KMR: బిచ్కుంద, మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు కళాశాల ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. బిచ్కుంద కళాశాలలో ఆంగ్లం, అర్థశాస్త్రం, మద్నూర్ కళాశాలలో తెలుగు, ఆంగ్లం, బొటని, జూవాలజీ, కెమిస్ట్రీ పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆయా సబ్జెక్టులలో పీజీలో 55% మార్కులు అర్హత కలిగి ఉండాలన్నారు.
MDK: నర్సాపూర్ నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం నర్సాపూర్లో బుధవారం ఉదయం 21. 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 84. 1%గా ఉంది. ఉదయం వేళలో చలి గాలులతో వాహనదారులు, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
HYD: రాచకొండ పోలీసులు బ్లైండ్ స్పాట్లలో డ్రైవింగ్కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సురక్షితమైన ప్రయాణం కోసం సూచనలు చేస్తున్నారు. ‘బ్లైండ్ స్పాట్లను తప్పించి, మీ వాహనం ఇతరులకు స్పష్టంగా కనిపించేలా ఉండండి’ అంటూ అవగాహన పుస్తకాలు విడుదల చేశారు. ప్రయాణంలో ప్రమాదాలు నివారించేందుకు ఈ సూచనలు కీలకమని పోలీసులు తెలిపారు.
HYD: బాలాజీ నగర్ డివిజన్ రెయిన్ బో విస్టాస్ వద్ద ఏర్పాటు చేస్తున్న మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్ బాబురావుతో కలిసి పరిశీలించారు. గత రెండు ఏళ్లుగా STP నిర్మాణ పనుల జాప్యానికి అధికారులే కారణమని.. అధికారులు సమన్వయం చేసుకొని త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
NZB: సుభాష్నగర్ బాల్ రక్ష భవనంలో మంగళవారం 3 నెలల పసికందు మృతి చెందింది. గుర్తు తెలియని ఓ మహిళ సెప్టెంబర్ 15న జిల్లా ఆస్పత్రిలో పసికందుకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువగా ఉండటంతో చెత్త బుట్టలో పడేసి వెళ్లిపోయింది. గమనించిన వైద్యులు శిశువును శిశు గృహానికి తరలించి చికిత్స అందించారు. కాగా శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది.
MNCL: మాజీ ప్రధాని వాజ్పేయి అభివృద్ధికి స్పూర్తిగా నిలిచారని బీజేపీ జిల్లా నాయకులు గోలి చందు అన్నారు. వాజ్పేయి శతజయంతి సందర్భంగా కార్మిక, హమాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జన్నారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హమాలీలు, కార్మికులతో కలిసి ఆయన వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు ఉన్నారు.
KMM: ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి నుంచి కోదాడ క్రాస్ రోడ్డు వరకు డివైడర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. హెచ్చరిక బోర్డు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలోనూ ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
KMM: జిల్లా టౌన్ 18వ డివిజన్లోని బెరకా చర్చ్లో క్రిస్మస్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఏసు శాంతి స్వరూపుడని ఆయన చూపించిన సన్మార్గంలో నడవాలని, క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం నగర మేయర్ నీరజ, 18వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ, 19వ డివిజన్ కార్పొరేటర్ చామకూరి వెంకన్న పాల్గొన్నారు.
ASF: నెన్నెల మండలంలోని చిన్న లంబడి తండా, పెద్ద లంబడి తండా, నార్వాయిపేట, చిన్న వెంకటాపూర్, కొత్తూరు గ్రామాల్లో గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసులు ఆబ్కారి శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 800 మీటర్ల బెల్లం పానకం, 4 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
KMM: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఖమ్మం గ్రానైట్ మార్కర్స్ అసోసియేషన్ నాయకులు వెంపటి ఉపేందర్, ఎస్కే జానీ, నవీన్ కుమార్, ఫణిశేఖర్ రెడ్డిలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ అసోసియేషన్ సభ్యులు ఈనెల 29న ఖమ్మం నాయుడుపేట చౌరస్తాలోని పీవీఆర్ ఫంక్షన్ హాలులో జరిగే నూతన సంవత్సర – 2025 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం అందించారు.
MNCL: జన్నారం మండలంలోని మురిమడుగు అనుబంధ కూర్మపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీటి వృధాను అరికట్టాలని ఆ గ్రామస్తులు కోరారు. ఆ గ్రామంలోని మిషన్ భగీరథ పైప్ లైన్కు పలుచోట్ల లీకేజీలు ఏర్పడి నీరు వృధాగా పోతుందని వాపోయారు. ఒకవైపు మిషన్ భగీరథ నీరు రావడం కష్టంగా ఉందని, ఈ సమయంలో ఉన్న నీటిని వృధా చేయడం సరికాదన్నారు. ఆ పైప్ లైన్లకు మరమ్మతులు చేయించాలని వారు కోరారు.
BDK: మణుగూరు మున్సిపాలిటీ శివలింగాపురం పరిశుద్ధ లూకా దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. క్రైస్తవులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ అని, ఏసుక్రీస్తు జన్మించిన శుభ దినాన అందరికీ మంచి జరగాలని తెలిపారు.
వరంగల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం వర్ధన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో చోటు చేసుకుంది. మండల కేంద్రం చెందిన ఆవుల సతీష్ తన ద్విచక్ర వాహనంపై అంబేద్కర్ సర్కిల్లో యూటర్న్ తీసుకుంటుండగా వెస్ట్ గోదావరి కొబ్బరి బొండాల లోడుతో వరంగల్ వైపు వెళ్తున్న టాటాఏసీ వాహనం ఢీ కొట్టింది. సతీష్కు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.
SRD: పటాన్ నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం పటాన్ చెరులో బుధవారం ఉదయం 20.5 డిగ్రీలు, గుమ్మడిదలలో 19.4 డిగ్రీలు, జిన్నారంలో 19.9 డిగ్రీలు, అమీన్ పూర్లో 19.2 డిగ్రీలు, రామచంద్రాపురంలో 21.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 83%గా ఉంది. చలితో ఆస్తమా వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
KMM: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బుధవారం వేంసూరు మండలంలోని పలు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. క్రైస్తవులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ అని, ఏసుక్రీస్తు జన్మించిన శుభ దినాన అందరికి శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు.