సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వెళ్తే నట్టేటా మునిగినట్టేనని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరిస్తున్నారు. అధిక డబ్బుకు ఆశపడి వెళ్తే ఉన్న డబ్బు పోతుందని జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు. అవి మోసపూరిత సంస్థలని స్పష్టం చేశారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాటున క్యూనెట్ సంస్థ గొలుసుకట్టు పద్ధతిలో రూ.వేల కోట్లను అమాయకుల నుంచి వసూలు చేసిందని సజ్జనర్ గుర్తు చేశారు. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా క్యూనెట్ సంస్థకు చెందిన 36 బ్యాంక్ ఖాతాల్లోని రూ.90 కోట్ల నగదును సీజ్ చేసిందని తెలిపారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలన్నీ క్యూనెట్ మోసపూరితమైన సంస్థలేనని వెల్లడించినట్లు చెప్పారు. ఎంఎల్ఎం కంపెనీల మోసాలు ఏదో ఒక రోజు బయటపడతాయని, వాటిపై రాష్ట్ర పోలీసులే కాక.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేస్తాయని సజ్జనర్ తెలిపారు. అలాంటి మోసపూరిత స్కీమ్ లతో ప్రమేయమున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు.
ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా సజ్జనర్ రెండు పోస్టులు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన చేసిన కొన్ని సూచనలు ఇవే…
రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రణలో లేని సంస్థలను అసలు నమ్మొద్దు.
గొలుసుకట్టు సంస్థలకు ఎలాంటి అనుమతులుండవు.
బ్యాంకర్ల కంటే ఎక్కువగా వడ్డీ ఇవ్వడం ఏ సంస్థకు సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలి.
పెట్టుబడి పెట్టాలంటే ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీంతోపాటు నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలి.
మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలపై ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులను ఆశ్రయించాలి.
సైబరాబాద్ సీపీగా సజ్జనర్ ఉన్న కాలంలో క్యూనెట్ మోసాలను తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దేశవ్యాపంగా దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు, క్యూనెట్ సంస్థను ప్రమోట్ చేసిన ప్రముఖులు అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, జాకీ ష్రాప్, పూజహెగ్డే, షారుఖ్ ఖాన్ లకు 2019లో నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తంగా 500 మందికి సైబరాబాద్ పోలీసులు అప్పట్లో నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా క్యూనెట్ సంస్థ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంతో సజ్జనర్ స్పందించారు. క్యూనెట్ లాంటి మోసపూరిత గొలుసుకట్టు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అనేకం ఉన్నాయని, వాటి మాయలో పడొద్దని సూచించారు. ఎంఎల్ఎం కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ)ని లాభదాయక సంస్థగా మార్చే ప్రయత్నంలో సజ్జనార్ బిజీబిజీగా ఉన్నారు.