MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం BFAC సమావేశం నిర్వహించారు. BFAC ఛైర్మన్ రౌతు సత్తయ్య, ADA రాజ నరేందర్ హాజరయ్యారు. సమావేశంలో రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచి, వ్యవసాయ అభివృద్ధిని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.
KMM: వెలుగుమట్ల భూబాధితులకు భరోసా కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి లోకసభసభ్యుడు ఈటల రాజేందర్ శనివారం ఖమ్మం విచ్చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఈటల రాజేందర్ బాధితులతో ముఖాముఖి సమావేశం కానున్నారు.
SRCL: పీఎం శ్రీ కింద జిల్లాలోని పలు విద్యాలయాల్లో అమలు అవుతున్న కార్యక్రమాలను పీఎంశ్రీ నోడల్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ ప్రవీర్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని మోడల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయాలను సందర్శించారు. జిల్లాలో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
ADB: రాష్ట్రీయ పర్ధాన్ జనజాతి ఉద్దాన్ సంఘటన్ సంస్థ సభ్యులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 15న నిర్వహించనున్న గోండి ధర్మ గురు హిరాసుకా లింగో జయంతి ఉత్సవాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ రావు, శంకర్, మాధవ్, తదితరులు ఉన్నారు.
NZB: ముప్కాల్ మండలం వేంపల్లిలో శుక్రవారం కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. రూ.1.16 లక్షల విలువైన రెండు చెక్కులను ఇద్దరు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులు సీఎం రేవంత్, బాల్కొండ కాంగ్రెస్ ఇంఛార్జ్ సునీల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి సర్పంచ్ మహేశ్ యాదవ్, రెవెన్యూ అధికారులు, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లయ్య పాల్గొన్నారు.
NZB: భీమ్గల్ మండలం రహత్ నగర్లో సేవాలాల్ జయంతి వేడుకల్లో రాష్ట్ర సహకారయూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. గిరిజన అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు. గిరిజన ప్రాంతంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
KNR: వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో చిగురుమామిడి మండలం సుందరగిరిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచ్ జంగా శిరీష ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. గ్రామంలోని హైస్కూల్ వద్ద ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న బావిని పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేయిస్తున్నారు.
JGL: అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బీ. రాజ గౌడ్ శుక్రవారం కోరుట్లలోని కస్తూర్భ గాంధీ బాలికల విద్యాలయం(KGBV) పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, విద్యా ప్రగతి, బోధన విధానాలపై సమీక్ష నిర్వహించారు. హాస్టల్ సదుపాయాలు, తాగునీటి వసతులు పరిశీలించి వంటగదిని సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, నిల్వ విధానాలపై ఆరా తీశారు.
GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే నా ప్రథమ ప్రాధాన్యత అని నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. విధి నిర్వహణలో పారదర్శకత ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
MDK: విశ్వకర్మలతో దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతరించిపోతున్న కళావృత్తులు, కళలను, చేతివృత్తులను ప్రోత్సహించి విశ్వకర్మల ఆర్థిక అభివృద్ధికి చేదోడు అందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
NLG: చిట్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్ను స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సుశీల పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పందిరి గీతకు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని కారుణ్య జ్యోతి హైస్కూల్లో శుక్రవారం అలుమ్ని మీట్ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో కార్పొరేట్ విద్యను అందిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించారని అన్నారు.
ASF: వాంకిడి మండలంలోని సోనాపూర్ గ్రామానికి చెందిన ఉప్పల కృష్ణకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గురునులే నారాయణ నూతన గృహాన్ని ఆవిష్కరించారు. పేద ప్రజల సాకారాన్ని నెరవేర్చేందుకే రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఉచితంగా ఇంటి నిర్మాణం చేస్తుందన్నారు.
VKB: బషీరాబాద్ మండలం పలు గ్రామాలలోని రైతులు ఆశతో సాగు చేసిన కంది పంట చేతికొచ్చే సమయంలో పాడైపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఆరుగాలం శ్రమించి పెట్టుబడులు పెట్టిన పంట కళ్లముందే నాశనమవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పాడైపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
JN: జనగామలో బాల్య వివాహ విముక్తి రథాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్తు అంధకారమవటం, విద్య, ఆరోగ్యంపై గొడ్డలి పెట్టులా మారుతున్నాయని, బాల్య వివాహాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా సమాజం ముందుకు నడవాలని, బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీ అన్నారు.