Narendra Modi: ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. మహారాజులు, రాజులను అవమానించిన ఆయన బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబుులు, నిజాంలు, సుల్తాన్ల అరాచకాలపై మౌనంగా ఉన్నారన్నారు. ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్ రాయించిందన్నారు. కాంగ్రెస్ ఇప్పటికీ ఆ పాపాలను కొనసాగిస్తుందని మోదీ అన్నారు. పేదలు భూములను రాజులు, మహారాజులు ఆక్రమించారని రాహుల్ ఆరోపించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, కిత్తూరు రాణి చన్నమ్మా వంటి మహానుభావులను రాహుల్ అవమానించారు.
దేశ చరిత్రలో నవాబులు, నిజాంలు, సుల్తాన్లు, బాద్షాలు చేసిన దౌర్జన్యాలపై మాత్రం ఆయన నోరు మెదపలేదని మోదీ విమర్శించారు. మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు అణచివేతల గురించి రాహుల్ మరచిపోయారని మోదీ అన్నారు. అలాగే ఎన్నో దేవాలయాలను కలుషితం చేసి ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తిని ప్రశంసించే వారితో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడం విచారకరమన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన దాడులు సిగ్గుచేటన్నారు. ఇవి కర్ణాటక కీర్తిని దిగజారుస్తున్నాయని అన్నారు.