PPM: భామిని మండలంలోని నేరడు గ్రామానికి సమీపంలో ఏనుగుల గుంపు గురువారం హల్ చల్ చేశాయి. నాలుగు ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించి పంటలు నాశనం చేశాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు వరి మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను దారి మళ్లించి అటవీ ప్రాంతానికి తరలించాలన్నారు.
E.G: శ్రీరామ నవమి సందర్భంగా రాజమండ్రి డిపో మేనేజర్ కె. మాధవ్ ఈ నెల 27న రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి నుంచి ప్రతి గంటకు ఒక బస్సు నడుపుతామని , ముందస్తు రిజర్వేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KRNL: దళితులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని దళిత హక్కుల పోరాట సమితి DHPS జిల్లా కార్యదర్శి మహేశ్ డిమాండ్ చేశారు. ఆదోనిలో ఇవాళ జరిగిన DHPS పట్టణ సమితి సదస్సులో ఆదోని నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దళితులపై కుల వివక్షను సహించబోమని హెచ్చరించారు. దళితులపై దాడులు జరిగితే వెంటనే కేసులు నమోదు చేయాలని కోరారు.
NDL: నంద్యాలలోని ESC ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో POLYCET-2026 ఉచిత శిక్షణ తరగతులు వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ గురువారం తెలిపారు. SSC లేదా సమాన పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఏప్రిల్ 2లోపు దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తామని చెప్పుకొచ్చారు.
ప్రకాశం: కొండపి గ్రంథాలయంలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని జిల్లా గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ తెలిపారు. గురువారం ఆమె కొండపి గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. పుస్తకాలను పరిశీలించారు. గ్రంథాలయంలో మరుగుదొడ్లు లేవని పాటకలు ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
కోనసీమ: ముమ్మిడివరం మండలం అయినాపురం సెంటర్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. గురువారం స్థానిక సర్పంచ్ మోకా రామారావు, ముమ్మిడివరం ఎస్ఐ డి.జ్వాలా సాగర్ ఏర్పాట్లను పరిశీలించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
KDP: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మైదుకూరులో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జాతీయ రహదారులు 40, 67పై డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వ్యతిరేక దిశలో వచ్చిన ఒక లారీని సీజ్ చేసి కోర్టుకు హాజరు పరిచారు.
W.G: నరసాపురం-మాధవాయి పాలెం ఫెర్రీ వేలం పాట వాయిదా పడింది. స్థానిక MPDO కార్యాలయంలో గురువారం నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ అనివార్య కారణాల వల్ల నిలిపివేసినట్లు జాయింట్ కమిటీ సభ్యులు తెలిపారు. MPDO అనారోగ్యానికి గురవ్వడం, జిల్లా పరిషత్ CEO అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి వేలం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులోని RCM చర్చిలో యేసు తిరు హృదయ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభయాయాయి. మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఫాదర్ మోలుగుమాటి ప్రకాష్ పాల్గొని యేసు తిరు హృదయ విశిష్టను విశ్వాసులకు వివరించారు. ఆనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
CTR: పుంగనూరులో హనుమంతరాయుని దిన్నె శ్రీ వీరాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను వేదపండితులు అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజపటాన్ని ఎగురవేశారు.
ASR: హుకుంపేట మండలం పెద్దగరువు టోల్ గేట్ వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. తెడబారికి సురేష్ కుమార్ సంబంధిత అధికారులకు గురువారం వినతిపత్రం సమర్పించారు. 60 కిలోమీటర్ల పరిధిలోని స్థానిక వాహనదారులకు లోకల్ ప్రీ పాస్ లేదా ఆధార్ ఆధారంగా టోల్ మినహాయింపు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ ఆదాయ వృద్ధిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు సమన్వయంతో పని చేసి లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మున్సిపల్, పంచాయతీరాజ్ పనుల్లో తప్పనిసరిగా జీఎస్టీ అమలు చేయాలని ఆదేశించారు.
VSP: మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV టీకా పంపిణీ, అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ ఎంతగానో దోహదపడుతుందని, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి చైతన్యం కల్పించాలని గంటా రవితేజ సూచించారు. వ్యాక్సిన్ నిల్వలు, పంపిణీ తీరుపై వైద్యాధికారిణి డాక్టర్ దీపికను అడిగి తెలుసుకున్నారు.
NLR: జిల్లాకు నూతనంగా 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలు మంజూరైనట్లు జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పశుసంవర్థకశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నూతనంగా మంజూరు చేసిన 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలను త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
W.G: తాడేపల్లిగూడెం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో గురువారం జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర రావు విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2 లక్షల 32 వేల ఎకరాల్లో వరి సాగు చేశారని ఆయన తెలిపారు. ఈ మేరకు 9 లక్షల 57 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి రానుందని అంచనా వేసామన్నారు. జిల్లాలో 7 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల దాన్యం సేకరించాలని తెలిపారు.