ASR: రంపచోడవరంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి లక్ష్మణ స్వామి ఆధ్వర్యంలో మహిళలకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్ వినియోగం, నాణ్యమైన వైరింగ్, వంట సమయంలో జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.
VSP: కైలాసగిరిపై నిర్మిస్తున్న త్రిశూల్ను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతున్నామని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈ మేరకు బుధవారం పనుల ప్రగతిని పరిశీలించి ఈ నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పరిసరాల్లో పచ్చదనం, బెంచీలు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.
AKP: జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు డీఐఈవో వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ ఇయర్ 10,315 మంది విద్యార్థులు హాజరు కాగా 7,602 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. అలాగే, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 9,926 విద్యార్థులు పరీక్షలు రాయగా 7,829 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.
CTR: పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం ఎగువ వెంకటాపురం ఎంపీపీ స్కూల్లో చెట్ల తొలగింపుపై గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోను సంప్రదించి చెట్లను తొలగించవద్దని కోరారు. ఎంఈవో, తహసీల్దార్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ATP: పేదల ఆకలి తీర్చేది మన సీఎం చంద్రబాబు నాయుడని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. అనంతరం అన్న క్యాంటీన్కి వచ్చిన ప్రజలతో కలిసి మంత్రి కేశవ్ భోజనం చేశారు. ప్రతి పేదవాడికి మూడు పూటలా కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే కూటమి ప్రభుత్వం ఆశయమన్నారు.
KRNL: ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్తో జిల్లా సాధన జేఏసీ చేపట్టిన దీక్షలు ఇవాళ 151వ రోజుకు చేరుకున్నాయి. ప్రాంతంలో కరువు, నిరుద్యోగం, వలసల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
E.G: రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయంలో తలారి శ్రీను ఆధ్వర్యంలో బుధవారం పార్టీలోకి పలువురు చేరారు. ఈ సందర్భంగా వారికి సిటీ జనసేన ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రియ సౌజన్య పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావజాలం, సిద్ధాంతాలు, పరిపాలన విధానం ప్రజలపట్ల ఆకర్షితులే పార్టీలోకి చేరారన్నారు.
ASR: గూడెంకొత్తవీధి మండల తహసీల్దార్ కార్యాలయంలో 16 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ జాబితాను బుధవారం విడుదల చేశారు. ఎంపీడీవో రమణబాబు, తహసీల్దార్ అన్నజీరావు, ఉప మండల అభివృద్ధి అధికారి రత్నకుమార్ ఈ జాబితాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజలు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు.
E G: రాజానగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం ప్రారంభించారు. అనంతరం పేదలకు ఎమ్మెల్యే అన్నం వడ్డించారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తుందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
TPT: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ ఎంపికయ్యారు. ఈయన నియామకం పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.
AKP: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ రాంబాబు మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరక్కుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాల సమయంలో నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. అలాగే, ఎస్. రాయవరం అడ్డరోడ్డు జంక్షన్లో అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన కల్పించారు.
VSP: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. జోడుగుళ్లపాలెంకు చెందిన శాంతి కుమారి అనే యువతి గదిలో ఉరేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.
VZM: విశాఖ ఎంపీ ఎం. శ్రీ భరత్ స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి బుధవారం కొత్తవలస రైల్వేస్టేషన్ను సందర్శించారు. కొత్తవలస రైల్వేస్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదలపై ప్రస్తావించగా రైల్వే మంత్రి పరిశీలనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
ATP: మహిళలు పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో రాణించడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో 27 మంది గ్రామ సంఘ సహాయకులకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 751 సంఘాలు బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి ద్వారా రూ. 37.84 కోట్ల రుణాలు పొందాయని వెల్లడించారు.
KRNL: పెద్దకడబూరులోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 87 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 75 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో 86 శాతం నమోదైంది. ఇందులో మహాలక్ష్మి 974 మార్కులతో టాపర్గా నిలువగా, ఫస్ట్ ఇంటర్లో 122 మంది పరీక్షలు రాయగా 94 మంది ఉత్తీర్ణులు కాగా, పార్వతమ్మ 454 మార్కులతో టాపర్గా నిలిచింది.