కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో బహుళ అష్టమి సందర్భంగా గురువారం భైరవ హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ జంటలతో హోమ కార్యక్రమం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. భక్తులు బహుళ అష్టమి రోజున భైరవ హోమం చేసినచో కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాల్గొన్నారు.
NRPT: జాతీయ రహదారిపై పాల్మాకుల వద్ద ఉదయం జరిగిన బైకు యాక్సిడెంట్లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అటుగా మక్తల్ పర్యటనకు వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి తన కాన్వాయ్ని ఆపి రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను తన సిబ్బందితో కలిసి తాను స్వయంగా పక్కకు తీశారు. సహాయక చర్యలు చేపట్టిన మంత్రి పై ప్రయాణికులు ప్రశంసల జల్లు కురిపించారు.
KMM: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్, ప్లాన్ పై సర్పంచ్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి గురువారం సింగరేణి మండల సర్పంచులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్లకు గ్రామ పంచాయతీల అభివృద్ధి పౌర హక్కులు సామాజిక న్యాయం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ అభివృద్ధి పనులకు దోహదపడుతుందని సర్పంచ్లు వెల్లడించారు.
BDK: అశ్వాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మల్లెలమడుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం మాదక ద్రవ్యాల నిర్మూలన పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ DSP బీ.రమేష్ పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాలపై యువత అవగాహన కలిగి ఉండాలని, చెడు వ్యసనాలకి బానిస కాకూడదని తెలిపారు. తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
BDK: బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రిని తహసీల్దార్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రక్త పరీక్షల కేంద్రాన్ని పరిశీలించి రికార్డులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కెంటేశ్వరావుతో చర్చించారు. రోగుల వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. అనంతరం హెచ్పీవీ వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు.
NLG: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రెండో విడతలో ఆర్టీసీ అద్దె బస్సుల పథకాన్ని అమలు చేయనుంది. త్వరలోనే నల్లగొండ రీజియన్ పరిధిలో బస్సుల పంపిణీకి మార్గదర్శకాలు రానున్నాయి. ఒక్కో జిల్లాకు 150 సంఘాలను ఎంపిక చేయనున్నారు.
WGL: నగరానికి చెందిన సీనియర్ రిపోర్టర్ కోరుకొప్పుల నరేందర్ ఫిలిం మేకింగ్ స్క్రిప్ట్ రైటర్గా సర్టిఫికెట్ అందుకున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, బాహుబలి, RRR, వారణాసి సినిమాల రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నిన్న ఆయన సర్టిఫికెట్ అందుకున్నారు. హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరగగా.. పలువురు నరేందర్కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
KMM: పారాక్వాట్ విషాన్ని నిషేధించి రైతుల ప్రాణాలను కాపాడాలని ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ అవగాహన కల్పించారు. పరాక్వాట్ తాగితే ప్రాణాలను కాపాడటం చాలా కష్టమని, ఇది ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయాన్ని నాశనం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వాకర్స్ ఉన్నారు.
నిర్మల్: ఖానాపూర్ మండలం బావాపూర్ గ్రామంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. అమూల్య (18) అనే యువతి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమెకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. అనారోగ్య సమస్యతో మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
NLG: జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. మార్చి మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ఉదయం 10 గంటలకే బయట అడుగు పెట్టాలంటే జనం జంకుతున్నారు. జిల్లాలో బుధవారం గరిష్ఠంగా గుడిపల్లిలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది.
MLG: మల్లూరు హేమాచల లక్ష్మీనృసింహాస్వామి దేవస్థానంలో పరిచారిక పోస్టు కోసం తప్పుడు కుల సమాచారం ఇచ్చి దరఖాస్తు చేసిన అర్చకులపై చర్యలు తీసుకోనున్నట్లు తహశీల్దార్ రవీందర్ తెలిపారు. బ్రాహ్మణులకు చెందిన నలుగురు శ్రీవైష్ణవులమని పేర్కొంటూ సర్టిఫికెట్ పొందినట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
HNK: ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ వెటర్నరీ హాస్పిటల్ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు మద్యం సేవించి బాటిళ్లు వదిలి వెళ్లారు. పశువుల చికిత్స కోసం నిర్మించిన ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరగడం గురువారం గ్రామస్థులను ఆవేదనకు గురిచేస్తింది. హాస్పిటల్ భద్రత కోసం తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల అధికారులను కోరుతున్నారు.
WGL: NSPT రాజకీయాల్లో ఓ భీష్ముడిగా వెలుగొందిన వ్యక్తి మద్దికాయల ఓంకార్. ఆయన తన 16ఏళ్ల వయస్సులోనే నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆంధ్ర మహాసభలో వాలెంటర్గా చేరాడు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకీ చేత పట్టి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాడు. NSPT నియోజకవర్గం నుంచి 1972-89 వరకు వరుసగా MLAగా గెలిచి చరిత్ర సృష్టించారు.
KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల పలు దశల్లో కొనసాగుతుంది. యాసంగి పంటల కోసం గురువారం 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా 28 క్యూసెక్కులు నీరు ఆవిరిగా మారుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు యాసంగికి 0.674 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
VKB: మర్పల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో పబ్లిక్ మూత్రశాలలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ వందలాది మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ బస్సుల కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమయంలో కనీస మరుగుదొడ్ల సౌకర్యం లేక మహిళలు, వృద్ధులు అసౌకర్యానికి గురవుతున్నారు.