WGL: నర్సంపేట డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఛైర్మన్ పిండం లక్ష్మీ రామానంద్ పాల్గొన్నారు. అనంతరం ఆమె క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ… గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
KMR: బిక్కనూర్ శివారులో హైవేపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కారు డివైడర్ పైకి ఎక్కింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు. జీఎంఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.
వనపర్తి మండలం పెద్దగూడెంలో నేటి నుంచి 28 వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని అర్చకుడు రామన్ స్వామి తెలిపారు. 25న సీతారాముల కళ్యాణం, 27న రథోత్సవం, 28న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
NLG: హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్తున్న సాయి అనే యువకుడు కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది వీరమణి, నాగాచారి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గోట్లూరులో ఈనెల 27న పరుగు పందెం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం, సత్యసాయి జిల్లాల క్రీడాకారులు ఇందులో పాల్గొనవచ్చు. 2 కిలోమీటర్ల ఈ పోటీలో విజేతలకు రూ. 5016వేల నుంచి రూ.1016 వేల వరకు నగదు బహుమతులు అందజేస్తారు. ఆసక్తి గల వారు ముందే పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
AP: రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సరఫరా సమస్యపై సీఎం చంద్రబాబు ఇవాళ RTGS ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా గ్యాస్ కొరతను అధిగమించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రత్యామ్నాయంగా, అవసరమైన చోట తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించనున్నారు.
నడుము నొప్పితో బాధపడుతూ KKR ప్లేయర్ ఆకాశ్ దీప్ IPL 2026 సీజన్కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో KKR అతని స్థానంలో విదర్భ పేసర్ సౌరభ్ దూబేని తీసుకుంది. గతంలో అతణ్ని సన్రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నా.. డగౌట్కే పరిమితమయ్యాడు. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అద్భుతమైన డెబ్యూ చేయాలని దూబే భావిస్తున్నాడు.
TG: సిద్దిపేటలోని నర్మెట్టలో నిన్న సీఎం రేవంత్ ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అయితే నిన్న బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. తొలి విడతలో భాగంగా రూ.3,590 కోట్లు విడుదల అయ్యాయి. కాగా ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది.
AKP: ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు డొక్కా సీతమ్మ భోజన పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు అన్నారు. ఆదివారం అనకాపల్లి విదసం కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2013 ఆహార భద్రతలో భాగంగా అమలు చేస్తున్న భోజన పథకాన్ని అపహాస్యం చేశారన్నారు.
AP: విశాఖలో ఇవాళ కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ప్లాంట్ను సందర్శించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో.. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
CTR: వెదురుకుప్పం మండలం పాత గుంట గ్రామంలో జోరుగా సాగిన జల్లికట్టులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జల్లికట్టు ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన కోడెద్దులు పగలంతా కాసిన ఎండకు అలసిపోయాయి. ముగింపు సమయంలో గంతులేసుకుంటూ సమీపంలోని మారేపల్లి చెరువులో తాగునీటికి వెళ్లి మూడు ఎద్దులు దుర్మరణం చెందాయి. ఈ ఘటన యజమానులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన కోసం తితిదే జేఈవో వల్లూరు వీరబ్రహ్మం సోమవారం ఇక్కడికి రానున్నారు. రామయ్య క్షేత్రం, మాడ వీధులు, కాలిబాటలు, విశ్రాంతి భవనం, కల్యాణ వేదిక ప్రాంగణంలో జరుగుతున్న పనులను ఆయా విభాగాల అధికారులతో కలిసి పరిశీలించి అనంతరం సమీక్ష నిర్వహించనున్నారు.
BDK: భద్రగిరి మార్టులో లభించే ప్రతి నిత్యవసర సరుకుల ధరలు, ఆ వస్తువుల గుణగణాలు పూర్తిస్థాయిలో వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించడం మంచిదని ఎమ్మెల్యే తెల్లం అన్నారు. భద్రాచలంలో నూతనంగా డిజైన్ చేసి నిర్మాణం పూర్తయి శ్రీరామనవమికి ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్ను నిన్న రాత్రి ఐటీడీఏ పీవో రాహుల్తో కలిసి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పరిశీలించారు.
NGKL: జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పీసీసీఎఫ్ సువర్ణ పర్యటనలో భాగంగా ఫరాహాబాద్ వ్యూ పాయింట్ వద్ద పులి దర్శనమివ్వగా, మరొకటి గుండం వద్ద సేదతీరుతూ కనిపించింది. తాజా గణాంకాల ప్రకారం ఇక్కడ పులుల సంఖ్య 40 దాటినట్లు తెలుస్తోంది. మెరుగైన సంరక్షణ చర్యల వల్ల పులులకు ఈ అడవి సురక్షిత నిలయంగా మారింది.
MDK: టేక్మాల్ మండలం తంప్లూర్ గ్రామంలోని గ్రామ దేవతలకు ఆదివారం రాత్రి గ్రామ ప్రజలు ఘనంగా బోనాల కార్యక్రమం నిర్వహించారు. 5 రోజులు సాగే గ్రామ దేవత జాతర ఉత్సవాలకు మొదటి రోజు గ్రామస్థుల సమక్షంలో బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామ దేవత దుర్గమ్మ, పోచమ్మలకు బోనాల నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.