NTR: AP CRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన MIS ఆపరేటర్, ESM యూనిట్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, DEE-ఎలక్ట్రికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 2లోపు https://crda.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని CRDA కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. విద్యార్హత, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించగలరు.
PPM: పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాలులో శుక్రవారం జరిగిన ‘గిరిజన పీజీఆర్ఎస్’ కార్యక్రమానికి స్పందన లభించింది. ఐటీడీఏ ఇంఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గిరిజనుల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 5 ప్రధాన వినతులు అధికారుల దృష్టికి వచ్చాయి. వినతులను పరిశీలించారు.
CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం రేపు (శనివారం )ఉదయం 11 గంటలకు జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ అలీమ్ బాషా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
TPT: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షలు జరిగాయి. తిరుపతి జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 2,146 మంది విద్యార్థులకు గాను 1,965 మంది పరీక్షకు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 181 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఆయన తెలియజేశారు.
ATP: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తన కుమారుడు జనార్థన్ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అసెంబ్లీ హాలులో ఎమ్మెల్యే పరిటాల సునీతకు అందజేశారు. గౌరు వెంకటరెడ్డి, చరితా రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు జనార్థన్ రెడ్డి వివాహం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తె సనాతనితో నిశ్చయమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా తోటి ప్రజాప్రతినిధులను పెళ్లికి ఆహ్వానించారు.
ATP: ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ. 44,74,717 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు. అనంతపురంలోని తన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
VZM: గరివిడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు చిత్తూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అండర్-14,17లో కుమారి శ్రీనిధి కు రజతం, భార్గవి రజితం, కీర్తి కి కాంస్యం, సాయి కి కాంస్యం పథకాలు సాధించారని ఇంఛార్జ్ హెచ్ఎం శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జెడ్పీటీసీ సభ్యులు వాకడ శ్రీను, ఉప సర్పంచ్ కార్తీక్ అభినందించారు.
SKLM: ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ టీ.ఎఫ్ ఉపాధ్యాయ శాఖ రాష్ట్ర కౌన్సిలర్ చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమదాలవలస ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
AKP: బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో రజిత పతకం సాధించిన పోలీస్ కానిస్టేబుల్ జి. శ్రీనివాసరావును ఎస్పీ తుహీన్ సిన్హా అభినందించారు. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఈ నెల 9న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రజిత పథకం సాధించిన శ్రీనివాసరావు పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచారని అన్నారు. శుక్రవారం కానిస్టేబుల్ను ఎస్పీ సత్కరించారు.
CTR: పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో SC, ST విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. దళితవాడలో నెలకొన్న సమస్యలపై కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని వాపోయారు. MPDO అప్పాజీ మాట్లాడుతూ.. గ్రామాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు.
GNTR: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో పొలంబడి, పొలం పిలుస్తుంది కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. గుంటూరు రెగ్యులర్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్రావు మాట్లాడుతూ.. శనగ పంటలో కనిపించే ఎండు తెగులు, వేరు కుళ్లు తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు.
ప్రకాశం: పుల్లలచెరువు మండలం చాపలమడుగు గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రుజువుకావడంతో పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావును జిల్లా కలెక్టర్ రాజబాబు సస్పెండ్ చేశారు. నిధుల వినియోగంపై నిర్వహించిన విచారణలో అవకతవకలు వెలుగుచూసినట్లు సమాచారం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
TPT: సత్యవేడు పట్టణంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల సొమ్ము పంపిణీ జరగనుంది. టీడీపీ నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఉదయం 9 గంటలకు నేతాజీ రోడ్డు, గాంధీ రోడ్డు ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నట్లు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం సెలవు కారణంగా ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
ATP: గుంతకల్లు మండలం వెంకటంపల్లి గ్రామంలోని పెద్ద కదిరప్ప స్వామి దేవాలయానికి రూ.45 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి తహశీల్దార్ రమాదేవి మండల ఇంఛార్జి గుమ్మనూరు నారాయణస్వామి హాజరయ్యారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో ఏలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
సత్యసాయి: కొత్తచెరువులోని పురాతన సోమేశ్వర స్వామి ఆలయానికి గ్రీన్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంట సామాగ్రిని పంపిణీ చేశారు. భక్తుల కోరిక మేరకు ప్రసాదాల తయారీ, శుభకార్యాల కోసం అవసరమైన పాత్రలు, బకెట్లు, జగ్గులను టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ అందజేశారు. సత్యసాయి బాబా ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.