AKP: ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు డొక్కా సీతమ్మ భోజన పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు అన్నారు. ఆదివారం అనకాపల్లి విదసం కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2013 ఆహార భద్రతలో భాగంగా అమలు చేస్తున్న భోజన పథకాన్ని అపహాస్యం చేశారన్నారు.
AP: విశాఖలో ఇవాళ కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ప్లాంట్ను సందర్శించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో.. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
CTR: వెదురుకుప్పం మండలం పాత గుంట గ్రామంలో జోరుగా సాగిన జల్లికట్టులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జల్లికట్టు ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన కోడెద్దులు పగలంతా కాసిన ఎండకు అలసిపోయాయి. ముగింపు సమయంలో గంతులేసుకుంటూ సమీపంలోని మారేపల్లి చెరువులో తాగునీటికి వెళ్లి మూడు ఎద్దులు దుర్మరణం చెందాయి. ఈ ఘటన యజమానులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన కోసం తితిదే జేఈవో వల్లూరు వీరబ్రహ్మం సోమవారం ఇక్కడికి రానున్నారు. రామయ్య క్షేత్రం, మాడ వీధులు, కాలిబాటలు, విశ్రాంతి భవనం, కల్యాణ వేదిక ప్రాంగణంలో జరుగుతున్న పనులను ఆయా విభాగాల అధికారులతో కలిసి పరిశీలించి అనంతరం సమీక్ష నిర్వహించనున్నారు.
BDK: భద్రగిరి మార్టులో లభించే ప్రతి నిత్యవసర సరుకుల ధరలు, ఆ వస్తువుల గుణగణాలు పూర్తిస్థాయిలో వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించడం మంచిదని ఎమ్మెల్యే తెల్లం అన్నారు. భద్రాచలంలో నూతనంగా డిజైన్ చేసి నిర్మాణం పూర్తయి శ్రీరామనవమికి ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్ను నిన్న రాత్రి ఐటీడీఏ పీవో రాహుల్తో కలిసి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పరిశీలించారు.
NGKL: జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పీసీసీఎఫ్ సువర్ణ పర్యటనలో భాగంగా ఫరాహాబాద్ వ్యూ పాయింట్ వద్ద పులి దర్శనమివ్వగా, మరొకటి గుండం వద్ద సేదతీరుతూ కనిపించింది. తాజా గణాంకాల ప్రకారం ఇక్కడ పులుల సంఖ్య 40 దాటినట్లు తెలుస్తోంది. మెరుగైన సంరక్షణ చర్యల వల్ల పులులకు ఈ అడవి సురక్షిత నిలయంగా మారింది.
MDK: టేక్మాల్ మండలం తంప్లూర్ గ్రామంలోని గ్రామ దేవతలకు ఆదివారం రాత్రి గ్రామ ప్రజలు ఘనంగా బోనాల కార్యక్రమం నిర్వహించారు. 5 రోజులు సాగే గ్రామ దేవత జాతర ఉత్సవాలకు మొదటి రోజు గ్రామస్థుల సమక్షంలో బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామ దేవత దుర్గమ్మ, పోచమ్మలకు బోనాల నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
HYD: అత్తాపూర్ పరిధిలోని చింతల్మెట్లలో గంజాయి మత్తులో గ్యాంగ్ హింసకు దిగింది. ఓ యువకుడిపై కత్తితో దాడి చేయగా, అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మందలించిన స్థానికులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించి, ఓ ఇంటి తలుపునకు నిప్పంటించారు. పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
WG: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మన అందరి బాధ్యత, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పెనుగొండ ఎస్సై గంగాధరరావు ప్రయాణికులను హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు చలాన్లు విధించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అది ప్రమాదంలో రక్షిస్తుందని అన్నారు.
AKP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2.55 గంటలకు నక్కపల్లి మండలం చందనాడ చేరుకుంటారు. 5:30 గంటలకు సీఎం చంద్రబాబుతో కలిసి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ వెళతారు.
PDPL: పెద్దపల్లి కార్మిక అధికారిణి హేమలత తీరుపై భవన నిర్మాణ కార్మికులు ఆదివారం మంత్రి వివేక్ వెంకట స్వామికి ఫిర్యాదు చేశారు. కార్మికులకు న్యాయం చేయాల్సిన అధికారిణి వారిని వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చెన్నూర్లో కార్మిక, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి దళిత బహుజన లేబర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు.
KMM: జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిన్న ప్రముఖ సాహితీవేత్త నామ రామారావు రచించిన నామా పద్యాలు- నిత్య సత్యాలు సాహితీ సంకలనాన్ని ఎమ్మెల్సీ తాతా మధు ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త, ఫేమా కన్వీనర్, జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ పుస్తకావిష్కరణ ఘనంగా నిర్వహించారు.
SRCL: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో వేములవాడ పట్టణంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులను బీజేపీ నాయకులు ఖండించారు.
ATP: జిల్లా పట్టుపరిశ్రమ ఉద్యోగుల పరపతి సంఘం ఎన్నికలు ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడు డైరెక్టర్ల స్థానాలకు 237 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 6న నామినేషన్ల స్వీకరణ, 7న పరిశీలన, 8న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు.
MHBD: ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి జాటోత్ లచ్చ నాయక్ ఇటీవల మృతి చెందగా, రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం హుస్సేన్ నాయక్ను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు.