KDP: బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె.రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ కలెక్టర్ డా. చేకూరి శ్రీధర్ బద్వేల్ మండలం చింతలచెరువు గ్రామానికి రానున్నట్లు రితేష్ తెలిపారు. ‘జలధార’ ప్రాజెక్టుపై మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమీక్ష సమావేశానికి ఆయకట్టు ఛైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
ELR: ద్వారకాతిరుమలలో 1986లో స్థాపించబడిన ప్రభుత్వ గ్రంథాలయం నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడుతోందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భవనం కూడా పూర్తిగా శిధిలమయ్యే స్థాయికి చేరిందని పుస్తక ప్రేమికులు తెలియజేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రంథాలయాన్ని ఆధునికరించి పుస్తక ప్రియులకు అందుబాటులోకి తెస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
KRNL: మంత్రాలయం సీఐ రామాంజులు సాధారణ బదిలీల్లో భాగంగా ఇవాళ పులివెందుల ట్రాఫిక్ సీఐగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కర్నూలు వీఆర్లో ఉన్న దస్తగిరి బాబును మంత్రాలయం సీఐగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా నియమితులైన దస్తగిరి బాబు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
E.G: రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీగా శివ ప్రియ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజిబుల్ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్కి ప్రాధాన్యం ఇస్తామని ఆమె వెల్లడించారు. జోన్లోని ఇబ్బందికర ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. అలాగే రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేస్తామన్నారు.
కృష్ణా: గుడివాడ డీఎస్పీగా పాల శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గుడివాడ పరిధిలో చట్టం, శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, నేరాల నివారణ, ట్రాఫిక్ యంత్రణపై దృష్టి సాధిస్తామన్నారు.
VSP: జీవీఎంసీ ఆస్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే టెండర్పై జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలవడం నిబంధనలకు విరుద్ధమని, ఇందులో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. టెండర్ను వెంటనే రద్దు చేసి, స్మార్ట్ సిటీ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 19 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 22న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించనున్నారు. ఆయన జన్మనక్షత్రం అరుద్ర సందర్భంగా ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీరామానుజులవారిని బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో ఊరేగించారు.
ప్రకాశం: కొండపి మండలం మూగచింతల గ్రామంలో సోమవారం ప్రజా చైతన్య బైక్ యాత్ర సంఘం సభ్యులు గ్రామస్తులతో కలిసి దళితులకు స్మశాన వాటిక కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. స్మశాన వాటిక లేకపోవడంతో దళితులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
GNTR: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా విన్నారు. వినతులను పరిశీలించిన మంత్రి, సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ATP: శింగణమల మండలం ఆకులేడు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తోపుదుర్తి కవిత ఆకులేడు గ్రామానికి వెళ్లారు. అక్కడ రామచంద్రారెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
NLR: బోగోలు మండలం బిట్రగుంట నూతన ఎస్సైగా డి.రామకృష్ణ నియమితులయ్యారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తెలిపారు. సమస్య ఏమైనా ఉంటే నేరుగా తనకు చెబితే పరిష్కరిస్తానని చెప్పారు.
గుంటూరు: జొన్న, మొక్కజొన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో తెనాలి తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన జరిగింది. మార్కెట్లో సరైన ధరలు లేక రైతులు నష్టాల్లో ఉన్నారని నేతలు తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: తమిళ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సోమవారం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో సుందరం భజన బృందం మహిళలు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. భగవంతుని ఉనికిని ప్రతి క్షణం గుర్తించేలా సాగిన ఈ ప్రదర్శన భక్తులను పరవశింపజేసింది. పలు భాషల్లోని భక్తి గీతాలు, కర్ణాటక సంగీత కీర్తనలు అద్భుతంగా ఆలపించారు.
NLR: ఆత్మకూరు(M) నెల్లూరు పాలెం ముస్లిం కాలనీలో పోలీసులు సోమవారం ఉదయం కార్డన్ సర్చ్ నిర్వహించారు. సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 8మంది ఎస్ఐలు, 40 మంది పోలీసులు ప్రతి ఇంటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని 50 బైకులు, 3కార్లు, 4ఆటోలను సీజ్ చేశారు. కాలనీవాసులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలను వాడరాదని సీఐ గంగాధర్ సూచించారు.
కృష్ణా: ఘంటసాల మండలం లంకపల్లి జడ్పీ హైస్కూలును ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి పఠన సామర్ధ్యం పరిశీలించారు. మెనూ అమలు తీరు ఆరా తీశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల అవసరాలు తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతుల భవనం పరిస్థితి పరిశీలించారు. టీడీపీ నేత దిరిశం వెంకట్రావ్ పాల్గొన్నారు.