• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మధుపాడలో టేకు తోట దగ్ధం

VZM: గజపతినగరం మండలం మధుపాడలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక టేకు తోటలో గుర్తుతెలియని వ్యక్తులు పొగతాగి పడేయడంతో మంటలు చెలరేగాయి. బుర్ల నాయుడు, అప్పలనాయుడు, కృష్ణలకు చెందిన రెండు ఎకరాల తోట దగ్ధమైంది. ఇందులో సుమారు రూ. 30 వేల ఆస్తి నష్టం వచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

April 9, 2026 / 05:14 PM IST

ఏపీజే అబ్దుల్ కలాం పార్కును సందర్శించిన

SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం పార్కును సందర్శించారు. ఈ మేరకు పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కును అందరికీ అందుబాటులో ఉండే వినోద ప్రదేశంగా తీర్చిదిద్దాలని అన్నారు. అలాగే, పచ్చని వాతావరణంతో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

April 9, 2026 / 05:13 PM IST

కూటమితోనే గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే

NDL: రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం డోన్ మండలంలోని కొత్తబురుజులో జరిగిన సమావేశానికి కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సమస్యలు, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ఏర్పాటు ఇతర సమస్యలపై ప్రజలతో ఆమె నేరుగా మాట్లాడారు.

April 9, 2026 / 05:10 PM IST

YSRతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న వెంకటరామిరెడ్డి

ATP: వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 2003 ఏప్రిల్ 9న ఎర్రటి ఎండలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్సార్ ఈ యాత్ర ప్రారంభించారని పేర్కొన్నారు. నాటి పాదయాత్రలో ఆయనతో కలిసి నడిచిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

April 9, 2026 / 05:10 PM IST

హత్య కేసులో నలుగురు అరెస్ట్

CTR: చౌడేపల్లె మండలం బోయకొండ సమీపంలో ఈనెల 5న కుమారుని కళ్లెదుటే గాంధీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సాయి ప్రసాద్ తెలిపారు. నిందితులు నరసింహులు, లక్ష్మీపతి, రాసతి, నాగరాజులను గురువారం బోయకొండ ఆర్చి వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

April 9, 2026 / 05:09 PM IST

16 నుండి స్వీయ గణన సదుపాయం

GNTR: జనాభా గణనలో భాగంగా ప్రజలకు స్వీయ గణన (Self Enumeration) సదుపాయం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సీ.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. జనాభా గణనపై జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల శిక్షణ కార్యక్రమం అన్ని మండలాల్లో గురువారం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

April 9, 2026 / 04:50 PM IST

మోదీ సమావేశానికి ఆర్‌యూ విద్యార్థిని ఎంపిక

KRNL: ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్-2026’లో భాగంగా ప్రధాని మోదీతో జరగనున్న సమావేశానికి రాయలసీమ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విద్యార్థిని జె.శివకీర్తి ఎంపికైంది. ఈ విషయాన్ని వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు తెలిపారు. గురువారం యూనివర్సిటీలో శివకీర్తిని అభినందించారు. దేశవ్యాప్తంగా 12 లక్షల మంది పాల్గొన్న వ్యాసరచన పోటీలో ఆమె ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.

April 9, 2026 / 04:42 PM IST

నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం పట్టణంలో బ్రెయినీ స్టార్ పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, విద్యా కిట్లను ప్రభుత్వం పారదర్శకంగా అందిస్తోందని పేర్కొన్నారు.

April 9, 2026 / 04:40 PM IST

‘పాదయాత్ర చారిత్రాత్మకమైనది’

SKLM: వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకమైనదని వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. ఈరోజుతో 23 సంవత్సరాలు గడచిన సందర్భంగా టెక్కలిలో కేకు కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహానేత ఆశయాలకు అనుగుణంగా యువనేత జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

April 9, 2026 / 04:35 PM IST

ప్రతీ సమస్యను త్వరగతిన పరిష్కరిస్తా: ఎంపీ

NDL: క్షేత్రస్థాయి ప్రజల నుంచి వచ్చే సమస్యలు, వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆదేశించారు. కల్లూరులోని ఆమె నివాసంలో పాణ్యం నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

April 9, 2026 / 04:34 PM IST

కోనంపేటలో విషాదం.. టీచర్ ఆత్మహత్య

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎలుగోటి రామకృష్ణ (55) తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసిన ఆయన, ఇటీవల ఉద్యోగం మానేసి వ్యవసాయ పనులు చేస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం సమయంలో భార్య గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 9, 2026 / 04:32 PM IST

క్లస్టర్ ఇంఛార్జ్‌లతో భేటీ అయిన లోకేష్

GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం క్లస్టర్ ఇంఛాలతో లోకేష్ భేటీ అయ్యారు. పల్లెల్లో వుండే సామాన్య కార్యకర్త కూడా పోలిట్ బ్యూరులో వుండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీలో పదవులకు పనితీరే ప్రామాణికం అని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలని పేర్కొన్నారు.

April 9, 2026 / 04:31 PM IST

‘తప్పులకు తావులేకుండా మూల్యాంకన ప్రక్రియ జరగాలి’

PPM: పదవ తరగతి మూల్యాంకన ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి మార్కు విద్యార్థి భవిష్యత్తుకు కీలకమని, కోడింగ్-డీకోడింగ్ ప్రక్రియలో ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్వతీపురంలో నిర్వహిస్తున్న మూల్యాంకన ప్రక్రియను సందర్శించారు.

April 9, 2026 / 04:25 PM IST

‘న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలుపరచాలి’

కర్నూలు: న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలుపరచాలని కర్నూలు న్యాయవాదుల సంఘం డిమాండ్ చేశారు. గురువారం పీలేరు బార్‌లో అడ్వకేట్ విధులు నిర్వహిస్తున్న పూజారి ఎల్లయ్య అనే న్యాయవాదిని కొందరు గుర్తుతెలియని దుండగులు హత్యకు నిరసనగా న్యాయవాదుల సంఘం కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన దుండగులను గుర్తించి వెంటనే శిక్షించాలన్నారు.

April 9, 2026 / 04:25 PM IST

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి’

CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అన్ని స్థానాలలోనూ విజయం సాధించాలని ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సూచించారు. కుప్పం మండలం మోట్లచేను పంచాయతీ టీడీపీ సమన్వయ సమావేశం గురువారం ఆయన నిర్వహించారు. విజయం కోసం ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.

April 9, 2026 / 04:24 PM IST