NDL: డోన్ మండలం నక్కవాగులపల్లి గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, ఆరోగ్య సేవలు, ప్రాథమిక విద్య అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రారంభం అనంతరం చిన్నారులతో మాట్లాడి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ATP: ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ (FCRA) రెన్యూవల్ సాధించడంలో విశేష కృషి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును వికలాంగుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. పట్టణ అధ్యక్షుడు ఉద్దిప్ సింహ బృందం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించారు. రెన్యువల్తో వికలాంగులకు మెరుగైన సేవలు అందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ATP: తుంగభద్ర జలాశయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మంగళవారం సందర్శించారు. డ్యామ్లో ఏర్పాటు చేస్తున్న 32 కొత్త గేట్ల పనులను టీబీ డ్యాం ఉన్నతాధికారులతో కలిసి వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ణాటక జలవనరుల శాఖ సిబ్బంది, ఇంజనీర్లతో పనుల పురోగతిపై చర్చించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
TPT: తిరుపతి ప్రెస్ క్లబ్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రెస్ మీట్ నిర్వహించి, నిన్న YCP నేత కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తిరుచానూరు సమీప ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలన్న ఆరోపణలు పూర్తిగా దుష్ప్రచారమని ఖండించారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కోసం నియమ నిబంధనల ప్రకారమే భూముల కేటాయింపు జరుగుతుందన్నారు.
PPM: శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉంటూ బొత్స సత్యనారాయణ రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం రాష్ట్ర శాసనసభలో ఇటీవల చేసిన తీర్మానం పనికిరాదని బొత్స ప్రకటించడాన్ని భీశెట్టి వ్యతిరేకించారు.
VZM : విజయనగరం ప్రముఖ సేవాపరులు, వ్యాపారవేత్త గురాన సాధూరావు 10వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. చిల్ల పేట గ్రామంలో శ్రీ రామాలయ పునర్నిర్మాణం కోసం రూ. 25,000/- విరాళాన్ని ఇవాళ ఆలయ కమిటీకి అందజేశారు. సాధూరావు జ్ఞాపకార్థం వారి కుటుంబం చేసిన ఈ ఆర్థిక సాయాన్ని గ్రామస్థులు, భక్తులు కొనియాడారు.
KRNL: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ జిల్లాకు చేరుకున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్లో మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి, SP, ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, గెస్ట్ హౌస్ నుంచి నేరుగా కలెక్టరేట్ సమావేశానికి పయనమయ్యారు. జిల్లా అభివృద్ధి, స్థానిక సమస్యలపై మంత్రి సమీక్షించనున్నారు.
ASR: హుకుంపేట మండలం రంగశిల పంచాయతీలో ఇటుకల పండగ సందర్భంగా రహదారికి అడ్డంగా కట్టిన తాడు కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. బైరొడి వలస గ్రామానికి చెందిన కొర్ర ధర్మారావు బైక్పై వెళ్తుండగా తాడు గమనించక మెడకు తగిలి కింద పడి పోయాడు. ఈ ఘటనలో అతనికి మెడకు గాయమైంది. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
GNTR: మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరిలో ‘పీ-4’ పథకం తొలి వార్షికోత్సవ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆర్థికాభివృద్ధికి ‘పీ-4’ పథకం దోహదపడుతుందని తెలిపారు.
NLR: బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడింది. సంగం మండలం మక్తాపురానికి చెందిన డి. బుజ్జిబాబుకు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు, రూ. 42 వేల ఫైన్ విధిస్తూ జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పు చెప్పారు. 2024 మార్చి 30వ తేదీన రాత్రి బుజ్జిబాబు బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.
E.G: రాజమండ్రిలోని అన్న క్యాంటీన్లను సమర్థవంతంగా నిర్వహించాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. మంగళవారం శేషయ్యమెట్టలోని అన్న క్యాంటీన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే, క్యాంటీన్ల నిర్వహణపై నోడల్ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను మంగళవారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ సమస్యలను విన్నవించి వినతిపత్రాలు అందజేశారు. వారి విన్నపాలను సావధానంగా విన్న మంత్రి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గట్టి భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.
GNTR: తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహావీర్ జయంతి (మహావీర్ జన్మకల్యాణక్) వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను లోకానికి బోధించిన గొప్ప దార్శనికుడు భగవాన్ మహావీర్ అని కొనియాడారు.
AKP: నర్సీపట్నంలో శ్రీ మరిడి మహాలక్ష్మి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబంతో కలిసి మంగళవారం ప్రారంభించారు. టీటీడీ కళ్యాణ మండపం వద్ద ప్రారంభించిన ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు ఒక రోజు టికెట్ ఖర్చులను చెల్లించడం జరిగింది. పట్టణంలో మూడు చోట్ల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు.
ATP: కూడేరు మండలంలోని పెన్నహోబిలం రిజర్వాయర్ నుంచి ధర్మవరం కుడి కాలువకు నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఇప్పటి వరకు 630 క్యూసెక్కుల నీరు వదలగా, ప్రస్తుతం దాన్ని 300 క్యూసెక్కులకు కుదించారు. కాలువ పరిధిలోని 49 చెరువులు పూర్తిగా నిండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.