుం ఎస్సై విష్ణు నారాయణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలతో కలిసి శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నట్టు ఎస్సై చెప్పారు. బాలికలు ఉన్నత చదువులు చదివేలా తల్లితండ్రులు ప్రోత్సహించాలన్నారు.
WG: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకివీడు నగర పంచాయతీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ శనివారం వేగవంతంగా సాగింది. ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందిస్తుండటంతో, లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న అంశాన్ని నగర పంచాయతీ మేనేజర్ కే. వెంకటేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు. అర్హులైన వారందరికీ తక్షణమే నగదు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు.
KRNL: మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలులోని మద్దూర్ నగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేస్తూ.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా సరైన సమయానికి పింఛన్ అందుతుందా అని లబ్ధిదారులను అడిగారు.
E.G: నిడదవోలు మండలంలోని సమిశ్రగూడెం గ్రామంలో శనివారం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దుర్గేశ్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. పింఛన్ దారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూటమి ప్రభుత్వం సేవలను అందిస్తోందన్నారు. ఈ నెలలో నిడదవోలు మండలం పరిధిలో సుమారుగా మొత్తం రూ.4,46,20,000 అందజేస్తున్నామని తెలిపారు.
BPT: చీరాల నియోజకవర్గవ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేటపాలెం, ఈపురుపాలెం ప్రాంతాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
SKLM: కోటబొమ్మాలి మండలం పట్టు పురం పంచాయతీలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు పట్టు పురం బీటి రోడ్ నుంచి మణి నాగేశ్వరపురం వరకు రూ.1 కోటితో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టుపురంలో రూ. 28 లక్షలతో రక్షిత మంచినీటి పథకం నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణమూర్తి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.