సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి సన్నిధిలో జరిగే కార్యక్రమాల వేళలను ట్రస్టు వర్గాలు మార్చాయి. సోమవారం నుంచి కొత్త సమయాలు అమలులోకి రానున్నాయి. ఉదయం 8 గంటలకు వేద పఠనం, 9 నుంచి 9:30 వరకు భజనలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు వేద పఠనం, 5:45 నుంచి 6:30 వరకు భజనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
AKP: పాయకరావుపేట నియోజకవర్గంలో గల పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి జగత శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్న పరిశ్రమలు స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు.
కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామర్లకోట రోడ్డులో పేకాట స్థావరంపై సీఐ మజ్జి అప్పలనాయుడు బృందం ఆదివారం రాత్రి మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 12 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.51 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
CTR: బైరెడ్డిపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 25న కోలారు జాలప్ప ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం నిర్వహించనున్నట్లు స్థానిక వైద్యాధికారి విజయ్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు. నేత్ర వైద్య నిపుణుల సలహాతో లెన్స్ అమర్చడం, అవసరమైన వారికి నేత్ర శస్త్రచికిత్సలు చేస్తారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
GNTR: నిడుముక్కలలో ఉన్న హజరత్ సయ్యద్ బాజీ షాహీద్ సర్కార్ అవులియా బాబా 74వ ఉరుసు మహోత్సవాలను ఈ నెల 23 నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు ముజాఫర్ హజరత్ షేక్ షబ్బీర్ తాజ్ ఉల్ ఖాద్రీ చెప్పారు. ఈ నెల 23న గుసూల్, 24న చందనం, 25న అన్న సంతర్పణ ఏర్పాటు చేశామని, ఉరుసు సందర్భంగా మూడు రోజులు ప్రత్యేక ప్రార్థనలు, సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.
KRNL: కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను ఆదివారం మండల అధ్యక్షులు చూడి సురేష్ నాయుడు పరామర్శించారు. కోసిగి రమేష్, అయ్యన్నల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి కూడా ఫోన్లో బాధితులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబు సోమవారం గుంటూరు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో జరిగే PGRS కార్యక్రమానికి హాజరుకానున్నారు. తన ఇంటిపై జరిగిన దాడి, అరెస్ట్ సమయంలో పోలీసుల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తూ పూర్తి విచారణ కోరనున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత మళ్లీ పెరిగింది.
BPT: యద్దనపూడిలో పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని ఎస్సై రత్న కుమారి తెలిపారు. ఆదివారం బహిరంగంగా మద్యం సేవిస్తున్న పలువురిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
VZM: ఈ నెల 25న AP SIRD ఆదేశాల మేరకు గంట్యాడ మండల పరిధిలోని MPTCలు, సర్పంచ్లు, వార్డ్ మెంబర్లకు గ్రామ స్థాయిలో మంచి నీటి రక్షణపై శిక్షణ ఇస్తున్నట్లు స్థానిక MPDO ఆర్వీ.రమణమూర్తి తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆరోజు తమ కార్యాలయంలోనే ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని, మండల పరిధిలో ఉన్న సర్పంచ్లు, MPTC, వార్డు మెంబర్లు హాజరుకావాలన్నారు.
ATP: వజ్రకరూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు 200 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 150 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
AKP: మాజీ మంత్రి దివంగత గుడివాడ గుర్నాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం మాట్లాడుతూ.. కొందరు దుండగులు అల్లర్లు సృష్టించేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
శ్రీకాకుళం నగరం పాల కొండ రోడ్డులోని కోదండ రామాలయంలో సోమవారం నుంచి కోదండ రాముడి కల్యాణోత్సవాలు, శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నట్లు అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు తెలిపారు. 27న శ్రీరామ చంద్ర మూర్తి కల్యాణం, 29న వార్షిక కల్యాణం, 31న రథోత్సవం, ఏప్రిల్ 2న పట్టాభిషేకం, 3న పుష్పయాగ మహోత్సవం జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
SKLM: పలాస(M) తర్లాకోటలో ఆదివారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ తమ సెల్ ఫోన్లో నారి శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.
సత్యసాయి: రాష్ట్రంలోని చేనేత కళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. విజయవాడలో నిర్వహిస్తున్న గాంధీ బునకర్ మేళాను ఆమె సందర్శించారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ. 4,000 పెన్షన్, ఏప్రిల్ నుంచి ఉచిత విద్యుత్ అందించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజుల్లోనే రూ. 47.35 లక్షల అమ్మకాలు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు.
BPT: పేద విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాపట్లలో వివిధ ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పథకాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.