CTR: చిత్తూరులోని లాలు గార్డెన్ ప్రాంతంలో మహిళలకు పలు అంశాలపై ఎస్సై కరీమున్నీసా గురువారం అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల కంటే ముందే బాలికలకు వివాహం చేయడం చట్ట విరుద్ధమని ఆమె తెలిపారు. బాలికల భద్రత కోసం ప్రభుత్వం శక్తి యాప్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అత్యవసర సమయాలలో 112 డయల్ చేయాలని సూచించారు.
W.G: మాగంటి అన్నపూర్ణ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు నేషనల్ మీన్స్ & మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, 9వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు స్కాలర్షిప్కు ఎంపికవ్వడం గర్వకారణమని మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జి. శ్రీధర్ కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థినులను, దిశానిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించి,సత్కరించారు.
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధిక ప్రసవాలు నిర్వహించి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించిందన్నారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో 5500 ప్రసవాల లక్ష్యాన్ని అధిగమించి, 145 శాతంతో 7982 ప్రసవాలు నిర్వహించారని తెలిపారు.
ATP: గుంతకల్లు బజరంగ్దల్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం వీర హనుమాన్ భారీ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీరప్ప సర్కిల్ నుంచి కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్వాములు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
TPT: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలుచోట్ల రేషన్ బియ్యం తుకాల్లో మోసం జరుగుతోందని స్థానికులు అరోపిస్తున్నారు. కేజీ బియ్యానికి పావు కేజీపైగా తగ్గించి ఇస్తున్నరని, తూనికలు కొలతల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బియ్యంతో పాటు పప్పులు, రాగులు, జొన్నలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, చక్కెర తప్ప ఏమీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
PPM: ఈనెల 4న పార్వతీపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజల కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే దిశగా, బి.ఆర్. నాయుడుని వెంటనే ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ వచ్చే శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
VZM: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. కొత్తవలస మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మురళి అధ్యక్షతన నిర్వహించిన ‘బడ్జెట్ ఔట్ రీచ్’ సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
కోనసీమ: ఆలమూరు స్టేషన్ అడిషనల్ ఎస్సైగా డి. సూర్యచంద్రరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన సుదీర్ఘ కాలం పాటు ఆలమూరులో ఏఎస్సైగా పనిచేసి పదోన్నతిపై పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎస్సైగా బదిలీ అయ్యారు. పశ్చిమగోదావరి నుంచి కోనసీమ జిల్లాకు కేటాయించడంతో సూర్యచంద్రరావును ఆలమూరు అడిషనల్ ఎస్సైగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు.
GNTR: తుళ్లూరు మండలం ఉద్దండ్రాయిపాలెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి పీ.నారాయణతో కలిసి కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ, ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రాజధాని బిల్లు ఆమోదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్వెల పండుగ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రకాశం: తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది. పొదలకుంటపల్లి గ్రామానికి చెందిన దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి ఇంటి పక్కన ఉన్న కాశీరాజు ఇంట్లో సెల్ ఫోన్ దొంగతనం చేశాడని తండ్రి మందలించాడు. దీంతో బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయి గుంటూరు వెళ్ళే రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు గురువారం రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణ మూర్తులను అర్చకులు పట్టు వస్త్రాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి రథం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలి వచ్చి కార్యక్రమాన్ని తిలకించారు.
కోనసీమ: రానున్న గోదావరి పుష్కరాలకు పుష్కర ఘాట్లను, ఆలయాలను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ర్యాలి గ్రామంలో జగన్మోహిని కేశవ స్వామివారి ఆలయంలో ఆలయ నిధులు రూ. 28 లక్షలతో చేపట్టిన రాజగోపుర నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు.
PLD: రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నరసరావుపేట ఎమ్మెల్యే డా. అరవింద బాబు పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పిల్లలతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి చదువు, ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాల సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
నంద్యాల ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని మున్సిపల్ హైస్కూల్ను మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి స్వయంగా భోజనం చేసిన మంత్రి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్డు వడ్డించకపోవడాన్ని గమనించిన ఆయన, భోజన నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
PLD: సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అమరావతి అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గుంటూరులోని తన నివాసంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సమయంలో అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన జగన్, ఆ తరువాత మాట తప్పి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారని ఆరోపించారు.