HNK: కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రశాంతంగా ముగిసింది. టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు మాజీ కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థులు కాలంతో పాటు పరిగెత్తుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని మాజీఛైర్మన్ అన్నారు. ABSF ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరేష్, తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: వాయల్పాడు మండలం చింతపర్తి ప్రభుత్వ డాక్టర్ సాయిశ్రీ, ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పించేందుకు సోమవారం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మొదటి సంతానం ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగినప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలను స్వయంగా చాటిచెప్పాలనే ఉద్దేశ్యంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
E.G: జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, తదితరులు సోమవారం పి.గన్నవరం నియోజకవర్గ నాయకులతో సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో వేగవంతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగేలా చూడాలని పార్టీ నాయకులకు సూచించారు. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
KKD: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సామర్లకోట పంచరామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో బల్ల నీలకంఠం సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తామని, బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తామన్నారు. భక్తులు గమనించాలని కోరారు
NLR: కొండాపురం మండలంలోని ఆదిమూర్తిపురం నుంచి తూర్పు ఎర్రబల్లి వెళ్లే ఆర్అండ్బీ రహదారి గత కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోక గుంతలమయంగా మారిందని బీజేపీ నేతలు, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రాళ్లు తేలి ప్రయాణానికి వీలులేకుండా ఉన్న ఈ దారి వల్ల విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు.
AP: గుంటూరు జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన ఇంటిని అక్రమంగా ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేస్తూ దాసరి పాపయ్య అనే వృద్ధుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు అప్రమత్తమై పాపయ్య చేతిలోని పెట్రోల్ సీసాను లాక్కోవడంతో పెను ప్రమాదం తప్పింది.
BHNG: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చన 62 అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
AKP: గొలుగొండ మండలం లింగంపేట నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా తలనీలాలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కుకు సంబంధించి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. దేవాదాయశాఖ పర్యవేక్షణ అధికారి డి ఉమాదేవి, ఈవో సాంబశివరావు సమక్షంలో ఈ బహిరంగ పాట జరిగింది. సిహెచ్. శ్రీను రూ.66వేలకు పాటను ఖరారు చేసుకున్నారు.
SDPT: రసాయనిక రంగుల వల్ల కలిగే హానిని నివారించేందుకు గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రసాయన శాస్త్ర విభాగం, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థులు వివిధ రకాల పూలతో సహజ సిద్ధమైన రంగులను తయారు చేసి ప్రదర్శించారు. వైస్ ప్రిన్సిపాల్ గణపతిరావు మాట్లాడుతూ.. చర్మవ్యాధులకు కారణమయ్యే రసాయనాలకు దూరంగా ఉండాలన్నారు.
KNR: పోగొట్టుకున్న మొబైల్ను CEIR టెక్నాలజీ ద్వారా కనుక్కొని బాధితునికి అందించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. జనవరి 28న గంగాధర తిరుపతి అనే వ్యక్తి తన ఫోన్ను తీగలగుట్టపల్లిలో పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేశాడు. CEIR టెక్నాలజీ ద్వారా జగిత్యాలలో ఉన్నట్లు కనుక్కొని ఫోన్ యజమాని తిరుపతికి అందించారు.
KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈనెల 4న ఉదయం 10:30 గంటలకు పశువుల వేలం నిర్వహిస్తామని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి, పశు విభాగ శాస్త్రవేత్త ఎంవీ నిరంజన్ రెడ్డి ఇవాళ తెలిపారు. 3 ఆవులు, ఒక ఎద్దు వేలం వేస్తున్నామని చెప్పారు. ఆసక్తి కలిగిన రైతులు వేలం పాటలో పాల్గొనాలన్నారు.
MDK: నర్సాపూర్ డివిజన్ కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆర్డీవో రామకృష్ణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో పరీక్ష గదుల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
AP: రాష్ట్రానికి చెందిన వేలాది మంది గల్ఫ్లో ఉన్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘అందరినీ ప్రభుత్వం సురక్షితంగా తీసుకురావాలి. దీనిపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలి. ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి.. హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులోకి తేవాలి. సంక్షోభ సమయంలో రాజకీయాలు వద్దు’ అని పేర్కొన్నారు.
NLG: నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి గుట్టపై ఉన్న హరి-హర క్షేత్రమైన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి, శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానాలు మార్చి 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మార్చి 4 ఉదయం 6 గంటల వరకు మూసివేస్తారు. 3న జరిగే పౌర్ణమి కళ్యాణం రద్దు చేయబడిందని, ఇది తిరిగి చైత్ర మాసంలో జరుగుతుందని ఛైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు.
SRPT: నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నడిగూడెం మండల శాఖ సౌజన్యంతో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.