MNCL: నెన్నెల మండల MRO కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని MRO శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. MRO మాట్లాడుతూ.. మండల ప్రజలు ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణకు, కొత్త కార్డుల నమోదుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KMR: రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ‘సీఎం-కప్’ క్యారం పోటీల్లో జిల్లా యువకులు ప్రతిభ చాటారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో రామారెడ్డి యువకులు ప్రణయ్, రాజు, జగదీశ్ పాల్గొని మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. విజేతలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ విజేతలను అభినందించారు.
KMM: హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్కు దూరంగా ఉండాలని కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రియదర్శని ఇంజనీరింగ్ కాలేజ్లో ‘అరైవ్ అలైవ్’ రహదారి భద్రత ప్రచారం నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ సాధ్యమన్నారు. పొగమంచు సమయంలో లో-భీమ్ లైట్లు, సురక్షిత దూరం పాటించాలని తెలిపారు.
KMM: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన శిక్షణ అందించాలని, కేంద్రంలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. ముదిగొండ మండలం రాఘవాపురంలోని ప్రాథమిక పాఠశాల భవిత కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల నమోదు, వారికి అందుతున్న విద్య, వైద్య సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
SDPT: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధరణి పేరుతో దోచుకున్నది కేసీఆర్ కుటుంబమేనని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ ఆరోపించారు. చిన్నకోడూరులో ఆయన శుక్రవారం మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే హరీశ్ రావు ఏనాడు తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేయలేదన్నారు. అధికారం పోయాక తనిఖీలు చేపట్టడం సిగ్గు చేటని విమర్శించారు.
మెదక్ జిల్లా రామాయంపేట సబ్స్టేషన్ వద్ద విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా బచ్చు రాజుపల్లి తండాకు చెందిన బాబూలాల్ అనే ప్రైవేట్ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్ తరలించగా, తమకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు సబ్స్టేషన్ వద్ద అధికారులతో వాగ్వాదానికి దిగారు.
NZB: భీమ్గల్ పట్టణానికి చెందిన పిండి పోసాని అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. బాల్కొండ కాంగ్రెస్ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో సీఎం సహాయనిధి నుంచి రూ.2.50 లక్షల సాయం ఆ కుటుంబానికి అందింది. ఆపదలో అండగా నిలిచిన సునీల్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
NRPT: గుండుమల్ మండలంలోని కొమ్మూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి స్వయం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ఉత్తమంగా విద్యాబోధన చేసిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ వనజ గంగాధర్ గౌడ్ బహుమతులను అందజేశారు.
NZB: నవీపేట్ మండల కేంద్రంలోని టీజీఎంఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా నిర్వహించారు. జనరల్ విభాగంలో 189 మందిలో 187 మంది హాజరై, ఇద్దరు గైర్హాజరయ్యారు. వోకేషనల్ విభాగంలో 31 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారు. మొత్తం 218 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం RTI ACT-2005 జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాసం అనిల్ కుమార్ రెండో సారి నియమితులయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్, జిల్లా అధ్యక్షుడు వర్ని సంతోష్ అధ్యక్షతన శుక్రవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. దీంతో నిరంతరం ప్రజల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తూ రెండో సారి పదవి దక్కించుకున్న అనిల్ను పలువురు అభినందించారు.
JN: పాలకుర్తిలో తెలంగాణ రైతు సంఘం మూడవ మహాసభలను నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి హాజరై మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, రైతు సంక్షేమానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.
NGKL: అచ్చంపేట నియోజకవర్గంలోని 137 గ్రామ పంచాయతీల సర్పంచులకు జిల్లా కేంద్రంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలన్నారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంప్ ఆమినా మస్జిద్లో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా మసీదుకు వచ్చిన ఆయన వీఐపీ ప్రోటోకాల్ లేకుండా సాధారణ భక్తులతో కలిసి ఒకే వరుసలో నిలబడి నమాజ్ చేశారు. కలెక్టర్ నిరాడంబరతను స్థానికులు అభినందించారు. భక్తి ముందు అందరూ సమానమని ఆయన సందేశం ఇచ్చారు.
WNP: ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ వాడ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం సర్పంచ్ సూచనలతో టాయిలెట్స్ నిర్మాణ పనులకు ముగ్గు పోసి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఆరోగ్యం పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకు, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా పాఠశాల వాతావరణం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
JGL: ప్రతి వాహనదారుడు ఇంట్లో నుంచి బయటికి వాహనంపై వెళ్తున్నారంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం పెగడపల్లి మండలం అయితుపల్లిలో రోడ్డు భద్రతపై ఎస్సై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేటప్పుడు, ప్రజలు రోడ్లపై నడిచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని అన్నారు.