VZM: గజపతినగరం మండలం మధుపాడలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక టేకు తోటలో గుర్తుతెలియని వ్యక్తులు పొగతాగి పడేయడంతో మంటలు చెలరేగాయి. బుర్ల నాయుడు, అప్పలనాయుడు, కృష్ణలకు చెందిన రెండు ఎకరాల తోట దగ్ధమైంది. ఇందులో సుమారు రూ. 30 వేల ఆస్తి నష్టం వచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం పార్కును సందర్శించారు. ఈ మేరకు పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కును అందరికీ అందుబాటులో ఉండే వినోద ప్రదేశంగా తీర్చిదిద్దాలని అన్నారు. అలాగే, పచ్చని వాతావరణంతో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
NDL: రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం డోన్ మండలంలోని కొత్తబురుజులో జరిగిన సమావేశానికి కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సమస్యలు, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ఏర్పాటు ఇతర సమస్యలపై ప్రజలతో ఆమె నేరుగా మాట్లాడారు.
ATP: వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 2003 ఏప్రిల్ 9న ఎర్రటి ఎండలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్సార్ ఈ యాత్ర ప్రారంభించారని పేర్కొన్నారు. నాటి పాదయాత్రలో ఆయనతో కలిసి నడిచిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
CTR: చౌడేపల్లె మండలం బోయకొండ సమీపంలో ఈనెల 5న కుమారుని కళ్లెదుటే గాంధీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సాయి ప్రసాద్ తెలిపారు. నిందితులు నరసింహులు, లక్ష్మీపతి, రాసతి, నాగరాజులను గురువారం బోయకొండ ఆర్చి వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
E.G: రాజమండ్రి నుంచి కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాల సందర్శనకు ఏప్రిల్ 19 నుంచి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ మాధవ్ గురువారం తెలిపారు. 11 రోజుల పాటు సాగే ఈ యాత్రలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, అయోధ్య, బుద్ధగయ, అరసవెల్లి శ్రీ కుర్మం, అన్నవరం సహా 13 ఆలయాలను సందర్శించవచ్చు. టికెట్ ధర రూ.13,000గా నిర్ణయించినట్లు వెల్లడించారు.
GNTR: జనాభా గణనలో భాగంగా ప్రజలకు స్వీయ గణన (Self Enumeration) సదుపాయం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సీ.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. జనాభా గణనపై జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల శిక్షణ కార్యక్రమం అన్ని మండలాల్లో గురువారం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కడప రవీంద్రనగర్లో ఒంటరిగా తిరుగుతున్న మూడేళ్ల హాసన్ అలీ, ఏడాది వయసున్న మెహెక్ అనే ఇద్దరు చిన్నారులను పోలీసులు గుర్తించారు. వీరి తల్లిదండ్రులు అశ్రు, సుభహన్ అని బాలుడు తెలిపాడు. ప్రస్తుతం కడప తాలూకా పోలీస్ స్టేషన్లో పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఈ చిన్నారుల ఆచూకీ తెలిసిన వారు వెంటనే స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సచివాలయాన్ని తహసీల్దార్ చిరంజీవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికలు, రికార్డులను పరిశీలించగా వెల్ఫేర్ అసిస్టెంట్ ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు గుర్తించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విజయ సునీతకు నివేదికను అందిస్తున్నట్లు తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నం నుంచి పెడన వెళ్లే NH-216 హైవేపై ట్రాఫిక్ సీఐ ఎన్.రాజు హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు హెల్మెట్ ఎంతో కీలకమని తెలిపారు.
PPM: జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న ఫేస్ యాప్ ఇబ్బందులను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం పార్వతీపురంలోని డ్వామా (DWMA) కార్యాలయంలో హెచ్.ఆర్. బి.శివరామకృష్ణను కలిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు వినతిపత్రం అందజేశారు. నెట్-వర్క్ లేని ప్రాంతాల్లో కూలీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
KRNL: ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్-2026’లో భాగంగా ప్రధాని మోదీతో జరగనున్న సమావేశానికి రాయలసీమ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విద్యార్థిని జె.శివకీర్తి ఎంపికైంది. ఈ విషయాన్ని వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు తెలిపారు. గురువారం యూనివర్సిటీలో శివకీర్తిని అభినందించారు. దేశవ్యాప్తంగా 12 లక్షల మంది పాల్గొన్న వ్యాసరచన పోటీలో ఆమె ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణంలో బ్రెయినీ స్టార్ పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, విద్యా కిట్లను ప్రభుత్వం పారదర్శకంగా అందిస్తోందని పేర్కొన్నారు.
SKLM: వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకమైనదని వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. ఈరోజుతో 23 సంవత్సరాలు గడచిన సందర్భంగా టెక్కలిలో కేకు కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహానేత ఆశయాలకు అనుగుణంగా యువనేత జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
NDL: క్షేత్రస్థాయి ప్రజల నుంచి వచ్చే సమస్యలు, వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆదేశించారు. కల్లూరులోని ఆమె నివాసంలో పాణ్యం నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.