CTR: చౌడేపల్లెలోని ప్రసిద్ధ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 21 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 27న స్వామివారి కళ్యాణోత్సవం, 28న రథోత్సవం నిర్వహిస్తారు. రోజూ వాహన సేవలు జరుగుతాయని వారు పేర్కొన్నారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేశ్ చంద్ర 12వ డివిజన్లో మార్నింగ్ విజిట్ నిర్వహించి పారిశుధ్య పనులను పరిశీలించారు. జీవీపీ పాయింట్ల తొలగింపుకు చర్యలు తీసుకుని, క్లాప్ ఆటోల ద్వారా చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక డ్రైవ్తో ప్రాంతాన్ని శుభ్రపరచి మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ ప్రజలకు సూచించారు.
PPM: జిల్లాలో ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 4 ప్రధాన కేంద్రాల పరిధిలో ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందచామని, పార్వతీపురం, పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, సాలూరు కేంద్రాల కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
NLR: రాపూరు మండలం గుండవోలులో ప్రమాదకరంగా కరెంట్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించారు. విద్యుత్ వైర్లు ఇళ్లకు అతి సమీపంలో ఉన్నందున వాటిని ఇళ్లకు దూరంగా మార్చారు. చెప్పిన వెంటనే చర్యలు తీసుకోవడంతో గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
TPT: గూడూరు పట్టణం బనిగి సాహెబ్ పేటలో సోమవారం గూడూరు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమతి పత్రాలు లేని 10 మోటార్ సైకిల్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడి ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ తనిఖీల్లో గూడూరు ఒకటో పట్టణ, రెండో పట్టణ సీఐలు పాల్గొన్నారు.
ATP: గుత్తి మండలం నాగసముద్రం క్రాస్ వద్ద సోమవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని జిల్లా కేంద్రానికి తరలించారు. గుత్తి నుంచి అబ్బే దొడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కృష్ణా: జాతీయ రహదారిపై పాల వ్యాన్ ప్రమాదానికి గురైంది. సోమవారం కృష్ణా మిల్క్ యూనియన్ పాల వ్యాన్ చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు రామానగరంలో జాతీయ రహదారి-216పై పల్టీ కొట్టింది. ఉదయం నాగాయలంకలో పాల ప్యాకెట్లు సరఫరా చేసి తిరిగి మచిలీపట్నం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.
ELR: ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామములో రావి శ్రీలలిత మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇవాళ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాతలు సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని నిర్వహణ కొరకు పాఠశాల సిబ్బందిలో ఒకరిని నియమించాలన్నారు.
VZM: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాతో నిఘా పెడతామని బొబ్బిలి CI కె. నారాయణరావు తెలిపారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం డ్రోన్ కెమెరా ఎగర వేశారు. అనంతరం మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగిన వారిని పట్టుకునేందుకు, పేకాట ఆడుతున్న వారిని పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాతో నిఘా పెడతామన్నారు.
W.G: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్కు తాడేపల్లిగూడెంకు మరో 15రోజుల్లో వస్తుందని కేంద్రమంత్రి భూపతిరాజు వర్మ ప్రకటించారు. సికింద్రాబాద్ డివిజన్ రైల్వే అధికారులకు కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి వీడియో షేర్ చేసినట్లు వెల్లడించారు.
AKP: అచ్యుతాపురం మండలం జగ్గయ్యపేటలో సోమవారం ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించారు. ఏపీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు పంట కాలవల మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి రోజు 200 మంది వేతన దారులు పనులకు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆడారి సాంబశివరావు, ఎం. రమణబాబు పాల్గొన్నారు.
ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
GNTR: ఫిరంగిపురం మండలంలో మొక్కజొన్న, జొన్న, శనగ, మినుము, పెసర తదితర పంటలు కోత దశకు చేరుకున్నప్పటికీ ఇప్పటివరకు ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం ఫిరంగిపురంలోని తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.
పల్నాడు: పెదకూరపాడులోని స్థానిక కచేరి సెంటర్లో విద్యుత్ పోలుకు వైర్లు పిచ్చుక గూడులా అల్లుకుపోయి ఉన్నాయని స్థానిక ప్రజలు తెలిపారు. త్రీఫేస్ లైన్లో పదుల సంఖ్యలో విద్యుత్ వైరు ఉండడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని వినియోగదారులు తెలిపారు. ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకల వలన విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ జరిగితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్: మహానాడు సమీపంలోని వరుణ్ మారుతి షోరూమ్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షోరూమ్ సిబ్బందికి రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించిన అధికారులు, హెల్మెట్ ధరించినప్పుడు తప్పనిసరిగా క్లిప్ పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు.