NRPT: మక్తల్ మండలం మంథన్ గోడ్ గ్రామ పంచాయతీలో గురువారం సర్పంచ్ రాజేందర్ గౌడ్ చొరవతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. స్వల్ప సమస్యలు ఉన్నవారికి వైద్యం అందించారు. అవసరమైన వారికి మహబూబ్ నగర్లో గురువారం ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి మందులు అందజేశారు. ఈ సేవలపై గ్రామస్థులు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
BDK: పాల్వంచ మండలాలలో గత 4 ఏళ్లుగా ఇసుక, మట్టి, కంకర మైనింగ్ కార్యకలాపాలు అధికంగా అక్రమంగా జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. పాల్వంచ మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను వెంటనే అరికట్టి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక, మట్టి ర్యాంపులను ప్రారంభించాలని బీజేపీ నాయకులు కలెక్టర్కు ఇవాళ ఫిర్యాదు చేశారు.
HYD: పీక్ హవర్స్లో ట్రాఫిక్ జామ్తో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్డికాపూల్ మెట్రో స్టేషన్ నుంచి RBI వరకు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి, ముఖ్యంగా స్కూల్ వ్యాన్లు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 40 నిమిషాలకుపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు.
MHBD: కొత్తగూడ మండల విద్యార్థులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం కొత్తగూడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కొత్తగూడ, గంగారం మండలాల పరిసర గ్రామాల విద్యార్థులకు సమీపంలోనే ఉన్నత విద్య అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా మండల ప్రజలు, విద్యార్థులు సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.
MLG: వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని MLG జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారులకు ఆదేశించారు. ఇవాళ ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. తాగునీటి సమస్యకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ‘ప్రజా పాలన – ప్రగతి పాలన’ 99 రోజుల కార్యాచరణపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత, MLA కోవ లక్ష్మి, MLC విఠల్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసి ప్రజలకు మేలు చేకూర్చాలని కోరారు.
SRCL: ఇల్లంతకుంట మండలంలో గురువారం ఉదయం ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లింది. వెంకటాపూర్ నుంచి జంగంరెడ్డిపల్లెకు విద్యార్థులతో వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు.
ADB: గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని MLA అనిల్ జాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన ప్రగతి పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా సర్పంచులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా తదితరులున్నారు.
KMM: సత్తుపల్లి(M) నారాయణపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రేజర్లకు చెందిన సాలి నాగేశ్వరరావు (58), పెనుబల్లి(M) పానెం సులోమన్(57) వేర్వేరు బైక్లపై సత్తుపల్లి వైపు వస్తుండగా.. బేతుపల్లి నుంచి వస్తున్న లారీ టర్నింగ్ వద్ద వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
JN: దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక ఉచిత టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువుల ఆరోగ్యం రైతులకు ఎంతో ముఖ్యమని, టీకాలు వేయించడం ద్వారా గాలికుంటు వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారి డా. సింధు ప్రియతో పాటు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
MHBD: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా కొత్తగూడ మండలంలో సందడి నెలకొంది. ఓటాయి ZPHSలో ఆవరణలో గురువారం ఉత్సాహంగా ‘క్లీన్ అండ్ గ్రీన్’ డ్రైవ్ను నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించి, చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
VKB: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలల్లో హామీ ఇచ్చిన విధంగా ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వికలాంగులకు హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. పరిగి బస్టాండ్లో రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ బృందం పంజాబీ డ్రెస్సులు వేసుకుని మహిళల వేషధారణలో నిరసన తెలిపారు. ప్రభుత్వం వాగ్దానాలను నెరవేర్చడంలో వివక్ష చూపుతోందని మండిపడ్డారు.
JGL: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురువారం ధర్మపురిలో ఆశావర్కర్లు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘ఆరోగ్య తెలంగాణ’ లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తున్నామని, అందులో భాగంగానే క్షేత్రస్థాయి కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
BHPL: మహదేవపూర్ మండల కేంద్రంలో గురువారం SI పవన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో కులం, మతం, వర్గాలపై ద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిఘా ఉంటుందని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. నేడు నిర్వహించిన కార్యక్రమానికి మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది పారిశుద్ధ్యనికి పెద్ద పీట వేయాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జ్యోతి శివరాజ్ పాల్గొన్నారు.