Vinod Kumar: తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వనరులున్న బంగారు పళ్లెం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టారన్న మాటలను రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తప్పుబట్టారు.
Vinod Kumar: తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వనరులున్న ఒక బంగారు పళ్లెం. రాష్ట్రాన్ని ఒక బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చామని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మరికొందరు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తెలంగాణను అప్పుల కుప్ప చేశారని అనడంతో వినోద్ కుమార్ వాటిని తప్పుపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని అనడం కాదు. దేశంలోని 28 రాష్ట్రాల ఆర్థిక వనరుల వివరాలు ఆర్బీఐ విడుదల చేసిన ఆర్థిక విశ్లేషణను పరిశీలించామని తెలిపారు.
ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో తెలంగాణ 84.2 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. కేసీఆర్ ఎంతో శ్రమించి పదేళ్ల పాటు తెలంగాణను బంగారు పళ్లెంగా మార్చారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలనను అందించాలని ఆశిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో పుష్కలంగా ఆర్థిక వనరులు విద్యుత్, నీటి సౌకర్యం ఉన్నాయి. వీటితో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరిగాయని తెలిపారు.
రాష్ట్రంలో నిరంతరాయంగా 24 గంటల విద్యుత్తు సరఫరా కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు పనిచేయడం, ఐటీ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించామని వినోద్ కుమార్ తెలిపారు. 2014లో 7778 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉంటే ప్రస్తుతం 26,000 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం తెలంగాణ అభివృద్ధి సాధించి నిదర్శనమని చెప్పుకోవచ్చన్నారు.