ఆసిఫాబాద్ మండలం కొఠారి గ్రామ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న ట్రాక్టరు ఢీకొన్నాయన్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. పలువురికి గాయాలు కాగా ఆసుపత్రి తరలించమన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRPT: నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ గౌరవ్ కటియార్ మంగళవారం నర్వ మండలంలోని పెద్ద కడుమూరు, రాయికోడ్, పాతర్ చేడ్ గ్రామాల్లో పర్యటించారు. ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
SRD: ఖేడ్ పట్టణంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ప్రీమియర్ లీగ్ సీజన్ క్రికెట్ టోర్నీలో రేగొడ్ జట్టు విజయం సాధించింది. AIBESS నేతృత్వంలో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్లో రేగోడ్ ఆధ్యా, ఖేడ్ ర్యామ్ స్పోర్ట్స్ తలపడ్డాయి. రేగోడ్ జట్టు టోర్నీ కప్ సాధించింది. ఈ మేరకు పటాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
KNR: తెలంగాణ జర్నలిస్టు ఫెడరేషన్ డైరీని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. జర్నలిస్టుల డైరీ తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
WNP: ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్ నుంచి మంత్రి మాట్లాడుతూ.. ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సహనంతో విని పరిష్కరించాలన్నారు.
NZB: భీమ్గల్లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి తెలిపారు. మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:05 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
NLG: బాలికల రక్షణ, అభివృద్ధి, విద్య ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని MPDO జయరాం పేర్కొన్నారు. నేరేడుగొమ్ము ఎంపీడీవో కార్యాలయంలో ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల నియంత్రణలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి మొత్తం నాలుగు దశల్లో పూర్తవుతుందన్నారు.
KMR: జుక్కల్ మండల కేంద్రంలోని ఆలయానికి సంబంధించిన 3 పెద్ద ఆవులను, 9 ఆవు దూడలు ఎవరో గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారని జుక్కల్ గ్రామస్తులు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. జుక్కల్ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవులు అపహరణకు గురయ్యాయని అన్నారు. 9 ఆవుల విలువ దాదాపుగా రూ. 90 వేలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
HNK: నడికూడ (M) చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను ఇస్రో సైంటిస్ట్ అనుమాండ్ల సుకృత సందర్శించారు. సుకృత మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు పిల్లలకు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథంతో విద్యాబోధన చేయాలని, అప్పుడే విద్యార్థులలో కొత్త ఆలోచనలు వస్తాయని, విద్యార్థుల పరిశోధనలే దేశ ప్రగతికి సోపానాలవుతాయని అన్నారు. ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
HYD: జీహెచ్ఎంసీ పరిధిలో 4500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నట్లుగా కమిషనర్ కర్ణన్ తెలిపారు. 18,557 మంది శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నారని, నగరంలో రోజుకు 7,810 టన్నుల గార్బేజి విడుదలవుతున్నట్లు TG చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకి సమాచారం అందించారు. GHMC వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.
RR: కేశంపేట మండలం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల సందర్భంగా కొత్తపేటలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని కేశంపేట ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయని, విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా పరీక్షలు రాయాలన్నారు.
RR: నందిగామ కన్హ శాంతి వనంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఇండియా స్కిల్ రిజనల్ కాంపిటీషన్ నేడు ముగింపుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్తో పాటు నగదు ప్రోత్సాహం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత విద్యతో పాటు ఏదో ఒక కొత్త రంగంలో నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు.
JN: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలపై ఎన్పిడిసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డితో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకువాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించే బాధ్యత నాదని ఎమ్మెల్యే అన్నారు.
SRPT: చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో రూ.394 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను మంగళవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన మంత్రి, పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను ప్రశ్నిస్తూ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.