KMR: భిక్కనూర్లోని సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 7 నుంచి 11 వరకు జరగనున్నాయి. భువనేశ్వరీ సహిత స్వామి వారికి పుణ్యహవాచనం, అంకురార్పణం, రుద్రాభిషేకం, కల్యాణోత్సవం, విమాన రథోత్సవం, అవభృథ స్నానం నిర్వహించనున్నారు. అగ్నిగుండాలు, వీరభద్ర ప్రస్తావన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
MDK: B V Raju Institute of Technology, నర్సాపూర్లో “మెకానికల్ బాజా SAE ఇండియా 2026” మూడో రోజు స్టాటిక్, డైనమిక్ ఈవెంట్స్ ఉత్సాహంగా సాగాయి. 42 వాహనాలు టెక్నికల్ ఇన్స్పెక్షన్ పూర్తి చేయగా, 35 బగ్గీలు బ్రేక్ టెస్ట్ ఉత్తీర్ణులై ఫైనల్ ఎండ్యూరెన్స్కు అర్హత సాధించాయి. అనుభవాధారిత విద్యపై ప్యానల్ చర్చ జరిగింది. ఆదివారం నుంచి ఫైనల్ రేస్ జరగనుంది.
నెల్లూరు జిల్లాలో ఈ ఆదివారం చికెన్, మటన్ ధరలు ముందు వారంతో పోలిస్తే కాస్త పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్తో కూడిన చికెన్ రూ. 270, స్కిన్లెస్ చికెన్ రూ. 300, నాటుకోడి మాంసం కేజీ రూ. 700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వారు పేర్కొన్నారు.
ATP: CM చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కల్యాణదుర్గం పోలీసులు నోటీసులు ఇచ్చారు. కల్యాణదుర్గంలో నమోదైన ఈ కేసు విషయమై గుంటూరు సిద్ధార్థనగర్లోని అంబటి కార్యాలయానికి కానిస్టేబుల్ వచ్చి నోటీసులు అందజేశారు. విచారణకు సహకరించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
సత్యసాయి: జిల్లాలో ఉపాధి హామీ పని దినాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నుంచి ప్రతిరోజూ లక్ష పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఏడాది 19,508 కుటుంబాలు వంద రోజుల పని పూర్తి చేసుకోగా, ఈసారి ఆ సంఖ్యను పెంచాలని అన్నారు.
E.G: నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాయంత్రం జగన్నాథరావు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశమై మండల అభివృద్ధి పనులపై సమీక్షించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
కోనసీమ: రాజోలు మండలం పొన్నమండలోని బాణసంచా తయారీ కేంద్రాల్లో శనివారం సాయంత్రం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్ భాస్కర్ నేతృత్వంలో పోలీస్, ఫైర్ సిబ్బంది నిబంధనల అమలును పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలు పాటించాలని పలు సూచనలు చేశారు.
JN: జిల్లా కేంద్రానికి నేడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ను ఆయన ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. భరోసా సెంటర్ ద్వారా బాధితులకు న్యాయ, మానసిక, వైద్య సహాయ సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
MBNR: రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ నిర్మించాలని కోరుతూ రాయపల్లి సర్పంచ్ గాయత్రి మల్లేశ్ గౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ ఎంపీ డీకే అరుణను కలిసి వినతిపత్రం అందజేశారు. బ్రిడ్జి నిర్మాణంతో స్థానికులకు ఇబ్బందులు కలగకుండా అండర్ పాస్ అవసరమని వివరించారు. అలాగే రాయపల్లి గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేయాలని వారు కోరారు.
విజయనగరం: కొత్తవలస కూడలికి అనుకోని ఉన్న ఎస్సీ కార్పొరేషన్కు చెందిన కాంప్లెక్స్ మరమ్మతులకు గురవ్వడంతో ఆ శాఖకు చెందిన అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొత్తం తొమ్మిది షాపులు ఉండగా, మూడు షాపులు శిథిలాస్థితికి చేరుకోవడంతో మరమ్మతులు కోసం రూ 7.15 లక్షల నిధులతో మొత్తం షాపులు అందుబాటులోకి తీసుకువస్తామని సీనియర్ అసిస్టెంట్ ఎస్.సత్యనారాయణ చెప్పారు.
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం రైతు వేదికలో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్పై మండల స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. యూరియా విక్రయాలు పూర్తిగా బుకింగ్ యాప్ ద్వారానే జరగాలని, యూరియా వచ్చిన రోజు ఉదయం 9, మధ్యాహ్నం 12 లేదా సాయంత్రం 4 గంటలకు మాత్రమే ఆన్ లైన్లో బుకింగ్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కొత్త విధానం రైతుల సౌకర్యం కోసమే అమలు చేస్తున్నారు.
HYD: GHMC పరిధిలో ACB దాడుల పరంపర కేవలం అధికారుల అవినీతిని బయటపెట్టడమే కాదు. వ్యవస్థలో పాతుకుపోయిన ‘పర్సంటేజ్’ల దందాను ఎండగడుతోంది. చట్టపరంగా చూస్తే 64 శాతం శిక్షా రేటు అనేది న్యాయస్థానాలు అవినీతిపై చూపిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. రాజకీయంగా కూడా ప్రభుత్వం 115 ప్రాసిక్యూషన్ శాంక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
KMR: జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో ఆదివారం చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించాయి. గత వారంతో పోలిస్తే ధరలు భారీగా పెరిగి ‘ట్రిపుల్ సెంచరీ’ని దాటాయి. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300 పలుకుతుండగా, లైవ్ కోడి రూ.190గా ఉంది. పెరుగుతున్న ధరలతో చికెన్ ప్రియులు బెంబేలెత్తుతున్నారు.
BHNG: మోత్కూర్ ఆరో వార్డు ఆరెగూడెంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనసే పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వార్డులో దోమల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో పారిశుధ్య పనులు చేయించారు.
AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 75,428 మంది దర్శించుకోగా 36,240 మంది భక్తులు తలనీలాలర్పించారు. హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు వచ్చింది.