TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్కు మళ్లీ పిండాలు పెట్టే సమయం వచ్చిందని మాజీ MLA రాజయ్య అన్నారు. పంటలు ఎండిపోతుంటే రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. హరీష్ రావు దేవన్నపేట పంప్హౌస్ను పరిశీలిస్తే.. వెంటనే రేవంత్ దేవాదుల సందర్శనకు వచ్చేశారని ఎద్దేవా చేశారు. సీఎం, మంత్రులు, MLAల మధ్య పొంతనలేదన్నారు.
NZB: విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అదేవిధంగా సౌమ్య తమ్ముడు గాజుల శ్రవణ్కు ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా సోమవారం అందించారు.
E.G: రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించి అస్వస్థతకు గురైన బాధితులను ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు PVN మాధవ్ సోమవారం పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు తక్షణమే అప్రమత్తమై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ హెచ్ఐటీఎక్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈఎన్టీ సర్జన్ డాక్టర్ లవణం కళ్యాణ్ వరప్రసాద్ అవార్డు అందుకున్నారు. యాక్ట్ నౌ వాలంటరీ ఆర్గనైజేషన్ ఛైర్మన్ డాక్టర్ కే.ఎస్ మూర్తి చేతుల మీదుగా డాక్టర్ ఒటో- లారిన్జాలజీ హెల్త్కేర్లో ఉత్తమమైన సేవలను అందించినందుకుగాను ఆయనకు ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు లభించింది.
NRPT: మరికల్ మండల కేంద్రం మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు పెంట మీద నారాయణ కుటుంబాన్ని సోమవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరమర్శించారు. నారాయణ మృతి కాంగ్రెస్ పార్టీకి, మత్స్య సహకార సంఘానికి తీరని లోటు అన్నారు. నారాయణ సేవలను కొనియాడారు. సర్పంచ్ చెన్నయ్య, పాలమూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్, సూర్య మోహన్ రెడ్డి ఉన్నారు.
MDK: అల్లాదుర్గం మండలంలోని గొల్లకుంటతండా గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా మారింది. రోడ్డుకు ఆనుకొని క్రీడా ప్రాంగణం అనే పేరు గల బోర్డును తగిలించారు. ఓ వ్యవసాయ చేనులో ఏర్పాటు చేయడంతో ఆ రైతు చేను దున్నుకోవడం వల్ల యువకులు క్రీడలకు దూరమవుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాన్ని వినియోగంలోకి తీసుకురావలన్నారు.
కడప జిల్లా వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో నూతన మఠాధిపతి వీరధర్మజ వేంకటాద్రి స్వామి కఠిన నిర్ణయాలు ప్రకటించారు. సమయపాలన, క్రమశిక్షణ పాటించాలని సిబ్బందికి ఆదేశించి, నిర్లక్ష్యంపై హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్ మేనేజర్గా పిపిఎన్ ప్రసాద్ను ప్రకటించారు. ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే పట్టాభిషేక మహోత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
HYD: కొంపల్లి సర్కిల్-56లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పారిశుధ్య తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ చెత్త సేకరణ ప్రత్యామ్నాయ రోజుల్లో జరుగుతున్నట్లు గుర్తించి, ఇకపై ప్రతిరోజూ డోర్ టు డోర్ కలెక్షన్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఏటీ వాహనాలకు చెత్త ఇవ్వని గృహాలను గుర్తించి అవగాహన కల్పించడంతో పాటు పునరావృతమైతే జరిమానా విధించాలన్నారు.
తిరుపతి జిల్లాలో ఇంటర్ మొదటి సం. పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన పరీక్షకు 797మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. మొత్తం 31014 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 30217 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.
PPM: గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీపీ కె. దీనమయ్య ‘సమ్మర్ క్రాష్ ప్రోగ్రాం’ జీపును జెండా ఊపి ప్రారంభించారు. వేసవి కాలంలో చేతి పంపుల మరమ్మతులు, నిర్వహణ కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కొరత లేకుండా చూడడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో MPDO శ్రీనివాసరావు, RWS జేఈ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. KGBVలో చదువుతున్న విద్యార్థుల సర్టిఫికెట్ల సమస్యలను ప్రస్తావించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి సర్టిఫికెట్లు సమయానికి జారీ కావడం అత్యంత అవసరమని అన్నారు. కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల సమస్యలను కూడా సభ దృష్టికి ఎమ్మెల్యే తీసుకువచ్చారు.
KNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం చొప్పదండిలో బీజేపీ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ తోపులాట జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని నినాదాలు చేశారు.
MBNR: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో అనిల్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా: నేపాల్ రంగసాల ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి చెందిన పవర్ లిఫ్టర్ దుర్గా సత్యనారాయణ 66 కేజీల విభాగంలో 610 కేజీల బరువు ఎత్తి అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించాడు. ఈ క్రమంలో ఆయనను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఇవాళ అభినందించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
W.G: అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని యనమదురు డ్రైన్ ముంపు సమస్యను ఆయన ప్రస్తావించారు. వర్షాకాలం నేపథ్యంలో అధికంగా వరదలు రావడం వల్ల సమీపంలోని పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. దీనికోసం కూటమి ప్రభుత్వం నిధులు సమకూర్చడం జరిగిందన్నారు.