ATP: రాప్తాడులోని మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ భద్రతపై జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రత కోసం చట్టాలు, శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో సోదాలు చేపట్టింది. కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలో అధికారులు తనిఖీలు చేశారు. పాల నాణ్యతపై స్పాట్ టెస్ట్లు చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. లైసెన్స్ లేకుండా విక్రయిసస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ATP: నూతనంగా నియమితులైన మండల టీడీపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సేవా దృక్పథంపై నాయకులకు మార్గనిర్దేశం చేశారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేయాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
PDPL: పిల్లల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఇవాళ ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడడానికి ఏర్పాటుచేసిన ‘శక్తి’ కార్యక్రమం పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అమలు వల్ల విద్యార్థుల హాజరు శాతం. విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయని తెలిపారు. DEO శారద, అధికారులు పాల్గొన్నారు.
SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలికి సుడా నిధుల నుండి రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. అధునాతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కొరకు ఈ నిధులు ఉపయోగిస్తామన్నారు. దీంతో మున్సిపాలిటీ రూపు రేఖలు మారనున్నాయన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ASR: రాజవొమ్మంగి మండలంలో కారు అదుపు తప్పింది. గురువారం మధ్యాహ్నం జె.అన్నవరం నుంచి జడ్డంగి వైపుగా వస్తున్న టాటా నెక్సన్ కారు వైకుంటపురం గ్రామ సమీపంలో అదుపుతప్పి జీడి తోటలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతో కారు బోల్తా పడలేదని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నల్గొండ జిల్లాలో ప్రప్రథమంగా అంధ విద్యార్థులకు ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్ సదుపాయాలను జిల్లా గ్రంథాలయంలో ప్రారంభించడం గర్వకారణమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బ్లైండ్ (దృష్టి లోపం) పాఠకులు, విద్యార్థులకై ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్ను ఆయన ప్రారంభించారు.
TPT: శ్రీసిటీలో 55వ జాతీయ భద్రతా వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు భద్రత అవగాహన కార్యక్రమాలు, వ్యాసరచన, డ్రాయింగ్, ప్రసంగ పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 4న ముగింపు ఉత్సవం జరగనుంది.
PDPL: పెద్దపల్లి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పథకంలో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. మార్చి 25 లోగా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.
MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి రూ.6 కోట్లతో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కోర్సు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అప్గ్రేడ్ కు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు.
KNR: గంగాధర మండలం ఒద్యారం గ్రామ పంచాయతీలో గురువారం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ రైతు గుర్తింపు కార్డు గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజస్ట్రీని ఫిబ్రవరి 28లోగా నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో గోపి చంద్, సర్పంచ్ ఉమ పాల్గొన్నారు.
SRPT: పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన కృష్ణయ్య కుటుంబానికి ఇన్సూరెన్స్ నగదు చెక్కును అందజేసి మాట్లాడారు. సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించాలని, సిబ్బంది కుటుంబాలకు ఆరోగ్య భద్రత పథకం బాసటగా నిలుస్తుందన్నారు.
TG: ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కోసం ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్రెడ్డికి అందజేసింది. ఇవాళ సచివాలయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు CM రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావిధానం పైన ‘ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ’ పేరుతో ఉన్న నివేదికను సీఎంకు అందజేశారు.
ADB: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించింది. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు రూ. 151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.
ADB: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రాంగణంలో నూతన వధూవరుల ఫొటో షూటింగ్లకు అనుమతి లేదని ఆలయ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. గతంలో షూటింగ్లకు అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఏడాది నుంచి నాగోబా దేవస్థానంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు తీయరాదని నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.