KRNL: ఎమ్మిగనూరులోని కమిటీ రోడ్డు కూడలిలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటుగా వెళ్తున్న సీఐ శ్రీనివాస్ నాయక్ ట్రాఫిక్ను స్వయంగా మళ్లించారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైన్లు వేయడానికే పరిమితమవుతున్నారని వాహనదారులు ఇవాళ విమర్శిస్తున్నారు.
VZM: అమెరికాలో నిన్న జలపాతంలో మునిగి మరణించిన బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ ( 26 ) మృతదేహాన్ని సొంత గ్రామానికి తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులో ప్రమాదంలో మరణించడం కలిచి వేసిందన్నారు.
బాపట్ల: సూర్యలంకలోని 15 మంది గజ ఈతగాళ్లకు అడవి గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసింది. నిధుల లేమితో జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసింది. సముద్రంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన తమ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందని ఈతగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఉద్యోగాలు తీసేస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని, అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
CTR: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్, అక్రమ లాటరీలు, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ డూడి ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచి ప్రత్యేక దాడులు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాచారం ఇవ్వాలని సూచించారు.
BPT: బాపట్ల మండలం ఈతేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం గుంటూరు నుంచి బాపట్లకు ఓ లారీ బయలుదేరింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈతేరు వద్ద లారీ అదుపుతప్పింది. రహదారి పక్కనున్న కల్వర్టును బలంగా ఢీకొట్టి కాలువలోకి బోల్తా పడింది. డ్రైవర్ కునుకు తీయడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
శ్రీకాకుళం పట్టణంలోని పిఎన్ కాలనీ సమస్యలను పరిష్కరిస్తానని కమిషనర్ హనుమంతు కుర్మారావు స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం స్వగృహానికి కమిషనర్ చేరుకొని స్థానికులతో సమస్యలపై చర్చించారు. బాల భారత జంక్షన్ నుంచి కిమ్స్ రోడ్డు వరకు ఆక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.
W.G: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక కార్యక్రమాన్ని రేపు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చునన్నారు. అన్ని మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ATP: గుంతకల్లు సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును యధావిధిగా కొనసాగించాలని కోరుతూ బండ్లపల్లిలో జరుగుతున్న బహిరంగ సభకు ఇవాళ సిపిఐ నాయకులు తరలి వెళ్లారు. సీపీఐ నాయకులు గౌస్ మాట్లాడుతూ.. ఈనెల 10నుంచి 12వ తేదీ వరకు సీపీఐ జాతీయ నాయకులు రామకృష్ణా ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతుందన్నారు.
VZM : హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమన్ జయంతి సందర్బంగా విజయనగరం స్థానిక మెసానిక్ టెంపుల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. IIHP అధ్యక్షులు డాక్టర్ ఎస్. శ్రీనివాస్ హానిమన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హోమియోపతి వైద్యులు రోగులను పరీక్షించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
పల్నాడు: రొంపిచర్లకు చెందిన ఓ మహిళ ఫేస్బుక్ ప్రకటన చూసి మోసపోయింది. బాధితుల వివరాల మేరకు.. డబ్బు రెట్టింపు చేస్తామన్న ఫైనాన్స్ కంపెనీ మాయమాటలు నమ్మింది. బ్యాంకు, ఫోన్ పే ద్వారా మొత్తం రూ.50 వేలకు పైగా వారికి చెల్లించింది. తిరిగి డబ్బు కోసం ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
GNTR: ఈ నెల 14న SRM వర్సిటీలో సీఎం పర్యటించనున్నారు. అక్కడ క్వాంటం కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభిస్తారు. ఈ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్సిటీలో కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వేదిక వద్ద పటిష్ట బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు.
KRNL: సి.బెళగల్ మండలం తిమ్మన్ దొడ్డి గ్రామం వద్ద తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రిపగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చి పెట్టే ఇసుకను కొందరు అక్రమంగా దోచుకుంటున్నారని స్థానికులు అంటున్నారు.
ATP: ఈనెల 20న CM చంద్రబాబు 76వ జన్మదినోత్సవం నుంచి రాయదుర్గంలోని జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాలు కొనసాగుతున్నాయి. MLA కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పది రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తారా దేవి హోమంలో పాల్గొన్నారు. సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
SKLM: టెక్కలి డివిజన్ విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాతపట్నంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి (SC/ST) సూర్య ఘర్ ఉత్సవ్ కార్యక్రమం అమలు పై ఆరా తీశారు. పాతపట్నం నియోజకవర్గానికి 3500 సోలార్ టాప్లు కేటాయించారని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలియజేశారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భానుడి ప్రతాపం తీవ్రమవుతోంది. వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా గూడూరు, పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ఎండ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.