SKLM: కంటి వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహించాలని ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రి విజన్ సెంటర్ కో ఆర్డినేటర్ ముద్దాడ అప్పలనాయుడు తెలిపారు. హిరమండలం పంచాయతీ సుభలయ గ్రామంలో కంటి పరీక్ష కేంద్రంలో మంగళవారం విజన్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యలు గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
RR: ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ పాఠశాలను నడిపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిపాల్ అన్నారు. చేవెళ్ల నగర కేంద్రంలో హోలీ పండుగ సందర్భంగా ఇవాళ అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే ఓ స్కూలు మాత్రం పాఠశాలను నడిపిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలను బంద్ చేయించి, విద్యార్థులను ఒత్తిడికి గురి చేసే పాఠశాలపై చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రకాశం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి AP టీచర్స్ ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల తెలిపారు. మంగళవారం మార్కాపురంలోని టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతన పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30% ఐఆర్ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాయబ్ రసూల్ పాల్గొన్నారు.
VKB: పులుమద్ది గ్రామంలో హోలీ వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గ్రామస్థులందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ బోయిని శ్వేత శివయ్య, ఉప సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ టి.మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు.
RR: సినీనటుడు శివాజీరాజా తండ్రి జి.రామరాజు(85) మంగళవారం అనారోగ్య సమస్యతో మధురానగర్లోని నివాసంలో కన్నుమూశారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. శివాజీరాజా తండ్రి మరణవార్త తెలుసుకొని చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
BDK: ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమ భూములను అటవీశాఖ అధికారులు అన్యాయంగా లాక్కుంటున్నారని ఆదివాసీ గిరిజనులు ఆరోపించారు. పట్టాలు ఉన్న భూములను స్వాధీనం చేసుకుని, కేవలం రెండెకరాలు మాత్రమే ఇస్తామనడం సరికాదని ధ్వజమెత్తారు. తమ భూమి తమకు కావాలని కోరినందుకు అధికారులు దాడులకు తెగబడ్డారని బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
TPT: దేశవ్యాప్తంగా ఉన్న 7 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో వివిధ Ph.D / MS కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి IISER కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
NZB: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు అందించారు.
CTR: మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్లో ఉచిత మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ క్యాంపులో 150 మంది మహిళలకు డయాబెటిస్, డెంటల్, ఆర్థో, గైనకాలజీ పరీక్షలు చేశారు. అపోలో హాస్పిటల్స్ వైద్యులు ఈ సేవలు అందించారు.
ATP: అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ శిశువు మృతి చెందిందంటూ కొట్టాల కాలనీకి చెందిన దామోదర్, లక్ష్మీదేవి దంపతులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఐదు రోజులుగా అంతా బాగుందని చెప్పి, సోమవారం అర్ధరాత్రి ఆపరేషన్ చేసి బిడ్డ చనిపోయిందని చెప్పడంపై వారు మండిపడ్డారు. తన భార్య గర్భసంచి కూడా తీసివేశారని దామోదర్ వాపోయారు.
WNP: జనసేన పట్టణ, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈనెల 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, కార్యకర్తలకు భరోసా కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని పార్లమెంట్ కోఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. జనసైనికులందరూ వాలంటీర్ల ద్వారా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని ఆయన సూచించారు.
VZM: మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఎస్సై సన్యాసినాయుడు అన్నారు. మహిళ దినోత్సవ వారోత్సవాల సందర్బంగా డెంకాడలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మ విశ్వాసమే మహిళ శక్తికి ప్రధాన ఆయుధమన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అందరూ శక్తి యాప్ను తమ ఫోన్లో ఉంచుకోవాలని, ఆపదలో యాప్ రక్షణగా నిలుస్తుందన్నారు.
HYD: మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని మూసీ తీరాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై NHRCను ఆశ్రయించారు. మూసీ నది పరిధిలోని లంగర్ హౌస్, నర్సింగి, రాందేవూడ ప్రాంతాల్లో వేలాది చెట్లు అధ్యయనం లేకుండానే నరికివేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభావిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, చెట్ల నరికివేతను తక్షణమే నిలిపివేయాలని కోరారు.
TG: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మంత్రి వివేక్పై దాడి కేసులో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్కు నిన్న బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. అయితే రేపు బాల్క సుమన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ జైలులో ఉన్నారు.