BHNG: యాదగిరిగుట్ట పట్టణం తోపుగని చెరువు గోదావరి జలాలతో నిండి అలుగు పోస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు నిండేలా చేసి ప్రజలకు, రైతులకు నీరు అందించడం తమ లక్ష్యమని తెలిపారు.
MLG: తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన ముకుందం (35) మద్యం మత్తులో తాడ్వాయి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. భార్య కాపురానికి రావడం లేదని మద్యం మత్తులో శుక్రవారం రాత్రి రోడ్డుపై గాయాలతో ఉండడంతో స్థానికులు గుర్తించి అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
WNP: బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ 92వ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆత్మకూరులో మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీన హైదరాబాద్లోని బోరబండలో జయంతి వేడుకలు జరుగుతాయన్నారు. బహుజనులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
PDPL: కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’లో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో ఆమె పాల్గొని మద్దతు తెలిపారు. హిందూ ఐక్యతకు ఇటువంటి యాత్రలు అవసరమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్, నరేశ్ పాల్గొన్నారు.
SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రాజెక్టును ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ ఇవాళ పరిశీలించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని చందుర్తి ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తున్నారు. ఈ మేరకు రైతులతో ప్రభుత్వ విప్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తిమ్మాపూర్, రామన్నపేట, ఆశిరెడ్డిపల్లి గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గత జులై 4, 2025తో జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కూడా ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది.
HYD: మొయినాబాద్ నుంచి నార్సింగి వెళ్లే మార్గంలో ఉన్న నిర్మాణ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సుమారు 50ఏళ్ల వయస్సు ఉన్న మహిళగా స్థానికులు గుర్తించారు. మృతికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహిళ ఎవరు? ఎలా మృతి చెందింది? అనేది తెలియాల్సి ఉంది.
NLG: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సవ్యంగా నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా, జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫాన్స్, దోమలపల్లి ZPHS, మునుగోడులోని ZPHSలోని పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు.
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటగది అపరిశుభ్రంగా ఉండటం గమనించి కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చూపిన డిప్యూటీ వార్డెన్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్లను సస్పెండ్ చేయమని, ఇతర అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయమని సంబంధించిన అధికారులను ఆదేశించారు.
SRPT: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన సర్పంచుల మొదటి దశ శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండలంలోని సర్పంచులు పాల్గొని చక్కగా క్లాసులు విని ఎంతగానో నేర్చుకున్నామని పేర్కొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో కలిసి శిక్షణా సర్టిఫికెట్లు అందుకున్నారు.
KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్ఎల్ఎం (పీజీ) మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. సురేశ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు.
RR: విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మంత్రి శ్రీధర్ బాబును కలిసి కోకాపేట పీఠంలో జరిగే ఉగాది ఆస్థానానికి ఆహ్వానించారు. శారదాపీఠం సమస్యలను తక్షణమే పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. మంత్రికి అమ్మవారి ప్రసాదాన్ని అందించి, ఆశీస్సులు అందజేశారు.
BDK: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నూతన కమిటీని శనివారం ఇల్లందు మండలం ధర్మపురంలో జరిగిన మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా బొగ్గారపు వెంకన్న, ఉపాధ్యక్షులుగా మెంతిని కొండలరావు, ప్రధాన కార్యదర్శిగా ఎనగంటి చిరంజీవి, సహాయ కార్యదర్శిగా జోగ కాంతారావు, కోశాధికారిగా నరసింహారావులతో పాటు మరో ఏడుగురు సభ్యుల్ని ఎన్నుకున్నట్లు వెల్లడించారు.
PDPL: గోదావరిఖని పట్టణంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు BRS పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీశ్ రెడ్డి ఆధ్వర్యంలో తోఫా పంపిణీ చేశారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 500 మందికి రంజాన్ పర్వదినం సందర్భంగా సరుకులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
VKB: పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని జిల్లా విద్యాధికారి రేణుక దేవి సూచించారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 69 కేంద్రాల్లో 13,514 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆమె తెలిపారు.