SDPT: చేర్యాల మున్సిపల్ పాలకవర్గ పదవీ బాధ్యతల స్వీకరణలో అధికారులు ప్రోటోకాల్ విస్మరించడం చర్చనీయాంశమైంది. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఫ్లెక్సీని మార్చారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ-నామ్ 2.0 అప్డేట్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తి క్రయవిక్రయాలు జాప్యమయ్యాయి. 3 రోజులుగా పోర్టల్ పని చేయకపోవడంతో శుక్రవారం మొక్కజొన్న, కందులు, నువ్వులు, వేరుశనగలను బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. సమస్యలు త్వరలో పరిష్కరించి రెండు, మూడు రోజుల్లో సేవలు పునరుద్ధరిస్తామని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.
KMR: మద్నూర్ స్థానిక మార్కెట్లో శనివారం క్వింటా పత్తి ధర రూ.7,300 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం అమ్మకానికి పరిగె పత్తి మాత్రమే వస్తోందని, మరో ఇరవై రోజుల్లో వ్యాపారం పూర్తిగా ముగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఖరీఫ్లో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గిందని దీంతో రెండు నెలల ముందే మార్కెట్ ముగింపు దశకు చేరుకుందన్నారు.
NLG: చింతపల్లి మండలం గోడుకొండ్ల అలివేలు మంగ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఊరె లక్ష్మణ్ ఎమ్మెల్యేను సన్మానించి జాతరకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భవాని పవన్ కుమార్, గోవర్ధన్, మాస భాస్కర్, మద్దెల కృష్ణ, రాజేష్, పాల్గొన్నారు.
NZB: జిల్లాలోని 5వ డివిజన్ కార్పొరేటర్ నరేష్ శనివారం ‘బస్తీ బాట’ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లోని పలు కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ చెత్త సేకరణ వాహనం మరమ్మతుకు గురైందని, కావున ప్రజలు కొన్ని రోజుల పాటు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయవద్దని విజ్ఞప్తి చేశారు.
WGL: గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక రూట్ మ్యాప్ను విడుదల చేశారు. ప్రధాన రహదారి నుంచి ఆలయానికి చేరుకునే మార్గాలు, ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, వాహనాల పార్కింగ్ స్థలాలను ఇందులో స్పష్టంగా పొందుపరిచారు. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు అని నిర్వాహకులు తెలిపారు.
WGL: జిల్లాలో విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్ లక్ష్యాల రూపకల్పనకు ‘స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పరీక్షల సమయంలో 10వ తరగతి విద్యార్థుల్లో భయాందోళనలు తొలగించి ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
KMM: ఉమ్మడి జిల్లాలోని ఆయిల్పామ్ సాగుదారులు తెల్లదోమ ఉద్ధృతితో బెంబేలెత్తుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్న తోటలపై ఈ తెగులు పంజా విసరడంతో ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి. దీని వల్ల కిరణజన్య సంయోగ క్రియ దెబ్బతిని, గెలల సైజు తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
MBNR: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని ఎంపీ డీకే అరుణ సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా వర్సిటీ అధ్యాపకులుగా, రిజిస్ట్రార్గా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. చిలుకూరు స్వామివారి సేవలో విశేష గుర్తింపు పొందిన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
BDK: పాల్వంచ టౌన్ హర్ష టౌన్షిప్ ఏరియాలో 31వ డివిజన్ కార్పొరేటర్ శ్యామల దినేష్ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మేయర్ గణేష్ హాజరయ్యారు. మేయర్ దృష్టికి స్థానికులు పలు సమస్యలను తీసుకెళ్లారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన మేయర్ అధికార యంత్రాంగంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
SRPT: కోదాడ మండలం రెట్లకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై ఈరోజు పాఠశాలకు వెళుతున్న శ్రావణ్ కుమార్, రవిచంద్రలను ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రావణ్ కుమార్, రవిచంద్ర స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎంఈవో సలీం షరీఫ్ వైద్యశాలకు వెళ్లి ఉపాధ్యాయులు పరామర్శించారు.
NGKL: కుమ్మెర ఘటన రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఘటనపై NHRC సీరియస్ అయింది. అనేక మలుపులతో అంతుచిక్కని ఈ కేసు చివరకు ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి.
ఖమ్మంలో చెల్లని చెక్కు కేసులలో కూసుమంచికి చెందిన వెంకన్నకు ఒకటో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి బెక్కమ్ రజిని 6 నెలల జైలు ఫిర్యాదుదారుడు వెంకటేశ్వరరావుకు రూ. 8 లక్షల నగదు చెల్లించాలని తీర్పు చెప్పారు. మరో కేసులో కొత్తగూడేనికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి నాగభూషణంకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ రెండో అదనపు న్యాయమూర్తి ఏపూరి బిందు ఉత్తర్వులు జారీ చేశారు.
SRCL: క్రీడాకారులకు సమాజంలో ఉన్నతమైన గౌరవం దక్కుతుందని మానకొండూర్ మాజీ ఎ మ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని గాలిపెల్లిలో శుక్రవారం ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు ప్రారంభం అయ్యాయి. సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో పోటీలు నిర్వహించడంతో క్రీడాకారులు వెలుగు లోకి వస్తారన్నారు.
NZB :కోటగిరిలో అత్యంత కిరాతక ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు కన్నతల్లిని ప్రాణాలతో ఉండగానే తగలబెట్టి హత్య చేశాడు. స్థానికుల వివరాలు.. బ్రాహ్మణగల్లికి చెందిన మానాజీ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి తల్లి భూమవ్వపై దాడి చేసి ప్రాణాలతో ఉండగానే ఇంట్లోని పాత బట్టలు వేసి నిప్పు పెట్టి కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.