ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అనంత నాగ్ సంగీత్ స్వర్గ్ కల్చరల్ అసోసియేషన్, సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీప ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. మైఖేల్ బాబు నిర్వహించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి.
NLR: నెల్లూరులోని పేదలకు నారాయణ నేత్ర జ్యోతి ద్వారా ఉచితంగా కార్పొరేట్ కంటి వైద్యం అందిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. గత 12 రోజుల్లో 12 చోట్ల శిబిరాలు నిర్వహించి 1,316 మందికి పరీక్షలు చేశామన్నారు. గురువారం తొలి విడతలో 230 మందికి మంత్రి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. రాబోయే రెండేళ్లలో 48 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ELR: నూజివీడు పట్టణంలోని అనేక వార్డులలో మున్సిపల్ కమిషనర్ కె.పీరయ్య శుక్రవారం ఉదయం పరిశుభ్రతపై పరిశీలన చేశారు. రోడ్లపై విచక్షణారహితంగా చెత్తను కుప్పలుగా వేయడాన్ని గమనించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. చెత్తను సేకరించేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది వస్తున్నారని, వారికి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇవ్వాలని సూచించారు.
TPT: టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలో భక్తుల సౌకర్యాల మెరుగుదలకు శ్రీవారి సేవకులు సూచనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. శ్రీవారి సేవా సదన్-2ను సందర్శించి, సేవకులతో సమావేశమై అన్నప్రసాదం, పరిశుభ్రత, క్యూలైన్ నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సేవకుల ఫీడ్బ్యాక్ భక్తుల సేవలను మెరుగుపరచడంలో కీలకమని ఆయన తెలిపారు.
SKLM: కొత్తూరులో టీచర్స్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ నుంచి జరగనుంది. స్థానిక ఉన్నత పాఠశాల మైదానం, ఓండ్రుజోల సమీపంలోని మైదానాల్లో ఈ టోర్నమెంట్ జరుగుతోందని ఎంఈవోలు గోవిందరావు, శ్రీనివాస రావు తెలిపారు. 12 మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని, మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీ అందిస్తామని తెలిపారు.
SKLM: కవిటి మండలం బి.గొనపపుట్టుగ గ్రామానికి చెందిన పిరియా చలపతిరావు కళా రంగంలో విశేష సేవలందించినందుకు కళా రత్న అవార్డుకు ఎంపికయ్యారు. గురువారం ఉగాది వేడుకల్లో భాగంగా విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు ‘కళా రత్న’ అవార్డును ఆయనకు అందించి, సత్కరించారు.
KDP: మైలవరం మండలం వద్దిరాలలో సుంకులాంబ పరంజ్యోతి తిరుణాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 5 వరకు చెన్నయ్య ఆధ్వర్యంలో చెక్కభజన నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు సిరిమానోత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 8 వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు, 9 నుంచి నెల్లూరు వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
KRNL: ఆత్మకూరు పట్టణానికి చెందిన ముర్తుజావలి (35) సిద్ధాపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, చెరువులో మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి నలుగురు కుమార్తెలు ఉన్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.
CTR: రామకుప్పం మండల పరిధిలో ఒంటరి ఏనుగు రైతులను హడలెత్తిస్తోంది. నిత్యం రాత్రి పూట ఆహారం కోసం వ్యవసాయ పంట పొలాల వైపు వస్తుండటంతో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ననియాల ఎలిఫెంట్ క్యాంపు పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల వైపు ఏనుగు తిరుగుతూ ఉండడంతో ఎప్పుడు గ్రామాలపై పడుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
NDL: రాష్ట్ర ప్రభుత్వం శనివారం రంజాన్ సందర్భంగా సెలవు ప్రకటించింది. దీంతో ఆ రోజున జరగవలసిన పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంగ్లీష్ పరీక్ష వాయిదాను గమనించాలని పేర్కొంది.
KRNL: ఆస్పరి మండలం కైరప్పలలో భద్రకాళి శ్రీ వీరభద్ర స్వామి ఉత్సవాలలో భాగంగా నేడు పిడకల సమరానికి ప్రజలందరూ సిద్ధమైనట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామి వారిపై ఉన్న భక్తితో పిడకల సమరం ఆడతారన్నారు. ఈ సమరంలో పుప్పాల దొడ్డి, కలపరి, బిల్లే కళ్లు, చెన్నంపల్లి, దొడగొండ, కారుమంచి, గ్రామాలు ప్రజలు పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు.
KKD: సామర్లకోట పంచారామ క్షేత్రంలో ఉగాది వేళ విషాదం నెలకొంది. పెద్దాపురం కొత్తపేటకు చెందిన వెన్నెల ప్రశాంత్ (27) ఆలయ కోనేరులో మునిగి మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్న ప్రశాంత్.. కాబోయే భార్యతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు
VZM: డెంకాడ మండలం అయినాడ కూడలి వద్ద గురువారం రాత్రి విజయనగరం నుంచి విశాఖ వెళ్తున్న కారు, రోడ్డు దాటుతున్న వ్యక్తిని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ వ్యక్తిని హుటాహుటిన విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: ఇచ్ఛాపురంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లుపడ గ్రామానికి చెందిన ఉప్పాడ కుమార్ (35) మృతి చెందాడు. బైక్పై వస్తున్న కుమార్ను ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం తగలడంతో స్థానికులు చూసే సరికి మృతిచెంది ఉన్నాడని ఎస్సై ముకుందరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
AKP: గంజాయి రవాణా కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగారా శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం కోర్టు జడ్జి హరి నారాయణ తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్ గురువారం తెలిపారు. 2014 ఆగస్టులో వరంగల్కు చెందిన మండా జీవన్ 440 కిలోల గంజాయి రవాణా చేస్తూ మాడుగుల ఎక్సైజ్ అధికారులకు పట్టుబడినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.