అనంతపురం నగరంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం విభిన్న ప్రతిభావంతుల అర్హత ఎంపిక శిబిరం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి మూడు చక్రాల పెట్రోల్ వాహనం కోసం దరఖాస్తు చేసుకున్న 132 మందిని అధికారులు పరిశీలించారు.
అన్నమయ్య: నందిపల్లె సమీపంలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయంలో వైభవంగా హోమాలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వైసీపీ రాష్ట్ర ప్రధాన శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఆలయ నిర్మాణంలో ఎన్ఆర్ఐ మారం శ్రీకాంత్ రెడ్డి భక్తిశ్రద్ధలను ఆయన ప్రశంసించారు. ఈ నెల 25న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని మాజీ సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సత్యసాయి: ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని హిందూపురం డీఎస్పీ మహేష్ వాహనదారులకు సూచించారు. మంగళవారం లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌలసముద్రం టోల్ ప్లాజా రోడ్డుపై వాహనాలు తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం: సీఎస్ పురం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని జిల్లాసమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనిల్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు తీరును సమీక్షించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించి, అన్ని వివరాలను సమయానికి నమోదు చేయాలని ఆదేశించారు.
GNTR: ఫిరంగిపురం మండలం రేపూడిలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం, వీవీప్యాట్స్ గోడౌన్ మ గుంటూరు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోడౌన్లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని తనిఖీ చేశారు. అనంతరం సీసీటీవీల పనితీరును కూడా పరిశీలించారు.
అనకాపల్లిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా హాస్టల్ ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణి కుమార్ డిమాండ్ చేశారు. హాస్టల్ ఏర్పాటు కోసం వచ్చే నెల 9 నుంచి 14 వరకు అనకాపల్లిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఎలమంచిలిలో గోడపత్రిక ఆవిష్కరించారు. హాస్టల్ ఏర్పాటుకు గతంలో పలు సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని పేర్కొన్నారు.
E.G: అన్ని పాల కేంద్రాలను, ప్రతి గ్రామంలో ఉన్న పాల వ్యాపారాలు చేసే వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వాలని గ్రామ పంచాయతీ పరిధిలో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు డిమాండ్ చేశారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. విషపు పాలు తాగి రెండు రోజుల్లో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు.
కడప: జిల్లా మహిళా చైర్ పర్సన్ అన్నపురెడ్డి రాణికి అరుదైన గౌరవం దక్కింది. ఆమె చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి, తెలంగాణ ఆదర్శ కళావేదిక ఫిలిం సంస్థ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆమెను సన్మానించింది. ఈ సందర్భంగా మరికొందరు గౌరవ అతిథుల చేతుల మీదుగా ఆమెకు నంది అవార్డును అందజేశారు.
W.G: దుంపగడపలో వీవీ గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సందర్శించారు. 60 మంది విద్యార్థులు, అరుగురు అధ్యాపకులు గ్యాలరీ నుంచి సభా చర్చలను ప్రత్యక్షంగా వీక్షించి, శాసనసభ పనితీరుపై అవగాహన పెంచుకున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులను కలిసి అసెంబ్లీ నిర్వహణ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.
NTR: నందిగామలో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ జరుగునుందని 16వ అదనపు జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీని ద్వారా ఎప్పటి నుంచో రాజీ పడని కేసులలో కక్షిదారులు సత్వరమే రాజీ చేసుకోవచ్చు అన్నారు. దీని ద్వారా డబ్బు సమయం అవుతూ కక్షిదారుల మధ్య స్నేహ సంబంధం కలుగుతుందని పేర్కొన్నారు. రాజీమార్గమే రాజమార్గం అని సూచించారు.
కర్నూలు: ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు వ్యక్తులు నిరుద్యోగ యువత నుంచి డబ్బులు తీసుకొని మోసాలు చేస్తున్నారనే ఫిర్యాదులు ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుతున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
VZM: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్ధనరెడ్డిని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో పలు రోడ్ల అభివృద్ధి, మరమ్మతులపై ఆయనతో చర్చించారు. అలాగే, రోడ్ల విస్తరణ పనులకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన వినతిపత్రంపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
కృష్ణా: తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరిగిందని MLA యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలు క్షమించరానివని అన్నారు. స్వామివారి నైవేద్యంలో కల్తీపై గత పాలకుల పాత్రపై విచారణ జరపాలని, తిరుమల తిరుపతి దేవస్థానాలు స్వయంగా ఆవులను పెంచి నెయ్యి చేయాలని సూచించారు.
BPT: అన్న క్యాంటీన్ నిర్వహణపై మంగళవారం ట్రస్ట్ సీఈవో వాసుదేవ్ సమీక్షించారు. పేదలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలన్నారు. ఇటీవలి సర్వేలో ఇక్కడి సేవలపై 91 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదే ప్రమాణాలు కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. నాణ్యత, పరిశుభ్రతలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
E.G: రాజమండ్రిలో గణేశ్వరరావు నుంచి కొనుగోలు చేసిన పాలు, ఇతర పాల ఉత్పత్తులను వినియోగించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం స్పష్టం చేశారు. అతడు సరఫరా చేసిన పాలు కల్తీ అయినట్లు గుర్తించామన్నారు. ఈ పాలు, వాటి ద్వారా తయారైన పెరుగు, కోవా, నెయ్యి, మీగడ వంటి పదార్థాలు ఎక్కడ నిల్వ ఉన్నా వెంటనే తొలగించి, సురక్షితంగా నాశనం చేయాలని ఆదేశించారు.