• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేటి నుంచే జామి ఎల్లారమ్మ తల్లి జాతర

VZM: జామిలోని శ్రీ ఎల్లారమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ జాతర మహోత్సవాలలో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం అమ్మవారి జాతర, బుధవారం చిన్న తీర్థం జరుగుతుంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

February 23, 2026 / 07:42 AM IST

26న అమలాపురంలో ఉద్యోగ మేళా

కోనసీమ: అమలాపురం ఉపాధి కార్యాలయంలో ఈనెల 26న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమో విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.

February 23, 2026 / 07:40 AM IST

కార్యకర్తలకు తోడుగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే

గుంటూరులో నిర్వహించిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే శంకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలకు తానున్నాననే భరోసా కల్పిస్తూ, ప్రతి సోషల్ మీడియా వారియర్‌కు అండగా ఉంటానన్నారు.

February 23, 2026 / 07:39 AM IST

‘తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియొగం చేసుకోండి’

KRNL: బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఆచార్య ఎన్డీరంగా విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సమన్వయంతో జాతీయ తేనెటీగల మండలి ఆధ్వర్యంలో శాస్త్రీయ తేనేటీగల పెంపకంపై 7 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేవీకే సమన్వయకర్త డాక్టర్ కె. రాఘవేంద్రచౌదరి తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 3వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.

February 23, 2026 / 07:39 AM IST

ఆధార్ లేక చదువుకు దూరమవుతున్న చిన్నారులు

ASR: జీకే వీధి మండలం పేట్రాయి గ్రామంలో ఐదు గిరిజన కుటుంబాలకు చెందిన 7 గురు పిల్లలకు నేటికి ఆధార్ కార్డులు లేవు. పాఠశాలల్లో ప్రవేశానికి ఆధార్ తప్పనిసరి కావడంతో వీరికి చదువు దూరమవుతోంది. గిరిజన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి వారికి ఆధార్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

February 23, 2026 / 07:38 AM IST

నల్లమలలో మళ్లీ వజ్రాల వేట

NDL: నంద్యాల-గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు వజ్రాల కోసం అన్వేషణను పునఃప్రారంభించారు. సర్వ నరసింహ స్వామి ఆలయం సమీపంలోని వాగు, వజ్రాల వంక వద్ద రాయలసీమతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆశావహులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ అన్వేషణతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.

February 23, 2026 / 07:35 AM IST

‘నేడు మదనపల్లిలో PGRS అర్జీల స్వీకరణ’

అన్నమయ్య: మదనపల్లె కలెక్టరేట్లో సోమవారం PGRS ద్వారా అర్జీలను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను కలెక్టరేట్లోని PGRS ద్వారా అందజేయవచ్చునని చెప్పారు.

February 23, 2026 / 07:35 AM IST

మాజీ మంత్రి జోగి రమేష్‌ని కలిసిన మాజీ శాసనసభాపతి

NTR: ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 23, 2026 / 07:31 AM IST

జిల్లా వ్యాప్తంగా 82 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

బాపట్ల జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు మొత్తం 15,944 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అన్ని వసతులు కల్పించామని అధికారులు తెలిపారు.

February 23, 2026 / 07:27 AM IST

పుంగనూరు బస్సు సెంటర్ వద్ద డెడ్ బాడీ..!

CTR: పుంగనూరు పట్టణం పుంగమ్మ చెరువు కట్టపై గల బస్సు షెల్టర్‌లో ఓ వ్యక్తి డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. అతడికి దాదాపు 40 ఏళ్లు ఉండవచ్చని తెలిపారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 23, 2026 / 07:21 AM IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణోత్సవ పూజలు

ATP: గుత్తికొండలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకువజామున పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు చేసి, బంగారు, వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

February 23, 2026 / 07:20 AM IST

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

BPT: చెరుకుపల్లి మండలం కావూరు హైస్కూల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జొన్నలగడ్డవారిపాలెం గ్రామానికి చెందిన మొవ్వ ముత్యాలరావు (46) దుర్మరణం చెందారు. రాంబట్లపాలెం నుంచి ఎరువుల బస్తాలతో బైకుపై ఇంటికి వస్తుండగా, గుర్తుతెలియని కారు ఆయనను బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ముత్యాలరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 07:18 AM IST

దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

KDP: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లిని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ఆమె భర్త, టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ కమిటీ సభ్యులు వీరికి ఆహ్వానం పలికి దర్శనం చేయించారు.

February 23, 2026 / 07:18 AM IST

శ్రీకాళహస్తికి చాగంటి కోటేశ్వరరావు రాక

TPT: శ్రీకాళహస్తికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవాళ రానున్నారు. గోపురం వద్దగల ధూర్జటి కళా ప్రాంగణంలో ఆయన ప్రవచనం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు భక్తులకు ఆత్మశాంతి అందిస్తాయన్నారు.

February 23, 2026 / 07:12 AM IST

పలుకూరిలో పర్యటించిన రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్

NDL: రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ ఆదివారం బనగానపల్లి మండలం పలుకూరు గ్రామంలో పర్యటించారు. గ్రామ సమీపంలో నాపరాల్ల మైనింగ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నేరుగా కార్మికులతో మాట్లాడి పరిశ్రమల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వడ్డెర సంక్షేమానికి కార్మికులకు ప్రత్యేక కృషి చేస్తుందని ఆయన అన్నారు.

February 23, 2026 / 07:11 AM IST