GDWL: మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. జిల్లాలోని 40 కేంద్రాల్లో 8,110 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో మౌలిక వసతులతో పాటు, అత్యవసర వైద్యం కోసం ప్రాథమిక చికిత్స మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు.
SDPT: జిల్లాలోని 42 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
HYD: హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. నగరానికి తాగునీటి వనరులైన హిమాయత్ సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరుతున్నాయన్న ఆరోపణలపై జలమండలి సహా సంబంధిత శాఖలను ప్రతివాదులుగా చేర్చి, నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
WNP: పాల్గల్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో రేపు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులను ఆయన కోరారు.
NZB: అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పసుపు రైతులకు పలు సూచనలు చేశారు. నేడు పసుపు వ్యాపార లావాదేవీలు మూసివేయనున్నట్లు తెలిపారు. యార్డులో సరైన స్థలం లేకపోవడంతో మంగళవారం పసుపు రైతులు ఎవరూ తీసుకురావద్దని సూచించారు. బుధవారం నుంచి కనుగొళ్లు యథావిధిగా ఉంటాయన్నారు.
SRCL: వేములవాడ పట్టణంలోని శాస్త్రి నగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన 120.4 లీటర్ల వివిధ బ్రాండ్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. కోల మారుతి అనే వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు రూ.55 వేల విలువైన మద్యం సీజ్ చేసి, నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వివరించారు.
NRPT: పనిచేసే చోట మహిళలపై జరిగే లైంగిక వేధింపులు పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన పోష్ చట్టం అవగాహన వాల్ పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో విడుదల చేశారు. లైంగిక నిరోధక చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలు, పరిశ్రమలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.
KNR: కరీంనగర్ పోలీస్ విభాగానికి చెందిన పోలీస్ డాగ్ ‘టైసన్’ రాష్ట్ర స్థాయిలో ఘనత చాటింది. హైదరాబాద్ మొయినాబాద్లోని ఐఐటీఏ శిక్షణ కేంద్రంలో జరిగిన 24వ బ్యాచ్ ముగింపు వేడుకల్లో పేలుడు పదార్థాల గుర్తింపు విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా టైసన్ను, దాని హ్యాండ్లర్ పీసీఈ రాజును సీపీ గౌస్ అలాం అభినందించారు.
భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అలాగే భారీ వర్షం వల్ల మిర్చి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చి చివరి దశలో ఉండటంతో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారు.
MNCL: నిరుపేద లబ్ధిదారులకు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పారదర్శకంగా పంపిణీ చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ కమిటీ సమీక్లో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా, అర్హులైన వారందరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
MHBD: ఫిజికల్ సైన్స్ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులో నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూలులో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సింగారం దీక్షిత్ ప్రతిభ కనబరిచి జిల్లా ప్రథమ విజేతగా నిలిచాడు. దీక్షిత్ ప్రథమ బహుమతి, ప్రశంస పత్రం ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. దీంతో ఎంఈవో రాందాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు విద్యార్థిని అభినందించారు.
KMM: కామేపల్లి మండలంలోని కామేపల్లి, పాత లింగాల, కొమ్మినేపల్లి రైతు వేదికల్లో ఇవాళ ఉదయం 10 గంటలకు ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఏవో తారాదేవి తెలిపారు. నిషేధిత హెచ్ టీ పత్తి సాగుపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. సాగులో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు వివరించారు.
HYD: మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేస్ 1, ఫేస్ 2 ఆధునీకరణ ప్రాజెక్ట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. HMWSSB ప్రతిపాదనల మేరకు రూ. 722 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పనులకు నిర్ణయం తీసుకుంది. రూ. 282 కోట్లతో ఉస్మాన్సాగర్ మంచినీటి పైప్లైన్ ఆధునీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాలంచెల్లిన పైపులు, పంప్ హౌస్ల కారణంగా దాదాపు 30% నీటి సరఫరాలో నష్టం వాటిల్లుతోంది.
SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల్లో కావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలే ఓటమికి పాల్పడ్డారని వారిపై పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు సింహ వాహనంపై తిరువీధుల్లో విహరించారు. స్వామివారిని, అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి మాడవీధుల్లో ఊరేగింపు సేవ కొనసాగించారు. భక్తుల జయ జయ ద్వానాలతో, కళాకారుల నృత్యాలు మేళా వాయిద్యాలతో కన్నులవిందుగా కొనసాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.