బాపట్లలో కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో 20 టాయిలెట్స్, యూరినల్స్, నీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతతో పూర్తయ్యేలా చూడాలని, వారంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ డాబాగార్డెన్స్లో ఎన్ఏజే జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. అలాగే, 13 డిమాండ్లు మంత్రికి వినిపించగా, కొన్ని త్వరలో పరిష్కారం అవుతాయని చెప్పారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్, బీమా వంటి అంశాలపై ముందడుగు పడనుంది.
ASR: అనంతగిరి మండలం బొర్రా పంచాయతీ పెద్దూరు గ్రామంలో తాగునీటి పైపులైన్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో పైపులు కాలిపోవడంతో గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు అధికారులు తక్షణమే స్పందించి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు. అలాగే, దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బాపట్ల జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని జాయింట్ కలెక్టర్ భావన సూచించారు. ఇప్పటికే 1.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. ఈ నెల 28తో కొనుగోలు కేంద్రాలు మూసివేయనున్నందున, రైతులు గడువు ముందే విక్రయాలు పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.
PPM: సీతానగరం మండలంలోని నిడగల్లు గ్రామ పరిధిలో రెండు ప్రతిపాదిత క్వారీల నిర్వహణపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఆయన స్వయంగా స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. క్వారీ నిర్వహణలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలన్నారు.
KRNL: గూడూరులో రైతన్నా మీకోసం, పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో ఇవాళ కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయని చెప్పారు.
కడప నగర శివారులోని డంపింగ్ యార్డ్ను కమిషనర్ రాకేష్ చంద్ర పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (8 ఎకరాలు), వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ (40 ఎకరాలు) ఏర్పాటుపై సమీక్షించారు. విండ్రో కంపోస్టింగ్ విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్జీటీ మార్గదర్శకాల ప్రకారం ఘన వ్యర్థాల నిర్వహణను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
TPT: నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వివిధ అవకాశాలు, సబ్సిడీలు, పథకాల వివరాలు తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. రైతులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే గేటు వద్ద ట్రాక్ మరమ్మత్తు పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ పనులు ఈనెల 20 తేదీ వరకు జరుగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మరమ్మత్తుల వలన 20 తేది వరకు రైల్వే గేటు మూసివేస్తున్నారు. వాహనదారులు గ్రహించి ప్రత్యామ్నాయ మార్గాలని ఏర్పాటు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
E.G: మండపేట(మం) కేశవరం నుంచి అనపర్తి వరకు కెనాల్ రోడ్డు తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. ఇవి కొన్ని ప్రధాన మలుపులు వద్ద ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక వాహనదారులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను గుర్తించిన రూరల్ CI దొరరాజు R&B అధికారులతో కలిసి తుప్పలు, పిచ్చి మొక్కలను మంగళవారం తొలగించారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ మంగళవారం తెలిపారు. బకాయిదారులను ప్రోత్సహించేందుకు వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ నెలాఖరు (మార్చి 31) లోపు తమ పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించేవారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందన్నారు.
AKP: వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం తగదని పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. దీనికి నిరసనగా అనకాపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. మహిళలను వేధిస్తున్న టీటీడీ ఛైర్మన్ నాయుడు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముత్యాల నాయుడు, మాజీ ఎంపీ డాక్టర్ బి వి సత్యవతి పాల్గొన్నారు.
కృష్ణా: మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల పురోగతిపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. 61 హాస్టళ్ల అభివృద్ధికి రూ.10.35 కోట్లు మంజూరు కాగా, రూ.5 కోట్లతో 46 హాస్టళ్లలో పనులు పూర్తయ్యాయి. తాగునీరు, ఆహార నాణ్యతపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
సత్యసాయి: కనగానపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మండల అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్షించారు. ఈ సందర్బంగా ఉపాధి హామీ పనులలో భాగంగా కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి, ఇంటి స్థలాలు అవసరమైన లబ్ధిదారులను గుర్తించడంతో పాటు వచ్చే వేసవిలో గ్రామాలలో త్రాగు నీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.