KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన వైస్ ఛైర్మన్ బొంతు సుమలత, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, బండారు శరత్ చంద్ర శనివారం TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తమ గెలుపుకు కృషి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. అనంతరం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయన వైస్ ఛైర్మన్, కౌన్సిలర్స్కు శుభాకాంక్షలు తెలిపారు.
JGL: సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు ఆయనను సన్మానించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ADB: పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
BDK: మణుగూరు శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ సందర్శించారు. ఆశా వర్కర్లతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.
వనపర్తి: దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి, విద్య, ఉపాధి అవకాశాల కోసం రవాణా సౌకర్యం చాలా అవసరమని తెలిపారు.
వనపర్తి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సీఎం కప్ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
MDK: మున్సిపల్ ఛైర్పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ ఛైర్మన్ దొంతి నరేశ్ గౌడ్లను శనివారం పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు మేడి సతీశ్ రావు నేతృత్వంలో వారిని ఘనంగా సన్మానించి, సంఘం కార్యకలాపాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు సబ్బాని శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు
MBNR: పాలమూరు యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగ విద్యార్థి అమ్తుల్ ఫాతిర్ పర్హిన్ పీహెచ్డీ సాధించారు. ప్రొఫెసర్ మనోజ పర్యవేక్షణలో ‘తెలంగాణలోని మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో హై స్కూల్ స్థాయిలో నాన్ ఇంగ్లీష్ మీడియం ముస్లిం మైనారిటీ విద్యార్థుల సమస్యలు’ అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను పియూ డాక్టరేట్ ప్రదానం చేసింది.
HYD: నగరాన్ని కుదిపేసిన దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లకు నేటితో 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ ఘోర ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఘటనాస్థలికి చేరుకుని మృతులకు పుష్పాంజలి ఘటించారు.
BDK: ఇల్లందు నియోజక వర్గం ముత్యాలంపాడు గ్రామంలో 293 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాని సొంతింటి కల ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని, నిరుపేదలకు సన్నబియ్యం, ఫ్రీ బస్సు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
NLG: నకరికల్లు మండలం గొల్లగూడెం గ్రామ శివారులో రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి నుంచి టిప్పర్లతో కాంట్రాక్టర్లు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. అక్రమంగా తవ్వకాలు చేయడంతో భూగర్భ జలాలు దెబ్బతిని నష్టపోతామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని మట్టి తవ్వకాలు జరపకుండా ఆపాలని కోరుతున్నారు.
NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడడంతో శనివారం కాలనీవాసులు గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్కు సమస్య పరిష్కారానికై వినతి పత్రాన్ని అందించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. అతి తొందర్లోనే కాలనీలో తాగునీటి సమస్యను తీర్చేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
JGL: వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జైలు శిక్ష తప్పదని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ హెచ్చరించారు. జగిత్యాలలోని కౌన్సిలింగ్ కేంద్రంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డివిజన్ల వృద్ధుల ఫిర్యాదులపై కొడుకులను పిలిపించి విచారణ చేశారు. తల్లిదండ్రులను పోషించకపోతే 6 నెలల జైలు శిక్ష పడుతుందన్నారు.
మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని టోల్ గేట్ వద్ద టోల్ గేట్ కార్మికులు తమ వేతనాలు చెల్లించాలని శనివారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం వాడి గ్రామానికి చెందిన కళ్యాణ్ సంతోశ్ (44) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కూలీ పనులు చేసుకునే ఆయన కొంతకాలంగా మద్యానికి బానిసయ్యారు. మద్యం మత్తులో ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడినట్లు SI సుప్రియ తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.