సత్యసాయి: బీడుపల్లిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో జనగణన – 2027పై మూడు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఈ శిబిరాన్ని ప్రారంభించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు జరిగే ఈ శిక్షణలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
VSP: పరవాడలో పైడిమాంబ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి పరవాడ బీసీ కాలనీకి చెందిన పైలా రాధాకృష్ణ దంపతులు రూ.1,00116 విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం చెక్కును గ్రామ సర్పంచ్ ఎస్. అప్పలనాయుడు, పైల శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పి. అప్పారావు, చుక్క రాము నాయుడు పాల్గొన్నారు.
AKP: స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ లో స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికకు సంబంధించి విజన్ యాక్షన్ ప్లాన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా పీ-4 విధానం అమలు జరుగుతుందన్నారు. అభివృద్ధి దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజలను అన్ని విధాల అభివృద్ధిలో తీసుకురావాలన్నారు.
W.G: నరసాపురం మండలం యర్రంశెట్టివారిపాలెంలో కూనపురెడ్డి సంజీవ్రావుపై దాడి చేసిన ఐదుగురిపై రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్సై టీవీ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 22న ఆదివారం కుటుంబ కలహాల నేపథ్యంలో సంజీవ్రావుపై ఆయన కోడలు నవ్యరాణి, ఆమె బంధువులు కోటిపల్లి అబ్బాయి, సురేష్, రామకృష్ణ మరి కొందరితో కలిసి దాడికి పాల్పడ్డారు.
KDP: మాజీ సీఎం వైయస్ జగన్ నేడు వేంపల్లి మండలంలోని నంది పల్లెకు రానున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే ఆయన పులివెందుల చేరుకున్నారు. జగన్ రాకతో అన్ని ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు సిద్ధం చేశారు. తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.
SKLM: జిల్లాలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ మంగళవారం రాత్రి రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాల బాధితులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ASR: గొర్రెల మేకల పెంపకం దారుల సమస్యలు పరిష్కరించాలని గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్, జిల్లా కార్యదర్శి జి.దేముడుబాబు డిమాండ్ చేశారు. మంగళవారం అనకాపల్లి రామునాయుడు భవనంలో మాట్లాడుతూ.. సమస్యలపై వచ్చే నెల 4న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గొర్రెల మేకల పెంపకం దారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు.
ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో ఈనెల 26 నుంచి మార్చి 10 వరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. పార్టీలో తగిన గుర్తింపుతో పాటు సేవా కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంటుందని, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NDL: రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మరి కొందరికి డిప్యూటీ కలెక్టర్లుగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్పై పోస్టింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగా బనగానపల్లె ఆర్డీవోగా నరేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు రాత్రి చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.
KRNL: పత్తికొండ పట్టణంలోని నడిరోడ్డుపై మంగళవారం రాత్రి ఓ పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు చెడిపోయింది. కోర్టు, పోలీస్ స్టేషన్, రీడింగ్ రూమ్, నాలుగు స్తంభాల కూడలి వంటి ముఖ్యమైన ప్రాంతాలు కావడంతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరుకు రోడ్డుపై గంటసేపు బస్సు నిలిచి ఉండిపోవడంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.
NLR: కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామ సర్పంచ్ ఏలూరు ప్రభావతి తన పొలాన్ని అక్రమించుకున్నారని అదే గ్రామానికి చెందిన నూటేటి జనజ ఆరోపించారు. రీ సర్వేలో తన భూమిని సర్పంచ్ పేరు మీదకి మార్చుకున్నారని వాపోయారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
CTR: రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కొందరు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు కలెక్టరేట్లో పనిచేస్తున్న అనుపమను నగరి ఆర్డీవోగా నియమించారు. ప్రస్తుతం నగరిలో ఆర్డీవోగా ఉన్న భవాని శంకర్ రెడ్డిని పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేశారు.
TPT: తిరుపతిలోని ఆటోనగర్కు చెందిన అశాలత (19), ఆమె మేనవరాలు దుర్గా (2) అదృశ్యమైనట్లు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 19న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ తిరిగి రాలేదని తల్లి నాగరత్నం ఫిర్యాదు చేశారు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితురాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెగా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని MLA ఆనందరావు మంగళవారం శాసనసభలో కోరారు. జిల్లాలో క్వాయర్ ఇండస్ట్రీ లేకపోవడాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రస్తావించారు. ‘వన్ ఫ్యామిలీ -వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యంగా అడుగులు వేయాలని, ఉపాధి అవకాశాల కోసం మెగా పరిశ్రమలు తక్షణమే నెలకొల్పాలన్నారు.
PPM: పాలకొండ నగర పంచాయతీలోని శిర్లిపోతన్న ఆలయం వద్ద మంగళవారం జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయం ముందర ఉన్న పోతురాజు విగ్రహం వద్ద మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పూజలు చేశారు. సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో దేవరపేట నుంచి వెంకమ్మపేట వరకు శిర్లు యాత్ర సందడి నెలకొంది.