KNR: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈరోజు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలకు చెందిన మొత్తం 98 మంది లబ్ధిదారులకు రూ.36,00,500 విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ADB: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని గిరిజన గురుకులాల ఆర్సీవో అగస్టీన్ సూచించారు. ఉట్నూర్ మండలంలోని లాల్ టెక్డిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలను పరిశీలించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.
WNP: 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థినీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద ఉచిత ప్రవేశం కల్పించి ఉచిత విద్యను అందించేందుకు స్కాలర్షిప్ అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తి జిల్లాలో 1 నుంచి 10వ తరగతి చదివి విద్యార్థులు అర్హులు అన్నారు. మార్చి 25 లోగా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.
మహబూబ్ నగర్: జడ్చర్ల మండలం పోలేపల్లి ZPHS గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన గొప్ప క్రీడాకారుడు అమృత లింగం చిన్న వయసులో మరణించారు. వారి స్మారకార్థంతో ఏర్పాటు చేసిన వాలీ బాల్ టోర్నమెంట్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే. అరుణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. యువకులు అధిక సంఖ్యలో పాల్గొని క్రీడలో రాణించాలన్నారు.
VKB: మార్చి 2న జిల్లాకు విచ్చేయనున్న వీఐపీల పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహ మెహ్రా పోలీస్ అధికారులను ఆదేశించారు. అనంతగిరిలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులకు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
KMM: మధిర మండలం నాగవరప్పాడు ఎంపీపీఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం శనివారం జరిపారు. సి.వి.రామన్, రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ఈ వేడుకలు జరిపారు. ప్రధానోపాధ్యాయులు పురం సంగారావు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు సీహెచ్వి రవికుమార్, లింగయ్య, వీవీఎన్ రాజు పాల్గొన్నారు.
NLG: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ శైలజ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడం, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో స్పోర్ట్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. వారికి తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.
MLG: రాష్ట్ర విద్యా కమిషన్ నివేదికపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (TPUS) జిల్లా అధ్యక్షురాలు వాంకుడోతు జ్యోతి డిమాండ్ చేశారు. ఇవాళ MLG జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని కమిషన్ పేర్కొనడం ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆమె విమర్శించారు.
MDK: మాసాయిపేట మండలం రామంతపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా చిత్తుబొత్తు ఆటపై పోలీసులు దాడి చేసి కేసులు నమోదు చేశారు. చిత్తు బొత్తు ఆట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 24,570 లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో నలుగురు వ్యక్తులు పారిపోయారని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
JN: జిల్లా చిల్పూరు గుట్ట శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణ మండపం వద్ద ఒక యువతిని వెంకటేశ్వర స్వామి వేషధారణలో అలంకరించి ఉంచడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ క్షణం కలియుగ దైవం వేయి నామాల వెంకటేశ్వరుడే కళ్లముందు కదలాడినట్లు అనిపించిందని భక్తులు చెప్పారు.
ADB: సాత్నాలలోని సాంగ్వి గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావును సర్పంచ్ ఆత్రంనగేష్ కోరారు. ఈ విషయమై శనివారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్డు, డ్రైనేజ్, పొలం బాట, పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
HNK: కేయూ ఇంజినీరింగ్ కాలేజీ (కో ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో VBYP 2026 హనుమకొండ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్.రమణ తెలిపారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై ఈ పోటీలు మార్చి 2న కేయూలో నిర్వహిస్తామన్నారు. 2025 సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉండాలన్నారు.
MDK: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో శనివారం రెండు దూడలపై చిరుత పులి దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్, బావని ఐలయ్య పొలాల వద్ద ఉన్న రెండు దూడలపై దాడి చేసి చంపినట్లు వివరించారు. అటవీ శాఖ సహాయ రేంజ్ అధికారి చంద్రశేఖర్కు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
KNR: హుజూరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ భూస్థాపితమవడం ఖాయమని కాంగ్రెస్ నేత ప్రణవ్ స్పష్టంచేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం దేవతల సాక్షిగా చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీపీని దూషించడం ఆయన మతిభ్రమణానికి నిదర్శనమని, ఆయన మీద ఉన్న కేసులపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
SRPT: హుజూర్ నగర్లో విలియమ్స్ హోవే జయంతి సందర్భంగా టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. జిల్లా టైలర్స్ యూనియన్ నాయకులు షేక్ బాజీ ఉల్లా టైలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. టైలర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆధునిక యంత్రాలు, శిక్షణ, రుణ సౌకర్యాలు కల్పించాలని కోరారు. మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ జెండా ఆవిష్కరించారు.